Friday, March 29, 2024

కోవిడ్ -19 మూడవ విడత నివారణకు అన్ని చర్యలు : సీఎస్ సోమేశ్ కుమార్

సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు రాష్ట్రంలో కోవిడ్ -19 మూడవ విడత నివారణకు అన్ని చర్యలను చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఇంటింటికీ ఆరోగ్యం పేరుతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటింటి ఫీవర్ సర్వే జరుగుతున్న ప్రక్రియను ఖైరతాబాద్ లోని హిల్ టాప్ కాలనీలో పరిశీలించారు. జీహెచ్ఎంసీ కమీషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఎస్ మాట్లాడుతూ… కోవిడ్-19 మూడవ విడతతో కానీ, ఓమిక్రాన్ తో కానీ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19వ్యాప్తిని పరిశీలిస్తే, క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోందని పేర్కొన్నారు. ఏవిధమైన అవాంఛనీయ సంఘటననైనా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని స్పష్టంచేశారు. ఇప్పటికే కోటికి పైగా మెడికల్ కిట్ లను సిద్ధంగా ఉంచామని, రోజుకు లక్ష పరీక్షలు చేస్తున్నామని వివరించారు. వారం రోజుల్లోగా పూర్తి చేసే ఈ ఇంటింటి ఫీవర్ సర్వేకు వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, పంచాయితీ రాజ్ శాఖలకు చెందిన సభ్యులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇంటింటి ఫీవర్ సర్వే ఒక్కొక్క టీమ్ లో ఆశా/ ఏ.ఎన్.ఎం/ మున్సిపల్/ పంచాయితీ శాఖ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి ఎవరైనా జ్వరం, దగ్గు తదితర ఇబ్బందులతో ఉన్నారా పరిశీలించి, ఒకవేళ కోవిడ్ లక్షణాలుంటే మెడికల్ కిట్ ను అందచేస్తారని వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ తో కలిపి దాదాపు 56 వేల పడకలు ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో సరిపడా ఆక్సిజన్ ఉందన్నారు. ఈ ఇంటింటి ఫీవర్ సర్వేను నీతిఆయోగ్ కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో వాక్సిన్ ప్రక్రియ విజయవంతంగా నడుస్తోందని అన్నారు. గతంలో రెండు విడతలుగా నిర్వహించిన ఇంటింటి ఫీవర్ సర్వే విజయవంతంగా జరిగి, సత్ఫాలితాలను ఇచ్చిందని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 4846 కాలనీల్లో, బస్తీల్లో కూడా ఇంటింటి సర్వే విజయవంతంగా ప్రారంభమైనదన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement