Tuesday, April 23, 2024

Big Story | 5 మెగావాట్ల సోలార్‌ ఫ్లోటింగ్‌ ప్లాంట్‌ ప్రారంభం.. త్వరలోనే అందుబాటులోకి రానున్న మరో 10 మెగావాట్ల ప్లాంట్‌

హైెదరాబాద్‌, ఆంధ్రప్రభ : సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో సింగరేణి మరో మైలురాయిని దాటింది. మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని జలాశయంలో నిర్మించిన నీటిపై తెలియాడే 5 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ను శనివారం సింగరేణి డైరెక్టర్‌ డి. సత్యనారాయణ ప్రారంభించి.. తెలంగాణ ట్రాన్స్‌కోకు అనుసంధానం చేశారు. దీంతో సింగరేణి సంస్థ సోలార్‌ విద్యుత్‌ సామర్థ్యం 224 మెగావాట్లకు చేరింది. ఇదే జలాశయంపై ఏర్పాటు చేసే మరో 10 మెగావాట్ల ప్లోటింగ్‌ సోలార్‌ ప్లాంటును మరో మూడు నెలల్లో పూర్తి చేయాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

- Advertisement -

సోలార్‌ ప్లాంట్ల నిర్మాణం రెండేళ్ల క్రితం ప్రారంభించిన సింగరేణి.. మూడు దశల్లో మొత్తం 300 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు రూపకల్పన చేశారు. దీనిలో మొదటి, రెండు దశల్లో 219 మెగావాట్ల సామర్థ్యం గల 8 ప్లాంట్లను మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు , రామగుండం,-3, మందమర్రి ఏరియాల్లో నిర్మించారు. ఈ ప్లాంట్లు అన్ని సమర్థవంతంగా పని చేస్తూ.. ఇప్పటీ వరకు 540 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా, కంపెనీకి దాదాపుగా రూ. 300 కోట్ల వరకు ఆదా చేకూరిందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

మూడో దశ నిర్మించే మొత్తం 81 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణానికి ఇప్పటికే టెంబర్‌ పూర్తయింది. అందులో భాగంగా 15 మెగావాట్ల సోలార్‌ ప్లోటింగ్‌ ప్లాంట్లను సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్ర ఆవరణలోని జలాశయాలపై నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. తొలిసారిగా చేపట్టిన 5 మెగావాట్ల సోలార్‌ ప్లాటింగ్‌ ప్లాంట్‌ అందుబాటులోకి రాగా, మిగతా 10 మెగావాట్ల ప్లాంట్‌ త్వరలోనే ప్రారంభించనున్నట్లు సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. ప్లాంట్‌ నిర్మాణానికి కృషి చేసిన సంబంధిత అధికారుల, సిబ్బందిని ఆయన అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement