Wednesday, April 24, 2024

నేటి సంపాదకీయం-జిన్‌పింగ్‌కే జై కొట్టిన చైనా..

చైనాలో మావో జెడాంగ్‌ తర్వాత అంతటి శక్తి వంతునిగా జిన్‌పింగ్‌ ఆవిర్భవిం చారు. ఆయన ఇప్పుడు చైనాకు తిరుగులేని నాయకుడు. మూడు అధికార కేంద్రాలకు ఆయనే నాయకుడు. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా 2012 లో ఎన్నికైన జిన్‌పింగ్‌ చైనాను శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని చైనా మీడియా చేసిన ప్రశంసలో అత్యుక్తి లేదు. ఎందుకంటే ఆర్థిక సంస్కరణల అమలుకు ముందు చైనా కమ్యూనిస్టు దేశంగానే ప్రసిద్ధి. ఇప్పుడు ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాతో పోటీ పడుతున్న ఆర్థిక శక్తి. సోమవారం నుంచి ప్రారంభమైన నాలుగు రోజుల ప్లీనరీ సమావేశం చైనా చరిత్రలో అపూర్వమైన తీర్మానాన్ని ఆమోదించేందుకు రంగం సిద్ధమైంది.

అది ఆమోదం పొందడం కేవలం లాంఛనమే. ఈ తీర్మా నంతో జిన్‌పింగ్‌ చైనాకు జీవిత కాలపు అధ్యక్షునిగా కొనసాగే అవకాశం ఉంది.ప్రస్తుతం జరుగుతున్న ప్లీనరీ సమావేశాలకు 400 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ నిబంధనల ప్రకారం 68 సంవత్సరాలు దాటిన వారు తమ పదవుల నుంచి దిగిపోవాలి. కానీ, జిన్‌పింగ్‌కి మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుత ప్రధాని లీ కియాంగ్‌ సహా పలువురు నాయకులు వచ్చే సంవత్సరం ఆరంభంలో రిటైర్‌ కానున్నారు. పోలిట్‌ బ్యూరో లో కూడా సగం మంది వచ్చే ఏడాదికి రిటైర్‌ కానున్నారు. వారికి అటువంటి మినహాయింపు ఇస్తారాలేదాఅన్నది సందేహాస్పదమే. అయితే,జిన్‌ పింగ్‌ 2022 లోనూ 2027లోనూ తిరిగి అధినాయకుడు కావాలనీ, లేదా జీవిత కాలపు అధ్యక్షునిగా కొనసాగాలని అందరూ కోరుకుంటున్నారు. నూరేళ్ళ చరిత్రలో మూడోసారి జిన్‌పింగ్‌ కొనసాగాలన్న చారిత్రక తీర్మానాన్ని ఈ సమావేశాల్లో ఆమోదించగలరని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ విషయంలో అభిప్రాయ భేదాలులేవు. చైనాను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చి అజేయమైన ఆర్థిక శక్తిగా రూపొందించేందుకు జిన్‌పింగ్‌ ఇప్పటికే పలు పథకాలను అమలు జేస్తున్న నాయకునిగా ఇటు ప్రజలచేత, అటు మీడియా చేత ప్రశంసలు అందుకుంటున్నారు..ఐదేళ్ళక్రితం మావో తర్వాత అత్యంత ముఖ్యమైన నాయకునిగా ప్రకటించి ఆ విషయాన్ని రాజ్యాంగంలో పొందు పర్చారు. అప్పటి నుంచి తనకు ఇక తిరుగులేదన్నట్టుగా జిన్‌పింగ్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ క్రమంలో పుట్టుకుని వచ్చిందే మహామార్గం. అదెంత ప్రముఖమైనదో అంత వివాదాస్పదమైనది కూడా. పొరుగుదెశాల సరిహద్దులలోకి చొచ్చుకుని పోయేరీతిలో నిర్మించే ఈ మహామార్గం చాలా వివాదాస్పదమైనది. పాక్‌ ఆక్రమించిన కాశ్మీర్‌ భూభాగంగుండా ఈ మార్గం సాగనుంది. ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా ఇప్పటికే విద్యుత్‌ కేంద్రాల వంటి శాశ్వత కట్టడాలని సిద్ధం చేసింది. మహామార్గాన్ని పాకిస్తాన్‌ వంటి కొన్ని దేశాలు మినహా ఇతర దేశాలు వివిధ కారణాలు చెప్పి వ్యతిరేకిస్తున్నాయి.

అయినప్పటికీ, ఈ మహా మార్గ ప్రాజెక్టును కొనసాగించేందుకే చైనా నిర్ణయించుకుంది. ఇందు కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు సహా,ప్రాంతీయ, అంత ర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలను సేకరించింది. చైనాను పారిశ్రామికంగానేకాకుండా సాఫ్ట్‌ వేర్‌ రంగంలో అభివృద్ధి పర్చిన ఘనత జిన్‌పింగ్‌దేనని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆయన అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి ఎగుమతులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. చైనాఆధిపత్యాన్ని నిలబెట్టేందుకు ఆయన తీసుకున్న, తీసుకుంటున్న నిర్ణయాల్లో చాలా మటుకు నియంతృత్వ పోకడలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా హాంకాంగ్‌, తైవాన్‌ల విషయంలోనూ, దక్షిణ చైనా తీర ప్రాంతాల్లోని దేశాల విషయంలోనూ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ వివాదాస్పదమైనవే.

అలాగే, చైనాలో పాత తరం వారి పట్ల ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. జనాభా నియంత్రణ విషయంలో మావో కాలంనాటి విధానాన్ని మార్చడంపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేనినీ లెక్క చేయకుండా తాను అనుకున్నది సాధించాలనే పట్టుదల ఆయనలో ఉంది. ఏ సమస్య ఎదురైనా చలించి ముందుకు సాగే స్వభావమే ఆయనను తిరుగులేని నాయకునిగా తీర్చిదిద్దిందన్న ప్రశంసలు కూడా వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement