Thursday, April 25, 2024

ఆస్పత్రిలో కలకలం.. 37 మంది డాక్టర్లకు కరోనా

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. సర్ గంగారామ్ ఆసుపత్రిలో 37 మంది డాక్టర్లకు ఒకేసారి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడం తీవ్ర కలకలం రేపింది. కొన్ని రోజులుగా ఆసుపత్రులకు వస్తున్న కరోనా రోగుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో బెడ్లు నిండుకున్నాయి. వీరిలో పలువురు హెల్త్ కేర్ వర్కర్లు కూడా ఉన్నారని అధికారులు అంటున్నారు. ఇక సర్ గంగారామ్ ఆసుపత్రిలో కరోనా బారిన పడిన వైద్యుల్లో చాలా మంది యువకులేనని, వారిలో అత్యధికులు వ్యాక్సిన్ తీసుకున్నారని ఉన్నతాధికారులు వివరించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ కరోనా రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా వారు ఎవరెవరిని కలిశారన్న విషయమై విచారణ ప్రారంభించామని, కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తూ, వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ వైద్యుల్లోని చాలా మందిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ 37 మందిలో 32 మంది ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారని, మిగతావారికి మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోందని అధికారులు తెలిపారు. దాదాపు ఏడాదిగా వీరంతా కరోనా సోకిన వారితోనే గడుపుతూ వచ్చారని వెల్లడించారు. కాగా గురువారం నాడు ఢిల్లీలో 7,437 కొత్త కేసులు వచ్చాయి. ఇప్పటివరకూ ఢిల్లీ పరిధిలో కరోనా కారణంగా 11,157 మంది మరణించారని నగర వైద్యాధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement