Thursday, March 28, 2024

తౌతే ఎఫెక్ట్ ముంబయిలో భారీ వర్షం.

అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌతే పెను తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది ముంబయికి పశ్చిమ వాయవ్య దిశగా కేంద్రీకృతమైంది. అయితే, ముంబయికి ఇది సమీపంలోనే ఉండడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇక్కడి మెరైన్ డ్రైవ్ బీచ్ లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే ముంబయి నగరం అతి భారీ వర్షాలతో జలమయం అయింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులు ముంబయిలోని అనేక చెట్లను పెకలించివేశాయి. లోకల్ రైల్ మార్గాలు, రోడ్లు దెబ్బతిన్నాయి. రాగల కొన్ని గంటల్లో మరింత భారీ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ సంస్థ పేర్కొన్నట్టు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది. కాగా, తౌతే ముంబయిని తాకుతూ వెళ్లిన నేపథ్యంలో నష్టం అపారంగానే ఉంటుందని ఐఎండీ వర్గాలు పేర్కొన్నాయి. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలపైనా తౌతే ప్రభావం తీవ్రంగానే ఉంది. 12 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తౌతే నేపథ్యంలో ముంబయి ఎయిర్ పోర్టు కార్యకలాపాలపై నిషేధాన్ని రాత్రి 8 గంటల వరకు పొడిగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement