Thursday, April 18, 2024

కొషియారీ వాచాలత

మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కొషియారీ పూర్వాశ్రమంలో అధ్యాపకునిగా వ్యవహరించారు. ఆయన ఎన్నో విద్యా సంస్థలను నెలకొల్పారు. విద్యారంగంతో దశాబ్దాల బంధాన్ని కలిగి ఉన్న ఆయనకు ఛత్రపతి శివాజీ చరిత్ర తెలియదని ఎవరనుకుంటారు? పైగా ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. శివాజీని తక్కువ చేసి మాట్లాడితే ఇతర ప్రాంతాల వారికే రక్తం ఉడుకుతుంది.మహారాష్ట్ర వాసుల ఆగ్రహం కట్టలు తెగడంలో ఆశ్చర్యంలేదు. శివాజీ ఆశయాలు నేటి కాలా నికి వర్తించవంటూ కొషియారీ చేసిన వ్యాఖ్య మహారాష్ట్ర లో మంటలు రేపింది. ప్రస్తుత ముఖ్యమంత్రి అనుయా యుడు,శివసేన తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యే సంజయ్‌ గాయక్వాడ్‌ కొషియారీని మహారాష్ట్ర నుంచి వేరే రాష్ట్రా నికి బదిలీ చేయాలంటూ తీవ్ర స్థాయిలో ఎలుగెత్తారు. కొషియారీ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే సరైన రీతిలో స్పందించలేదంటూ ఆయనపైన కూడా గాయక్వాడ్‌ విమర్శలు చేశారు. ఏక్‌నాథ్‌ ఈ మధ్యనే రాహుల్‌ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు వీర్‌ సావర్కా ర్‌పై చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించి కాంగ్రెస్‌ కూటమితో తెంపులు చేసుకున్నారు.

ఈనేపథ్యం లో ఆయ న కొషియారీ వ్యాఖ్యపై వెంటనే స్పందించకపోయి ఉండవచ్చు. కొషియారీ అవిభక్త ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా,ఎమ్మెల్సీగా,ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.ఆయన మహారాష్ట్ర గవర్నర్‌ పదవిని చేపట్టినప్పటి నుంచి ఇదే మాదిరిగా వాచాలత్వానికి పాల్పడటం ఆయన వ్యాఖ్యలకు కొంత కాలం పాటు రాజకీయ వర్గాల్లో ఆగ్ర హావేశాలు వ్యక్తంకావడం, ప్రధానమంత్రి మోడీ,హోం మంత్రి అమిత్‌ షా సర్దిచెబు తూ జనాన్ని ఊరడించే ప్రకటనలు చేయడం అలవాటు అయింది. అటువంటి వివాదాస్పద నాయకుణ్ణి మహా రాష్ట్ర గవర్నర్‌గా కొనసాగించడం ఢిల్లి పెద్దల పొర పాటు,దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గవర్నర్ల పాత్ర వివాదాస్పద మవుతున్న ప్రస్తుత తరుణంలో కొషియా రీ వంటి వారిని ఆ పదవుల్లో కొనసాగించడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. కొషియారీ నేపథ్యాన్ని పరిశీలిస్తే,ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)తో ఆయన ప్రజాజీవితం ప్రారంభమైంది, ఆర్‌ఎస్‌ఎస్‌లో శిక్షణ పొందినవారికి శివాజీ వంటి పూర్వపు పాలకుల చరిత్ర తెలియకుండా ఉండదు. శివాజీ ఆశయాలు నేటితరానికి తగినవి కావనిఅంటూనే ఆయన రాజ్యాంగ నిర్మాత బీమారావు అంబేద్కర్‌నీ, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని పొగిడారు.

అంబేద్కర్‌ని పొగిడారంటే అర్థం ఉంది.ఆయన ఎప్పటికీ ప్రాత:స్మర ణీయుడే. ఆయనతో పాటు గడ్కరీని కలపడం ముమ్మా టికీ ఆక్షేపణీయం. కొషియారీ ఏ ఉద్దేశ్యంతో,ఏ సంద ర్భంలో శివాజీ ఆశయాల గురించి ప్రస్తావన చేశారో తెలి యదు. ఆంగ్లపాలకులకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల్లో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని రగిలించినవాడు శివాజీ. ఆయన పేరు చెబితే మహరాష్ట్ర వాసుల రక్తం మరిగి పోతుంది. శివాజీ పేరు మీదనే బాల్‌ థాకరే రాజకీయ పార్టీని దశాబ్దాల క్రితమే స్థాపించారు. మహారాష్ట్ర రాజకీ యాల్లో కొత్త వరవడిని సృష్టించారు.ఆయన జీవించి ఉన్నంత కాలం పార్టీకి తిరుగు ఉండేదికాదు. మహారాష్ట్ర లో ఆయన సహకారం లేనిదే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పా టు చేయగలిగేది కాదు.ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పాతికేళ్ళు కొనసాగింది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలో థాకరే మాటే పై మాటగా ఉండేది.రాష్ట్రంలో సంకీర్ణ మంత్రివర్గానికి శివసేన ఎమ్మెల్యేయే నాయకుని గా ఉండేవారు. ముంబాయిలో పెద్ద మైదానానికి శివాజీ అనే పేరు పెట్టడానికి బాల్‌థాకరేయే కారణం. శివ సైనికులేకాదు, మహారాష్ట్ర వాసులు శివాజీని దేవునితో సమానంగా పరిగణిస్తారు. శివసేన పార్టీ బాల్‌థాకరే కుమారుడు ఉద్ధవ్‌ థాకరే హయాంలో సరైన రీతిలో స్పందించడం లేదన్న భావన శివ సైనికులలో ఉంది.

బాల్‌ థాకరే జీవించి ఉంటే ఢిల్లి పీఠం దద్దరిల్లే రీతిలో హెచ్చరి కలు చేసి ఉండేవారు.ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే శివసేన భావజాలంలో పెరిగిన వారే కావడంతో గవర్నర్‌ని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కేంద్రాన్ని ఘాటుగా హెచ్చరించారు. కొషియారీ వ్యాఖ్యలు మహా రాష్ట్రవాసుల మనసును గాయపర్చాయి. అసెంబ్లిdలో ప్రతిపక్ష నాయకుడు,ఎన్సీపీ నాయకుడు అజిత్‌పవార్‌ తీవ్రంగానే స్పందించారు.మహారాష్ట్రలో రాజకీయ నాయకులకే కాదు, సామాన్యులకు ఈనాటికీ ఉత్తేజాన్ని కలిగించే శివజీ మహారాజ్‌ని అగౌరవ పరిస్తే ఎవరూ సహించరు. అందులోనూ శివసేన పార్టీకి చెందిన వారు అసలు ఊరుకోరు, అవిభక్త శివసేనలో మిలిటెంట్‌ వర్గం అంతా ఏక్‌నాథ్‌షిండే వర్గంలో ఉంది కనుక గొడవలేవీ జరగలేదనుకోవచ్చు. లేకపోతే ఈ పాటికి వీధికెక్కి వీరంగం చేసి ఉండేవారు. ఏమైనా విద్యావంతుడు, సంఘ్‌ పరివార్‌ నేపథ్యంగల కొషియారీ శివాజీ గురించి చేసిన వ్యాఖ్య ఎంత మాత్రం క్షమార్హం కాదు. ఆయన తన తప్పును తెలుసుకుని క్షమాపణ చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement