న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విఘ్నాలను తొలగించే వినాయకుడి ప్రత్యేక పూజలతో దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రాంగణం మార్మోగింది. చిత్తూరు జిల్లా కాణిపాకం దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం కళ్యాణోత్సవం, శనివారం సంకటహర గణపతి వ్రతం కన్నులపండువగా జరిగాయి. కాణిపాకం నుంచి వచ్చిన వేద పండితులు వైభవంగా పూజాదికాలను నిర్వహించారు. శనివారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం వారి నాదస్వరంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆంద్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్, ఆయన సతీమణి ఐపీఎస్ భావనా సక్సేనా, భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్, ఉద్యోగులు, పోలీస్ అధికారులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వ్రతంలో భక్తిభావంతో పాల్గొన్నారు. ఏపీ భవన్ ఆధ్వర్యంలో భక్తులకు పూజా సామగ్రిని ఉచితంగా అందజేశారు. రెండు రోజులపాటు జరిగిన కళ్యాణోత్సవం, సంకటహర గణపతి వ్రతంలో పెద్దసంఖ్యలో తెలుగు వారు పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలతో భవన్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..