బీదర్: మైనారిటీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు.. మత ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించాలనే నిబంధన భారత రాజ్యాంగంలో లేదని పేర్కొన్నారు. మైనారిటీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు భారత రాజ్యాంగం ప్రకారం కల్పిస్తున్నవి కాదన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని తెలిపే నిబంధన రాజ్యాంగంలో లేదన్నారు. . ‘గరోటా షహద్ స్మారక్’ను సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. అదేవిధంగా 103 అడుగుల ఎత్తయిన జాతీయ జెండాను ఆవిష్కరించారు. కర్ణాటక శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమిత్ షా స్థానికంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ,.కాంగ్రెస్ ప్రభుత్వం పోలరైజేషన్ పాలిటిక్స్ కోసం మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చిందన్నారు. ఆ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేసిందని, ఆ కోటాను వొక్కళిగలకు, లింగాయత్లకు ఇచ్చిందని చెప్పారు. ఓటు బ్యాంకు కోసం దురాశతో కాంగ్రెస్ ఎన్నడూ స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునే కార్యక్రమాలను నిర్వహించలేదన్నారు. అదే విధంగా హైదరాబాద్ విముక్తి దినోత్సవాలను కూడా నిర్వహించలేదన్నారు.
హైదరాబాద్ విముక్తి, స్వాతంత్య్రం కోసం అనేక మంది ప్రాణత్యాగం చేశారని చెప్పారు. సర్దార్ పటేల్ లేకపోతే హైదరాబాద్కు స్వాతంత్య్రం వచ్చి ఉండేది కాదని అన్నారు. బీదర్కు కూడా స్వాతంత్య్రం వచ్చి ఉండేది కాదన్నారు హైదరాబాద్ విముక్తి పోరాటంలో గరోటా గ్రామస్థుల త్యాగాలు మరువలేనివన్నారు. 2.5 అడుగుల ఎత్తయిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు క్రూరుడైన నిజామ్ సైన్యం గరోటా గ్రామస్థులను హత్య చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే గ్రామంలో ఆ అమర వీరుల స్మారకాన్ని నిర్మించామన్నారు. కేవలం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు వందలాది మందిని హత్య చేశారన్నారు. అదే గడ్డపైన మనం 103 అడుగుల ఎత్తయిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం గర్వకారణమని చెప్పారు. ఇది ఎవరి దృష్టినీ తప్పించుకోదన్నారు. హైదరాబాద్ నుంచి నిజాం పాలకుడిని తప్పించడంలో మన దేశ తొలి హోం మంత్రి సర్దార్ పటేల్ పోషించిన పాత్రకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయన పోషించిన పాత్ర వల్లే బీదర్ భారత దేశంలో అంతర్భాగం అయిందని పేర్కొన్నారు.