Thursday, March 28, 2024

ముగ్గురూ… ముగ్గురే!

అందరిదీ ఉద్యమ నేపథ్యమే
సీనియర్‌ లీడర్‌తో.. విద్యార్ధి నేతల పోరు
తొలిసారి ప్రత్యక్షపోరులో విద్యార్థి ఉద్యమ నేతలు
ఈటల, గెల్లు, వెంకట్‌ల మధ్య ముక్కోణ పోటీ


హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్త ఆసక్తిని కలిగిస్తుండగా, బరిలో ఉన్న ముగ్గురూ.. తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నవారే కావడం విశేషం. దీంతో బరిలో నిలిచిన వారి బలాబలాలు నియోజకవర్గ ప్రజలు బేరీజు వేసుకొంటున్నారు. మొన్నటి వరకు అధికార పార్టీలో ఉండి రెండు సార్లు మంత్రిగా చేసి.. ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌ను ఢీకొంటున్న విద్యార్థి నాయకుల తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకవైపు రాజకీయాల్లో తలపండిన నాయకుడు ఈటల రాజేందర్‌ ఉండగా.. మరోవైపు ఎంబీబీఎస్‌ వైద్యులు, మరొకరు రాజనీతి పరిశోధన విద్యార్థి.. మధ్య పోరు రసవత్తరంగా జరగనుంది. బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురూ.. ముగ్గురే అన్నట్లుగా ప్రచారజోరు కొనసాగించారు. ఇప్పటికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పని చేసి అనుభవ మున్న ఈటల రాజేందర్‌తో తలపడుతున్న ప్రత్యర్థులు ఇద్దరూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తొలిసారి అడుగు పెట్టిన వారు కావడం విశేషం.
ఈటల ప్రస్థానం ఇదీ
2002లో ఉద్యమ ప్రస్థానంలోకి అడుగుపెట్టిన ఈటల రాజేందర్‌.. టీఆర్‌ఎస్‌తో మమేకమై పని చేశారు. 2004 నుంచి జనరల్‌, ఉప ఎన్నికల్లో ఆరుసార్లు కమలాపూర్‌, హుజురాబాద్‌ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గంపై తిరుగులేని పట్టున్న ఈటల మరోసారి ప్రతికూల రాజకీయ పరిస్థితుల మధ్య సెంటిమెంట్‌తో తన పట్టు నిలుపుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం నియోజకవర్గమంతా కలియ తిరుగుతూ ఈటల తన ప్రభావాన్ని తగ్గించుకోకుండా పావులు కదుపుతున్నారు. ఓటు బ్యాంకు ఎక్కడ ఉంటుంది, ఏ ఓటర్లను ఎలా మల్చుకోవాలి అన్న విషయంపై అనుభవం గడించిన రాజేందర్‌.. ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఐదు నెలలకుపైగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఏడోసారి చట్ట సభలోకి అడుగు పెట్టాలన్న యోచనతో ప్రత్యర్థులకు చిక్కకుండా స్కెచ్‌లు గీస్తూ ముందుకు సాగుతున్నారు. బీజేపీ తరఫున బరిలోకి దిగిన ఈటల.. జాతీయ పార్టీ బలం తనకు మరింత తోడవుతుందని అంచనా వేస్తున్నారు.
గెల్లు ప్రస్థానం కూడా ఉద్యమమే
హుజురాబాద్‌ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో నిలిచిన గెల్లు శ్రీనివాస్‌ ప్రస్థానం కూడా ఉద్యమాల్లోంచే పుట్టింది. ఉస్మానియా వేదికగా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పీజీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి రాజనీతి శాస్త్రంలో పీహెచ్‌డీ విద్యార్థిగా కొనసాగుతున్నారు. ఆయన సతీమణి కూడా ఉస్మానియా విద్యార్థిని.. ఎంఏ ఎకనామిక్స్‌ పూర్తి చేశారు. వీణవంక మండలానికి చెందిన గెల్లు శ్రీనివాస్‌ ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌లోనే చాలా కాలంగా ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా నియోజకవర్గంలో వస్తున్న మార్పులను అంచనా వేసుకొని నియోజకవర్గంలో తనకంటూ క్యాడర్‌ను కొంత తయారు చేసుకున్నారు. నియోజకవర్గంలో బలంగా ఉన్న ఈటల రాజేందర్‌ను ఓడించాలని తహతహలాడుతున్నారు. కొంతకాలంగా ఈటలకు, గెల్లుకు మధ్య అభిప్రాయ బేధాలు ఉండడంతో గెల్లు అధినాయకత్వం అండదండలతో పార్టీలో కొనసాగుతున్నారు. తన సొంత ఇమేజ్‌కన్నా పార్టీ ఇమేజ్‌ పైనే ఎక్కువగా ఆధారపడ్డారు. నియోజకవర్గంలో బీసీ కార్డును ఉపయోగించి సక్సెస్‌ అయ్యేందుకు పావులు కదుపుతున్నారు.
విద్యార్థి నాయకుని నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి..
కరీంనగర్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన బల్మూర వెంకట్‌ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొదటిసారి అడుగు పెట్టారు. గత ఎన్నికల్లో పెద్దపల్లి టికెట్‌ కోసం ప్రయత్నాలు చేసినా అవకాశం దక్కలేదు. అయితే అనూహ్యంగా హుజురాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం లభించడంతో వెంకట్‌ తన ప్రచారంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆలస్యంగా నియోజకవర్గంలోకి అడుగు పెట్టినప్పటికీ పార్టీ బలంతో పాటు ప్రజల్లోకి చొచ్చుకుపోతూ తనకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులకు హుజురాబాద్‌తో ఉన్న అనుబంధాలను ఆసరాగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఇమేజ్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత, ప్రధాన పార్టీల మధ్య కొట్లాట తనకు తోడవుతుందని బలంగా నమ్ముతున్నారు.
ఇద్దరూ విద్యార్థి విభాగ అధ్యక్షులే
టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఇద్దరూ కూడా విద్యార్థి విభాగాల రాష్ట్ర అధ్యక్షులే కావడం విశేషం. టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గెల్లు శ్రీనివాస్‌, ఎన్‌ఎంఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్న బల్మూరి వెంకట్‌.. ఇద్దరూ ఒకేసారి బరిలోకి దిగడం ఈ ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. సాధారంగా రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతల్లో ఉన్న నేతలు ఒకేచోట ప్రత్యర్థులుగా పోటీ చేయడం అత్యంత అరుదుగా ఉంటుంది. హుజురాబాద్‌ ఉప పోరు బరిలో ఉన్న కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇద్దరూ విద్యార్థి విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులు కావడం విశేషం.
ఓటర్ల మొగ్గు ఎటువైపో?
ఇద్దరు బీసీ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు కాగా.. ఒకరు ఫార్వర్డ్‌ క్యాస్ట్‌కు చెందిన వారు. ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన ఈటల రాజేందర్‌ బీజేపీ అభ్యర్థిగా.. యాదవ సామాజికవర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ వెలమ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి. సామాజిక సమీకరణలు, పార్టీల బలాబలాలు, సేవ, అంకితభావం, విశ్వసనీయత, సంక్షేమ పథకాలు, అధికారం ఇలా అనే అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనుండగా.. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తిగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement