Tuesday, April 23, 2024

రావత్‌కు 17 గన్స్‌ సెల్యూట్‌.. ఒక్కో స్థాయి వ్యక్తికి ఒక్కో రకం..

ప్రొటోకాల్‌ ప్రకారం.. రావత్‌ దంపతులకు తుపాకీ వందనం (గన్‌ సెల్యూట్‌) సమర్పిస్తారు. అంత్యక్రియల సందర్భంగా బిపిన్‌ రావత్‌కు 17 గన్‌ సెల్యూట్‌ సమర్పించారు. తుపాకీ వందనం సమర్పించడం అంటే.. ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అర్థం. రాజకీయం, సాహిత్యం, న్యాయ, విజ్ఞాన, కళా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి గన్‌ సెల్యూట్‌ సమర్పిస్తారు. అలాగే స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజు కూడా గన్‌ సెల్యూట్‌ చేస్తారు. దీంతో పాటు భారత్‌ సైన్యం, యుద్ధ, శాంతి సమయాల్లో విశేష కృషి చేసిన వారికి సైనిక వందనం సమర్పిస్తోంది. అయితే ఒక్కొక్కరికి ఒక్కో విధమైన గన్‌ సెల్యూట్‌ ఉంటుంది.

బ్రిటిష్‌ కాలం నుంచే..
రాష్ట్రపతి, మిలిటరీ, సీనియర్‌ అధికారులు చనిపోతే.. 21 తుపాకీ వందనాలు (గాల్లోకి 21 సార్లు కాల్పులు) సమర్పిస్తారు. త్రివిధ దళాల్లో పని చేసిన వారికి అయితే 17 సార్లు గన్‌ సెల్యూట్‌ చేస్తారు. మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సీఎంల చనిపోతే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తే.. దేశ వ్యాప్తంగా సంతాప దినాలు ప్రకటించడం, జాతీయ జెండాను అవనతం చేయడం, దేశం అంతటా సెలవు ప్రకటించడం వంటివి చేస్తారు. బ్రిటిష్‌ సామ్రాజ్యం నుంచి భారత్‌దేశం 21 తుపాకీ వందనం సంప్రదాయం వస్తోంది. స్వాతంత్య్రానికి ముందు అత్యధికంగా 101 తుపాకీ వందనం ఉండేది. దీన్ని రాయల్‌ సెల్యూట్‌ అంటారు. దీని తరువాత 31 గన్‌ సెల్యూట్‌ ఉంటుంది. రాష్ట్రపతికి ఇది 21 గన్‌ సెల్యూట్‌కు వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement