Thursday, April 25, 2024

యథాతథంగానే ఈపీఎఫ్ వడ్డీ రేటు

ఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) డిపాజిట్లపై వడ్డీరేటును 8.50 శాతంగా నిర్ణయించారు. కేంద్ర ధర్మకర్తల బోర్డు సమావేశం గురువారం శ్రీనగర్‌లో జరిగింది. ఈ సమావేశంలో వడ్డీరేటును ఖరారు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ దఫా వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉందన్న ప్రచారం తొలుత జరిగినా.. గతేడాది ఉన్న రేటునే యథాతథంగా ఉంచారు. కోవిడ్‌-19 మహమ్మారితో ఉత్పన్నమైన పరిస్థితుల దృష్ట్యా.. చందాదారులు భారీగా నగదును ఉపసంహరించుకున్నారు. అదే సమయంలో డిపాజిట్లు తగ్గిపోయాయి. గత ఏడాది డిసెంబరు వరకూ దాదాపు 2 కోట్ల మంది ఈపీఎఫ్‌వో వినియోగదారులు రూ.73వేల కోట్లను వెనక్కి తీసుకున్నారని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి (మార్చి 31) ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. 2018-19లో రూ.81వేల కోట్లను చందాదారులు వెనక్కి తీసుకోగా.. 2020-21లో అంతకుమించిన స్థాయిలో ఉపసంహరణలు ఉండొచ్చని అంచనా.

2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును 8.5 శాతంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాన్నే కొనసాగిస్తూ తాజాగా జరిగిన సమావేశం నిర్ణయం తీసుకున్నారని సమాచారం. 2018-19లో అది 8.65 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు తాజా బడ్జెట్‌లో ఈపీఎఫ్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల వాటా ఏడాదికి రూ.2.5 లక్షలు దాటితే వడ్డీపై పన్ను విధించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement