Friday, April 19, 2024

తెలంగాణ వ్యాప్తంగా డయాగ్నోసిస్ సెంటర్లు.. రేపే ప్రారంభం

తెలంగాణలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వాస్పత్రుల్లో 19 డయాగ్నోసిస్ సెంటర్లను సోమవారం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. శనివారం ఆయన వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడి, రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల గురించి, పలు అంశాలపై అధికారులతో కేసీఆర్ చర్చించారు. గతంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లో వైద్య పరీక్షా కేంద్రాలు ప్రారంభానికి సిద్ధంగా వున్నాయనే విషయాన్ని, వైద్యాధికారులు తన దృష్టికి తెచ్చిన నేపథ్యంలో, వాటిని సోమవారం నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ వైద్యాధికారులను ఆదేశించారు.

మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, అదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్.. జిల్లాల్లోని ప్రధాన వైద్య కేంద్రాలలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసుకున్న డయాగ్నోసిస్ కేంద్రాలను సోమవారం సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందిచేందుకు, అన్నిరకాల వైద్యసేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురాటమే ప్రభుత్వ లక్ష్యం అని సీఎం కేసీఆర్ చెప్పారు. కరోనా వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో సహా పలు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపరిచామని కేసీఆర్ చెప్పారు.

ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తోందని కేసీఆర్ తెలిపారు. కరోనావైరస్ వ్యాప్తి నేపధ్యంలో కోవిడ్ టెస్ట్‌ల కోసం, చికిత్స కోసం అవసరమైన ఇతర పరీక్షల కోసం కూడా పేదలు నానా అవస్థలు పడుతున్నారని… ఈ నేపథ్యంలో ప్రజలకు సహాయ పడేందుకు ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తక్షణం 19 జిల్లాల్లో డయాగ్నసిస్ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇంకా అవసరమైన చోట్ల దశల వారీగా డయాగ్నోసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement