Friday, April 19, 2024

Breaking | కూలీలతో వెళ్తున్న‌ ట్రాక్టర్ బోల్తా.. 20 మందికి గాయాలు

చిట్యాల రూరల్, (ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో కూలీల‌ను తీసుకెళ్తున్న ట్రాక్ట‌ర్ బోల్తాకొట్టింది. ఇది బావు సింగ్‌ప‌ల్లి శివారులో శనివారం సాయంత్రం జ‌రిగింది. ఈ ప్రమాదంలో పది మందికి తీవ్ర గాయాల‌య్యాయి. మరో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. భూపాలపల్లి మండలం నేరేడుపల్లి గ్రామానికి చెందిన 34 మంది కూలీలు బావు సింగ్ పల్లి శివారులో మిర్చి తోటలు ఏరేందుకు కూలీ పనుల నిమిత్తం ట్రాక్టర్ ట్రాలీ లో వచ్చారు.

కూలీ పనులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో ట్రాక్టర్ మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ట్రాక్టర్ డ్రైవర్ పబ్బ సిద్దుతో పాటు, పబ్బా సుజాత, అన్నారెడ్డి సరోజన, గంట సౌందర్య, తుపాకుల స్రవంతి, శ్యామల పద్మ, బోడకుంట్ల కవిత, బోడకుంట్ల లక్ష్మి, శ్రీపతి మమత, కేతిరి వినోదకు తీవ్ర గాయాలయ్యాయి. మరో పదిమంది కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాయాలపాలైన వారిని 108 వాహనంలో చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement