Tuesday, March 19, 2024

నేటి సంపాద‌కీయం – మ‌రిన్ని టీకాలు వ‌స్తున్నాయి…

క‌రోనా కట్టడికి కోవ్యాగ్సిన్‌ టీకా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర సంస్థలకు అందిం చేందుకు భారత్‌ బయోటెక్‌ అంగీకరించడం శుభ పరిణామం. భారత్‌లో ఇందు కు తగిన లేబొరేటరీ సౌకర్యాలు ఉండాలని ఆ సంస్థ పేర్కొంది.ఇతర సంస్థలకు కోవ్యాగ్సిన్‌ ఉత్పత్తిని అప్పగించే విషయమై భారత్‌ బయోటెక్‌ సంస్థతో చర్చించామనీ, బయట సంస్థల్లో కోవ్యాగ్సిన్‌ ఉత్పత్తికి భారత్‌ బయోటెక్‌ సానుకూలంగా ఉందని కేంద్రం తెలిపింది.చాలా రోజులుగా దీనిపై చర్చ జరుగుతోంది. భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేసే కోవ్యాగ్సిన్‌ కాకుండా, సీరం సంస్థ ఆస్ట్రానికాజెనికా సంస్థ టెక్నాలజీని ఉపయోగించి కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ని పూణ కేంద్రంగా తయారుచేస్తోంది. ఈ రెండుటీకాలు ప్రస్తుతం మన దేశంలో లభ్యమ వుతున్నాయి.అయితే, పెరుగుతున్న కేసుల సంఖ్యతో పోలిస్తే టీకాల ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉంది.ఈ పరిస్థితులలో ఈ రెండు టీకాల ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడంతో పాటు ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్‌లను దిగుమతి చేసుకోవడానికి గ్లోబల్‌ టెండ ర్లు పిలవాలన్న అభిప్రాయం పలు వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. కోవ్యాగ్సిన్‌ ఉత్పత్తిని ఇతర సంస్థలకు అప్పగించేందుకు భారత్‌ బయోటెక్‌ అంగీకరించగానే, జాన్సన్‌ జాన్సన్‌ సంస్థ ముందుకు వచ్చింది.కోవ్యాగ్సిన్‌ ఉత్పత్తి పెరిగితే, ఆగస్టు – డిసెంబర్‌ నాటికి 216 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండగలదనీ, అప్పుడు వ్యాక్సిన్‌ కోసం డిమాండ్‌ తగ్గగలదని కేంద్రం భావిస్తోంది. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ ఒక్కటే సరైన మార్గమని అమెరికా అంటువ్యాధుల చికిత్సా నిపుణుడు ఆంటోనీ ఫౌచీ మరోసారి స్పష్టం చేశారు.అమెరికాలో 45శాతం మందికి పైగా వయోజనులు రెండుడోస్‌ల వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అమెరికాలోకరోనా కట్టడిలోకి వచ్చింది.గత సంవత్సరం ఇదే సమయంలో నమోదైన కేసులతో పోలిస్తే ఈ ఏడాది కేసుల సంఖ్య తక్కువే. ఇది గొప్ప పరిణామం.కొత్త అధ్యక్షుడు జో బిడెన్‌ అధికారాన్ని చేపడుతూనే వ్యాక్సినేషన్‌ను పెంచేందుకు తీసుకున్న చర్యలు ఫలించాయి.మనదేశంలో కూడా వ్యాక్సినేషన్‌ను పెంచేందుకు ప్రభుత్వం వివిధ ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తోంది. ప్రభుత్వ,ప్రైవేటు సంస్థల్లో వేటిలోనైనా మానవీయ కోణాన్ని ప్రదర్శించినప్పుడే టీకాల ఉత్పత్తి పెరుగుతుంది.ఆక్సిజన్‌ విషయమే తీసుకుంటే, కొద్ది నిమిషాల ఆలస్యంగా ఆక్సిజన్‌ అందడంతో పదుల సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలను చూశాం.ఇప్పుడు ఢిల్లిdలో ఆక్సిజన్‌ అవసరాలు బాగా తగ్గాయనీ, తమ కోటాలో కొంత భాగాన్ని ఇతర ప్రాంతాలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి మనీష్‌ శిసోడియా ప్రకటించారు.అలాగే,వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెరిగితే, దేశంలో అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్‌ చేసేందుకు అవకాశాలు లభిస్తాయి.ప్రభుత్వం ఈ దిశలోనే పని చేస్తోంది.వ్యాక్సిన్‌ పేటెంట్ల హక్కులపై వాగ్వాదాలకు ఇప్పుడు సమయం కాదు. ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఈ సమస్యను పరిష్కరించడం కష్టం కాదు. ప్రభుత్వం ఇప్పుడు చొరవ తీసుకుంటోంది కనుక వ్యాక్సిన్‌ కొరత తీరవచ్చు.వచ్చే వారం రష్యన్‌ టెక్నాలజీతో తయారైన స్పూత్నిక్‌ టీకా మార్కెట్‌లో ప్రవేశిస్తోందని ప్రభుత్వం ప్రకటించింది.హైదరాబాద్‌ కేంద్రంగా రెడ్డి లాబ్స్‌ ఈ టీకాను రష్యా సహకారంతో విడుదల చేస్తోంది.అలాగే,ప్రముఖ ఫార్మా సంస్థ లు పిన్‌ ఎంఆర్‌ ఎన్‌ఏ కోవిడ్‌ కట్టడి వ్యాక్సిన్‌లను భారత్‌కు తీసుకుని రానున్నట్టు తెలిపింది.ఇది కూడా మంచి పరిణామమే. మన దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్‌లకు తోడు ఫైజర్‌,మాెెడర్నా వంటి సంస్థల వ్యాక్సిన్‌లను తెప్పించేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది.రెండు రోజుల్లో ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.వ్యాక్సిన్‌ కొరతను తీర్చడానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ చేస్తున్న కృషి ఫలిస్తోంది. ఆక్సిజన్‌ కొరత దాదాపు తీరినట్టేనని చెబుతున్నారు.అలాగే,వ్యాక్సిన్‌ కొరత కూడా కొద్ది రోజుల్లో తీరిపోవచ్చు. ఈ ఏడాది ద్వితీయార్థంలో కరోనా కట్టడి కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.అందువల్ల కరోనాపై పోరులో తరతమ భేదాలు,వ్యక్తిగత విమర్శలను కట్టిబెట్టి సంయుక్తంగా చేయిచేయి కలిపితే విజయం మనదే అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement