Friday, April 26, 2024

ఐఐటీఎఫ్‌ 2022లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్.. ప్రారంభించిన మంత్రి బుగ్గన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వాణిజ్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో పురోగతి సాధిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న 41వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2022లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. బుగ్గనతో పాటు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్, ఆంధ్రభవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమల శాఖ పెట్టుబడుల ప్రచారం, విదేశీ వ్యవహారాల సలహాదారు పీటర్ టి హసన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, స్పెషల్ కమిషనర్ ఎన్వీ రమణా రెడ్డి, ఏఆర్సీ హిమాన్షు కౌశిక్, లేపాక్షి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వ, పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ జీఎస్ రావు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

“వోకల్ ఫర్ లోకల్ – లోకల్ టు గ్లోబల్” నేపథ్యంతో తీర్చిదిద్దిన పెవిలియన్‌‌లో ఒక జిల్లా-ఒక ఉత్పత్తి కింద డ్వాక్రా, మెప్మా మహిళా సంఘాల ద్వారా రూపొందించిన వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి-సంప్రదాయాలు, పర్యాటక ప్రత్యేకతను ప్రతిబింబించే భౌగోళిక గుర్తింపు కలిగిన ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, మ్యాంగో జెల్లీ, క్రిస్టల్ సంచులు, లెదర్ ఉత్పత్తులు, గుంటూరు మిర్చి, బందరు, తిరుపతి లడ్డు, మచిలీపట్నం కలంకారీ దుస్తులు, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి పట్టుచీరలను ఉంచారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన వస్తువులకు బ్రాండింగ్ పెంచి ప్రపంచ స్థాయిలో మరింత మార్కెట్ పెంచాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తున్నట్లు మంత్రి బుగ్గన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ లక్ష్యమైన ఆత్మనిర్భర్ భారత్ దిశగా సామాజిక, ఆర్థిక పరిపుష్ఠి సాధించడమే ఏపీ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఐఐటీఎఫ్‌ను కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం ప్రారంభించారు. ఈనెల 27 వరకు సాగనున్న ట్రేడ్ ఫెయిర్‌లో దేశ, విదేశీ ఎగ్జిబిటర్లు 2,500 పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, బెలారస్, ఇరాన్, నేపాల్, థాయిలాండ్, టర్కీ, యుఏఈ, బ్రిటన్ దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. ఈనెల 18 వరకు వ్యాపారవేత్తలకు, నవంబర్ 18 నుండి 27 వరకు సామాన్య ప్రజానీకానికి ట్రేడ్ ఫెయిర్‌కు అనుమతి ఉంటుంది. ఉదయం గం. 10:30 నుంచి సాయంత్రం గం. 7:30 వరకు ప్రదర్శన సాగుతుంది. వివిధ రాష్ట్రాలు, దేశాల పెవిలియన్స్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్ పర్యాటకులు, కొనుగోలుదారులను ఎంతో ఆకర్షిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement