Thursday, April 25, 2024

Big Story | రోజుకు 3వేల మంది అవుట్‌.. టెక్‌ కంపెనీల్లో మాస్‌ లే ఆఫ్స్!

ఆర్ధిక మాంద్యం, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, సప్లయ్‌ చైన్‌లో సమస్యలు ఇలా రకరకాల కారణాలతో టెక్‌ కంపెనీలు ఉద్యోగాలను ఊచకోత కోస్తున్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ, వారి జీవితాలను సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ఒక పక్క మూడో త్రైమాసికంలో భారీ లాభాలు ప్రకటించిన కంపెనీలు కూడా ఇలా సాకులతో ఉద్యోగులను తొలగించడం పట్ల తీవ్ర ఆగ్రహం, ఆందోళన, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 2022లో ప్రారంభమైన ఉద్యోగుల తొలగింపు, 2023లో రెట్టించిన వేగంతో సాగుతోంది. జనవరిలో ఇప్పటి వరకు 166 చిన్నా పెద్ద కంపెనీలు కలిసి 65 వేల మంది ఉద్యోగులపై వేటు వేశాయి. 2022లో వెయ్యి కంపెనీలు 1,54,336 మందిని తొలగించాయని లేఆఫ్స్‌ను ట్రాక్‌ చేస్తున్న వెబ్‌సైట్‌ లేఆఫ్స్‌ డాట్‌ ఎఫ్‌వైఐ తెలిపింది. ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల్లో ఇండియాకు చెందిన పెద్ద కంపెనీలు, స్టార్టప్‌లు కూడా ఉన్నాయి. కొత్త సంవత్సరంలో రోజుకు సగటున 3వేలకుపైగా ఉద్యోగులుపై కంపెనీలు వేటు వేస్తున్నాయి. ప్రపంచంలోనే అగ్రగామి సంస్థలుగా ఉన్న మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి.

లేఆఫ్‌లపై గూగుల్‌ ఉద్యోగుల ఆందోళన..

గూగుల్‌ మాతృ సంస్థ అల్ఫాబెట్‌ 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది మొత్తం కంపెనీ ఉద్యోగుల్లో 6 శాతం. దీనిపై అల్ఫాబెట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏడబ్ల్యూయూ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం కంపెనీ సామర్ధ్యంపై ప్రభావం చూపుతుందని, ఇన్నోవేటీవ్‌ కార్యక్రమాలకు ఇబ్బందులు వస్తాయని హెచ్చరిచింది. ఉద్యోగుల తొలగింపుపై ఈ యూనియన్‌ తొలిసారి గట్టిగానే తన గళం ఇప్పుతోంది. లేఆఫ్‌ల మూలంగా కింది స్థాయి ఉద్యోగులపైనే ఎక్కువ ప్రభావం ఉందని, మేనేజర్లు, ఆ పై స్థాయి అధికారులపై ఎలాంటి ప్రభావం లేదని వర్కర్స్‌ యూనియన్‌ స్పష్టం చేసింది. ఈ త్రైమాసికంలోనే 17 బిలియన్‌ డాలర్ల లాభాలు గడించిన అల్ఫాబెట్‌ 12 వేల మందికి ఉపాధి లేకుండా చేయడం ఎంత మాత్రం అంగీకారయోగ్యం కాదని వర్కర్స్‌ యూనియన్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. లేఆఫ్‌ల విషయంలో కంపెనీ పారదర్శకత పాటించలేదని కూడా యూనియన్‌ విమర్శించింది. ఇది కంపెనీ ప్రతిష్టకు భంగం కలిస్తుందని, ఉద్యోగం నుంచి తొలగించిన వారి జీవితాల్లో అనేక మార్పులకు కంపెనీదే బాధ్యత అని స్పష్టం చేసింది. కంపెనీ ఈసీఓ సుందర్‌ పిచాయ్‌ సమాధానం చెప్పాలని యూనియన్‌ డిమాండ్‌ చేసింది.

- Advertisement -

మైక్రోసాఫ్ట్‌లో 10 వేల మంది..

మైక్రోసాఫ్ట్‌లో మూడో త్రైమాసికంలో 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఈఓ, ఛైర్మన్‌ సత్య నాదెళ్ల ప్రకటించారు. ఆర్ధిక వ్యయాలను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించకతప్పడంలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం భాదకారమైనప్పటికీ, తప్పడంలేదన్నారు.

అమెజాన్‌లో 18 వేలు..

అమెజాన్‌ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా 18 వేల మందికి తొలగిస్తున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. ఇందులో భారత్‌లో పని చేస్తున్న 1000 మంది కూడా ఉన్నారు. ప్రధానంగా కార్పొరేట్‌, టెక్నాలజీ జాబ్స్‌ ఎక్కువగా కోతకు గురయ్యాయి. ఈ సంవత్సరం మరికొన్ని లే ఆఫ్స్‌ ఉంటాయని అమెజాన్‌ సీఈఓ అండీ జెస్సీ తెలిపారు. వ్యయా నియంత్రణలో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

షేర్‌ఛాట్‌లో 20 శాతం

మన దేశానికి చెందిన సోషల్‌ మీడియా సంస్థ షేర్‌ ఛాట్‌( మోహాల్లా టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌)లో మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం మందిని తొలగించింది. ఈ నిర్ణయం వల్ల 500 మందకిపైడా ఉద్యోగాలు కోల్పోయారు. డిమాండ్‌ తగ్గడం వల్లే ఉద్యోగులను తొలగించినట్లు షేర్‌ ఛాట్‌ తెలిపింది.

సేల్స్‌ఫోర్స్‌లో 7వేలు మంది

ప్రముఖ బీ టూ బీ స్టాఫ్ట్‌వేర్‌ కంపెనీ సేల్స్‌ఫోర్స్‌లో 7 వేల మందిని తొలగిస్తున్నట్లు కంపెనీ సీఈఓ మార్క్‌ బేనాఫ్‌ జనవరి 4న ప్రకటించారు. మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

విమ్కో భారీ లేఆఫ్స్‌..

ప్రముఖ వీడియో హోస్టింగ్‌ ప్లాట్‌ఫామ్‌ విమ్కో ఈ సంవత్సరంలో 11 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 2022 జులైలో ఈ సంస్థ మొదటి విడతలో 6 శాతం మందిని తొలగించింది. సంస్థ ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు ఉద్యోగుల తొలగింపు తప్పడంలేదని సంస్థ ఈసీఓ అంజలీ సూద్‌ తెలిపారు. విప్రోలో 400 మంది ఫ్రెషర్స్‌ను తొలగిస్తున్నట్లు కంపెనీ శనివారం ప్రకటించింది. వీరి పనితీరు బాగోలేదన్న సాకుతో వీరిని ఉద్యోగం నుంచి తొలగించింది.

ఆన్‌ లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ 380 మందిని తొలగించింది. కంపెనీ ఆర్ధికంగా నష్టాల్లో ఉన్నందున ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఎండ్‌ టూ ఎండ్‌ డిజిటల్‌ హెల్త్‌ కేర్‌ సంస్థ మెడ్‌బుడ్డీ మొత్తం ఉద్యోగుల్లో 8 శాతం, అంటే 200 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థను ఆర్ధికంగా మెరుగైన స్థితిలోకి తీసుకు వచ్చేందుకు పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఓలా కంపెనీ 200 మందిని, వాయిస్‌ ఆటోమెటెడ్‌ సంస్థ ఎస్కిట్‌ డాట్‌ ఏఐ కూడా జనవరిలోనే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. హోం డెలివరీ సంస్థ డంజో 3 శాతం ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపింది.

సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ సోప్‌వోస్‌ 450 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థ గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌లో ఇది 10 శాతమని సంస్థ తెలిపింది. ఖర్చులు తగ్గించుకుని, లాభాలు పెంచుకునేందుకు ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. 2023 ప్రారంభమే వేలాది ఉద్యోగుల జీవితాల్లో చీకట్లు నింపిందని ట్రేడ్‌ యూనియన్‌ నిపుణులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు పెద్ద సంఖ్యలోనే ఉద్యోగులను తొలగించే అవవకాశం ఉందని భావిస్తున్నారు. 2022లో ట్విటర్‌లో భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించారు. మొత్తం ఉద్యోగుల్లో ట్విటర్‌ ఇప్పటి వరకు 50 శాతం మందిని తొలగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement