Thursday, March 28, 2024

ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ.. తుది దశకు చేరుకున్న నిర్మాణ పనులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌ నగర నడిబొడ్డున నిర్మిస్తున్న 125 అడుగుల ఎత్తుగల బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహన్ని ఏప్రిల్‌లో అంబేద్కర్‌ జన్మదిన వేడుకల సందర్భంగా ప్రారంభిస్తామని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. నిర్మాణం పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. మార్చి చివరి నాటికి నిర్మాణం పనులు పూర్తి అవుతాయని ఆయన చెప్పారు. ట్యాంక్‌ బండ్‌ సమీపంలో 11.5 ఎకరాల్లో నిర్మితమవుతున్న అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణ పనులను మంత్రి ఆదివారం నాడు పరిశీలించారు. ఇప్పటికే అంబేద్కర్‌ విగ్రహంకు సంబంధించి 90 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.

- Advertisement -

విగ్రహం చుట్టూ ఎలివేషన్‌, స్మృతివనం, సెంట్రల్‌ లైబ్రరీ, ఫౌంటెయిన్‌ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. విగ్రహం అడుగుభాగంలో పార్లమెంట్‌ తరహా నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు. అంబేద్కర్‌ విగ్రహం కింద భాగంలో అంబేద్కర్‌ ఫోటో గ్యాలరీతోపాటు ఆయన గొప్పతనం, జీవితచరిత్రను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 125 అడుగుల ఎత్తు 45.5 అడుగుల వెడల్పులో విగ్రహం ఉంటుందన్నారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు పనులు త్వరతగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఆదేశించారు. అంబేద్కర్‌ ఆలోచనా విధానాన్ని మాటల్లో కాదు చేతల్లో తమ ప్రభుత్వం చూపుతోందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement