Friday, March 29, 2024

నిర్లక్ష్యం, ఆజాగ్రత్తతోనే యాక్సిడెంట్స్‌.. రూల్స్‌ పాటించి ప్రాణాలు కాపాడుకోండి: సజ్జన్నార్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పాదచారులు రహదారులపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండి సజ్జన్నార్‌ సూచించారు. అజాగ్రత్త వల్ల విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దని సూచించారు. ఈ ఏడాదిలో ఫిబ్రవరి వరకు రోడ్డు ప్రమాదాల్లో 283 మంది మరణించారనీ, ఇందులో 25 శాతం 71 మంది పాదచారులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ట్రాఫిక్‌ రూల్స్‌పై సరైన అవగాహన లేకపోవడం వల్లనే పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని విచారణలో వెల్లడైందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు టీఎస్‌ ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటున్నదనీ, దాదాపు 4 వేల మంది అద్దె బస్సు డ్రైవర్లకు ఇటీవల ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చిందన్నారు.

కానీ, పాదచారులు తెలిసో, తెలియకో చేసే చిన్నచిన్న తప్పిదాల కారణంగా ఆర్టీసీ బస్సులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయనీ, వీటి తీరును పరిశీలిస్తే వారికి ట్రాఫిక్‌ రూల్స్‌పై సరైన అవగాహన లేదన్న విషయం స్పష్టమవుతున్నదన్నారు. పాదచారులు ఫుట్‌పాత్‌లను ఉపయోగించుకోవాలనీ, రోడ్డు దాటేటప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దన్నారు. సెల్‌ఫోన్‌, ఇయర్‌ ఫోన్లు మాట్లాడుతూ రోడ్డు దాటడం ప్రమాదమనీ, దీనిని మానుకోవాలని చైర్మన్‌ బాజిరెడ్డి, ఎండి సజ్జన్నార్‌ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement