గత వారం నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ లాభాలను ఆర్జించాయి. మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ఒరవడిని కొనసాగించాయి. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడంతో.. అక్కడి సంకేతాలతో ఆసియా మార్కెట్లన్నీ ఈరోజు పాజిటివ్ గానే ట్రేడ్ అయ్యాయి.ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోష్ను కనబరిచాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, దేశీయంగా కోవిడ్ కేసులు తగ్గుతుండడం, వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరందుకోవడం మదుపర్లకు ధైర్యాన్ని కలిగించాయి.
ఉదయం 48,990 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ చివరకు 848 పాయింట్లు లాభపడి 49,580 వద్ద ముగిసింది. ఇక, 14,756 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టిన నిఫ్టీ 245 పాయింట్లు ఎగబాకి 14,923 వద్ద స్థిరపడింది. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాలను ఆర్జించాయి. సిప్లా, లార్సన్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నష్టాలను చవిచూశాయి. గత వారం వరుస నష్టాలను చవిచూసిన బ్యాంకింగ్, ఆర్థిక వంటి కీలక రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి.