Friday, April 19, 2024

నిర్లక్ష్యం నిజమే.. కేంద్ర గ్రాంట్లు భారీగా తగ్గుదల

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌: తెలంగాణకు కేంద్ర సాయం, గ్రాంట్లలో నానాటికీ దిగదుడుపే అన్నట్లుగా పరిస్థితి మారుతోంది. ప్రతీనెలా ఇవ్వాల్సిన ఆర్ధిక సాయాలు, హక్కుగా ఇవ్వాల్సిన పన్నుల వాటాను కేంద్రం దెబ్బతీస్తోంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణపై పలు ఆర్ధిక సాయాలు, సహకారాల్లో కేంద్రపు కోతలు స్పష్టంగా కావాలని చేస్తున్న నిర్లక్ష్యమేనని స్పష్టం చేస్తున్నాయి. అక్టోబర్‌ మాసంలో కేంద్రం నామమాత్రంగా రూ. 85కోట్లను గ్రాంట్ల రూపంలో విడుదల చేసింది. అక్టోబర్‌ చివరినాటికి కేంద్రం గ్రాంట్ల రూపేనా తెలంగాణకు 5592కోట్లను విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గ్రాంట్లను ఈ ఏడాదిలో రూ. 41వేల కోట్లుగా అంచనా వేసుకున్నది. అంటే గడచిన ఏడు నెలల్లో ఈ లక్ష్యంలో 13.64శాతమే కేంద్రం కరుణించింది.

ఇక బీజేపీ పాలిత రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో నిధులను ఇప్పటికే దాదాపు 890శాతం విడుదల చేసి తన ఔదార్యాన్ని కేంద్ర ప్రభుత్వం చాటుకోగా, బీజేపీయేతర ప్రభుత్వాలపై కావాలనే కుయుక్తులు పన్నుతోందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. గుజరాత్‌కు అక్టోబర్‌ చివరికి గ్రాంట్లు 79.15శాతం, కర్నాటకకు 66శాతం, కేరళ, పంజాబ్‌ మహారాష్ట్రలకు కూడా భారీగానే నిధులను విడుదల చేసింది.

- Advertisement -

అక్టోబర్‌ నాటికి తెలంగాణ స్వీయ రాబడులతో భారీ వ్యయాలను నెట్టుకొచ్చింది. రుణాల చెల్లింపులు, అడ్వాన్సులకు రూ. 26వేల కోట్ల అంచనాల్లో రూ. 11,708 కోట్లను చెల్లింపులు చేసింది. రెవెన్యూ వ్యయాలను రూ. 1,12,986కోట్లలో రూ. 37,093కోట్లను ఖర్చు చేసింది. వడ్డీలు రూ. 18,911కోట్లకుగానూ రూ. 11734కోట్లను చెల్లించింది. వేనతాలఉ రూ. 21499కోట్లను, పింఛన్లకు రూ. 8వేల కోట్లను,. సబ్సిడీలు రూ. 5710కోట్లను, పెట్టుబడి వ్యయంగా రూ. 9425కోట్లను ఖర్చు చేసింది.

రాబడుల్లో కీలక రంగానలుంచి ఆదాయాన్ని క్రమబద్దీకరించుకుంటూ సొంతంగా ఎదుగుతోంది.

జీఎస్టీ రాబడులు రూ. 23,493కోట్లురాగా, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు రూ. 8238కోట్లు, సేల్స్‌ టాక్స్‌ రూ. 17,329కోట్లు, కేంద్ర పన్నుల వాటా రూ. 5911కోట్లు, ఎక్సైజ్‌ డ్యూటీలు రూ. 10320కోట్లు, ఇతర పన్నులు, డ్యూటీలద్వారా రూ. 4832కోట్లు, పన్నేతర రాబడి రూ. 8796కోట్లు, గ్రాంట్లు రూ. 5592కోట్లు, అప్పులు రూ. 20057కోట్లుగా రికార్డయింది. రెవెన్యూ వ్యయం అంచనాల్లో 44శాతం చేరుకుంది. కేంద్రం సహకరించకపోయినా వ్యయాల విషయంలో తెలంగాణ ఎక్కడా కోతలు పెట్టడంలేదు. పెట్టుబడి వ్యయం 32శాతంగా నమోదు చేసుకున్నది. సొంత పన్నుల రాబడులు 55శాతం చేరుకున్నాయి.

సొంత వనరుల రాబడి గడచిన రెండేళ్లతో పోలిస్తే రెండింతలకుపైగా పెరుగుదల నమోదు చేసుకున్నది. గడచిన రెండేళ్ల క్రితం సొంత వనరుల రాబడి ఏడు నెలల్లో రూ. 22వేల కోట్లుకాగా, ఈ ఏడాది ఇది రూ. 40,788కోట్లకు వృద్ధి సాకారమైంది. 2022 యఅక్టోబర్‌ నాటికి పెట్రో ఉత్పత్తులపై రూ. 8770కోట్లు ఆదాయంరాగా, ఇది రెండేళ్లకంటే ఇప్పుడు డబుల్‌ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement