Saturday, April 20, 2024

లక్ష ట్రాక్టర్లతో పార్లమెంట్‌ను ముట్టడిస్తాం: రాకేత్‌ తికాయత్‌ హెచ్చరిక

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో రైతులు చేస్తోన్న ఆందోళ‌న కొన‌సాగుతోంది. రైతుల ఉద్యమం వంద రోజులు దాటింది. ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్‌ లను తీర్చలేదు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండును నెర‌వేర్చ‌క‌పోతే మ‌రోసారి ల‌క్ష‌లాది ట్రాక్ట‌ర్ల‌తో నిర‌స‌న తెలుపుతామ‌ని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయిత్ హెచ్చ‌రించారు. ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడించడానికి సిద్ధమ‌ని ప్ర‌క‌టించారు. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయ‌న మాట్లాడుతూ… తాము జ‌న‌వ‌రి 26న 3,500 ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ప్రవేశించామ‌ని గుర్తు చేశారు. ఆ ట్రాక్టర్ల‌న్నీ అద్దెకు తెచ్చిన ట్రాక్టర్లు కావని చెప్పారు.

మధ్యప్రదేశ్ బీజేపీ నేత, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్ కు ఎలాంటి అధికారాలు లేవని ఆయ‌న ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయన సొంతంగా రైతుల‌కు ఎప్పుడూ సమాధానం ఇవ్వలేరని చెప్పారు. చర్చలకు కూడా ప‌లు ప‌త్రాలు పట్టుకుని వస్తార‌ని, వాటి ఆధారంగానే రైతుల‌కు సమాధానాలు ఇస్తారని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement