భగ్గుమంటున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న తెలంగాణ ప్రజానీకానికి కాస్తంత రిలీఫ్ కలిగించే వార్త ఇది.. ఇక ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించే కబురును హైదరాబాద్ వాతావరణ శాఖ వినిపించింది. రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాల్లో రేపు (మంగళవారం) వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మరఠ్వాడా నుంచి కర్నాటక మీదుగా తమిళనాడు దాకా విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా రాష్ట్రంలో వర్షాలు పడే చాన్స్ ఎక్కువగానే ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే 48 గంటల పాటు హైదరాబాద్ నగరమంతా మేఘావృతం అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం, రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిస్తుందని, ప్రజలు అప్రమ్త్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.