Tuesday, January 7, 2025

ACB – అవినీతి అనకొండ నిఖేష్ కుమార్‌ అరెస్ట్ – చంచల్‌గూడ జైలుకు తరలింపు

హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో నీటి పారుదల శాఖ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ నిఖేష్ కుమార్‌ను ఏసీబీ అరెస్టు చేసింది. అనంతరం నేటి ఉదయం జడ్జి ముందు హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో అధికారులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

కాగా, శనివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఆయన నివాసంతోపాటు అతడి బంధువులు, స్నేహితుల నివాసాలు, కార్యాలయాల్లో కలిపి మొత్తం 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఆస్తులకు సంబంధించిన పలు పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు.

సింగిల్‌ విండో అనుమతుల మంజూరు గురించి విని ఉంటాం.. కానీ, సింగిల్‌ విండో అవినీతి గురించి ఎప్పుడైనా విన్నారా? ఇరిగేషన్‌ శాఖలో ఏఈఈగా పని చేస్తూ సస్పెండైన ఓ వ్యక్తి.. దీనికి తెర తీశాడు. తన పై అధికారుల తరఫున కూడా ఆయనే రేటు మాట్లాడి అనుమతులు మంజూరు చేయించేవాడు. ఏసీబీ సోదాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

- Advertisement -

అవినీతి కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఇరిగేషన్‌ విభాగం అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ) నిఖేశ్‌కుమార్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తాజాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది.

గండిపేట జోన్‌లో ఏఈఈగా విధులు నిర్వహిస్తున్న హేరూర్‌ నిఖేష్‌ కుమార్‌.. ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వటానికి ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఈ ఏడాది మే 30న పట్టుకున్నారు. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న నిఖేష్‌ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శనివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు నిఖేష్‌ నివాసంతోపాటు అతడి బంధువులు, స్నేహితుల నివాసాలు, కార్యాలయాల్లో కలిపి మొత్తం 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఆస్తులకు సంబంధించిన పలు పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదు ప్రాంతాల్లో ఇంటి స్థలాలు, 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, ఖరీదైన అపార్ట్‌మెంట్లలో ఆరు ఫ్లాట్లు, రెండు వ్యాపార సముదాయాలు నిఖేష్‌ కుమార్‌కు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న పత్రాల ప్రకారం స్థిర, చర ఆస్తులు కలిపి మొత్తం రూ.17.74 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. మార్కెట్‌ ధర ప్రకారం వీటి విలువ రూ.200 కోట్లకుపైగా ఉంటుందని భావిస్తున్నారు. సోదాల్లో గుర్తించిన ఆస్తులు కాకుండా బంగారం, బ్యాంకు లాకర్లు, బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలపైనా ఏసీబీ విచారణ కొనసాగుతోంది.

వాటాలు వేసి పంపకాలుపదేళ్ల క్రితం ఇరిగేషన్‌ శాఖలో చేరిన నిఖేష్‌ కుమార్‌ 2021 నుంచి గండిపేట జోన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గండిపేట జోన్‌ హైదరాబాద్‌ శివారుప్రాంతం కావడంతో అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. చెరువులు, కుంటల సమీపంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నిర్మాణాలు చేపట్టేందుకు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ నిబంధనలు ఆటంకంగా ఉండటంతో.. వారి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి ఎన్‌ఓసీ ఇచ్చేలా నిఖేష్‌ డీల్‌ కుదుర్చుకునేవాడని ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది.

పేరుకే ఏఈఈగా విధులు నిర్వహిస్తున్నా.. తన పై అధికారుల్ని సైతం ఒప్పించి ఫైల్‌ ఓకే చేయించేలా ఏకమొత్తంలో బేరం కుదుర్చుకునేవాడని తేలింది. కొన్ని సందర్భాల్లో ఒక్కో ఎన్‌ఓసీకి రూ.50 లక్షల వరకు కూడా వసూలు చేసినట్లు సమాచారం. వసూలు చేసిన మొత్తంలో సగానికిపైగా తాను తీసుకుని మిగిలిన దాంట్లో పైఅధికారులకు వాటాలు ఇచ్చేవాడని తెలుస్తోంది.

కొత్తూరు మండలం సిద్దాపూర్‌లో రూ.2.50 కోట్ల విల్లాను నిఖేష్‌ కొన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇరిగేషన్‌ విభాగంలో ఆయనతోపాటు పనిచేసే మరో ఐదుగురికి కూడా ఇక్కడే విల్లాలు ఉన్నాయి. దీనిపైనా ఏసీబీ విచారణ జరుపుతోంది.పలువురు బినామీలు అక్రమంగా సంపాదించిన మొత్తాన్ని కాపాడుకోవడానికి నిఖేష్‌ బినామీలను పెట్టుకున్నట్లు ఏసీబీ గుర్తించింది.

దీంట్లో భాగంగా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తన చిన్ననాటి స్నేహితులను, బంధువులను ఎంచుకునేవాడు. వారికి రూ.5-10 లక్షల వరకు సహాయం చేసి వారి పేరుతో విలువైన ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు ఏసీబీ సోదాల్లో వెల్లడైంది. స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాల ఆధారంగా బినామీలకు నోటీసులు జారీ చేసి విచారించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నారు. 2021 నుంచి ఇప్పటి వరకు గండిపేట జోన్‌లో ఇరిగేషన్‌ విభాగం జారీ చేసిన అన్ని ఎన్‌ఓసీలపైనా ఏసీబీ దృష్టి సారించింది. నిఖేశ్‌తోపాటు ఉన్నతాధికారుల ప్రమేయంపైనా లోతుగా విచారణ జరుపుతోంది…

Advertisement

తాజా వార్తలు

Advertisement