Thursday, April 18, 2024

బల్క్ డ్రగ్ పార్క్‌కు 1,000 కోట్ల సాయం.. విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానున్న బల్క్‌ డ్రగ్‌ పార్క్‌లో ఉమ్మడి మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,000 కోట్ల ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్‌ ఖుబా వెల్లడించారు. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌లో మౌలిక వసతుల కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ దేశంలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ల ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ఫార్మాసూటికల్స్‌ విభాగం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.

విశాఖపట్నంలో ఎయిర్‌ కార్గో టెర్మినల్‌, విశాఖ పోర్టులో కంటైనర్‌ టెర్మినల్‌ వంటి రవాణా వసతులు సిద్ధంగా ఉన్నందున ఫార్మా కంపెనీలను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని బల్క్‌ డ్రగ్‌ పార్క్‌లను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా అని విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ద్వారా దేశీయ వినియోగంతోపాటు, ఎగుమతులకు అవసరమైన మందుల తయారీకి అనువైన వాతావరణ పరిస్థితుల కల్పనే ఈ పథకం ఉద్దేశమని చెప్పారు.

ఈ పథకం మార్గదర్శకాలను అనుసరించి బల్క్‌ డ్రగ్‌ పార్క్‌లో ఏర్పాటయ్యే ఫార్మా పరిశ్రమలకు ఫార్వార్డ్‌, బాక్‌వార్డ్‌ లింకేజీతో మద్దతుతో కనెక్టివిటీని కల్పించే అవకాశాల ప్రాతిపదికపైనే వాటిని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలో నిర్ణయం జరిగిందని మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement