Friday, March 29, 2024

పాలనోత్సవం!


25న తెరాస ప్లీనరీ

  • అదేరోజు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక
  • 17న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో
    సీఎం కేసీఆర్‌ భేటీ… అనంతరం అధ్యక్షపదవికి నామినేషన్‌
  • మీడియా సమావేశంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీరామారావు
    హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి కావడంతో పాటు గ్రామ, మండల, వార్డు కమిటీల ఏర్పాటు పూర్తయిందని, ఈ నేపథ్యంలో ఈనెల 25న పార్టీ ప్లీనరీ నిర్వహిస్తున్నామని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. బుధవారం తెలంగాణభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ సెక్రటరీ జనరల్‌ కేకేశవరావు, మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాసగౌడ్‌లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి నుంచి రెండేళ్లకోసారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఆయన ప్రకటించారు. అక్టోబర్‌ 17న టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల అవుతుందన్నారు. అక్టోబర్‌ 17 నుంచి 22 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 23న నామినేషన్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. అక్టోబర్‌ 24న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. 25న టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడి ఎన్నికతో పాటు సర్వసభ్య సమావేశం, ప్లీనరీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ ప్లీనరీకి రాష్ట్ర వ్యాప్తంగా 14వేల మంది ప్రతినిధులను ఆహ్వానిస్తామని, హైదరాబాద్‌ హెచ్‌ఐసిసి వేదికగా ఇది జరుగుతుందన్నారు. ఈనెల 17న పార్టీ అసెంబ్లిd, శాసనమండలి, పార్లమెంటరీ సభ్యుల సమావేశం నిర్వహించనున్నామన్నారు. పార్టీకి సంబంధించిన తీర్మానాల కమిటీ చైర్మన్‌గా మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి వ్యవహరించనున్నారని తెలిపారు. పార్టీ అధ్యక్ష ఎన్నికకు ప్రొఫెసర్‌ శ్రీనివాసరెడ్డి రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తారన్నారు.
    జిల్లా కమిటీలు ప్లీనరీ తర్వాతే
    పార్టీ జిల్లా అధ్యక్షులు, కమిటీలను నూతన అధ్యక్షుడే నియమిస్తారని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. అధ్యక్ష ఎన్నిక తర్వాత నూతన జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీలను నూతన అధ్యక్షుడు ఖరారు చేస్తారన్నారు. నవంబర్‌ 15న బహిరంగసభ అనంతరం హైదరాబాద్‌, వరంగల్‌ మినహా మిగతా 31 జిల్లాల్లో పూర్తయిన టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాలను వరుసగా ప్రారంభిస్తామన్నారు. పార్టీ సంస్థాగతంగా పటిష్టంగా ఉందని, నూతన కమిటీలు, అనుబంధ సంఘాలకు సంబంధించిన వివరాలన్నీ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరాయన్నారు. గ్రామ, మండల, పట్టణ, బస్తీ, డివిజన్‌ కమిటీలన్నీ పూర్తయ్యాయని, పార్టీ కమిటీలతో పాటు అనుబంధ సంఘాల వివరాలు సంపూర్ణంగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి అందాయన్నారు. బహిరంగసభ తర్వాత పార్టీ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు ఉంటాయన్నారు.
    హుజూరాబాద్‌ ప్రాధాన్యఅంశం కాదు
    హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశం కాదని, అక్కడి నాయకులు కష్టపడుతున్నారు.. పనిచేసే వారు చేస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. అవసరమైతే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ హుజూరాబాద్‌ ప్రచారానికి వెళ్తారని, సభ ఖరారైతే ఆ షెడ్యూల్‌ ప్రత్యేకంగా విడుదల చేస్తారన్నారు. నవంబర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే విజయగర్జనకు కేసీఆర్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా ఉంటారని, దేశానికే మోడల్‌గా ఉన్న నాయకుడు కేసీఆర్‌ అని.. ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను ఆహ్వానించాలన్న ఆలోచన ప్రస్తుతానికి లేదన్నారు. తెలంగాణ సాధించడంతో పాటు ఏడున్నరేళ్ళ పాలనలో తెలంగాణను గర్వంగా ఉన్నతస్థితికి చేర్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. సమావేశంలో ఎంపీ రంజిత్‌ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు భరత్‌కుమార్‌, బండి రమేష్‌, బాలమల్లు, యువజన విభాగం అధ్యక్షుడు శంభీపూర్‌ రాజు, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, పర్యాద కృష్ణమూర్తి పాల్గొన్నారు.
    ………………
    లక్షలాదిమందితో విజయగర్జన
    రెండు దశాబ్దాల టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రస్థానం, ఏడేళ్ల జనరంజకమైన పాలన, తెలంగాణ సాధించిన చిరస్మరణీయమైన విజయాలు.. వీటన్నింటిని కూడా ఘనంగా జరుపుకోవడానికి నవంబర్‌ 15న వరంగల్‌ వేదికగా తెలంగాణ విజయ గర్జన పేరిట ఒక బహిరంగ సభను కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించబోతుందని కేటీఆర్‌ ప్రకటించారు. లక్షలాదిమందితో ఈ సభ నిర్వహిస్తామన్నారు. అక్టోబర్‌ 27న బహిరంగసభ విజయవంతం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement