Wednesday, April 24, 2024

తుపాకీతో హల్‌చల్ చేసిన రాజకీయ నేత కుమారుడు

హైదరాబాద్: జగద్గిరిగుట్టలోని అల్విన్ కాలనీ ఎల్లమ్మబండ వద్ద ఓ యువకుడు తుపాకీతో హల్‌చల్ చేశాడు. మంగళవారం రాత్రి 10:30 గంటల తర్వాత స్థానికంగా ఉన్న లాస్య వైన్స్ వద్దకు పోలీస్ సైరన్ వేసుకుంటూ కారులో వచ్చిన సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ హర్షారెడ్డి పార్కింగ్వి షయమై అక్కడే ఉన్న దిలీప్ పవార్ తో గొడవకు దిగాడు. ఇరువురి మధ్య మాటామాట పెరిగి దాడికి దారితీసింది. దీంతో ఆవేశంతో హర్షారెడ్డి తన కారులోని డ్యాష్ బోర్డు నుండి పిస్టల్ తీసి దిలీప్ పవార్‌పై గురిపెట్టాడు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్దానికులు కలగజేసుకుని ఇద్దరిని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం దిలీప్ పవార్ జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హర్షారెడ్డిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

తుపాకీతో హల్‌చల్ చేసిన హర్షారెడ్డికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. అతడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కుమారుడు అని, అతడు నగరంలో ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని, హర్షారెడ్డి భార్య సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్ అని సమాచారం. అలాగే హర్షారెడ్డికి గన్ ఎక్కడిది? ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? పోలీసు సైరన్ ఎలా ఉపయోగిస్తున్నారు అన్నదానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement