Saturday, April 20, 2024

లోన్‌ యాప్‌లకు చెంపపెట్టు!

ఇప్పుడు అన్నీ ఆన్‌ లైన్‌ సర్వీసులే. ఫోన్‌లో ఆర్డరిస్తే ఇంటికి భోజనం తెప్పించుకోవచ్చు.అలాగే, అప్పులు కూడా తెప్పించుకోవచ్చు. ఇందు కోసమే ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫారమ్‌లు అవతరించాయి.అయితే, ఈ లోన్‌ యాప్‌ల ద్వారా రుణం ఎంత సులభంగా లభిస్తుందో వీటి ద్వారా వేధింపులు కూడా అంత ఎక్కువగానే ఉంటాయి.లోన్‌ యాప్‌లు యమపాశాల వంటివి. ఒక సారి వాటిల్లో చిక్కుకుంటే బయటపడటం చాలా కష్టం. వాటిని వదిలించుకోలేక, లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు, ఒత్తిడులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకు న్న వారెంతో మంది ఉన్నారు. మీడియా ద్వారా వస్తున్న వార్తలు, కథనాలు పరిశీలిస్తే లోన్‌ యాప్‌లలో చిక్కుకొ వడాన్ని స్వయంకృతంగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే పరిమితమైన వనరులు ఉన్నప్పుడు ఖర్చులు, అలవాట్లు కూడా పరిమితంగానే ఉండాలి. లేని పక్షంలో రుణాల ఊబిలో చిక్కుకోక తప్పదు. నియమబద్ద మైన జీవనాన్ని సాగించే వారికి ఈయాప్‌ల గొడవ ఉండ దు. ఉద్యోగం చేసే వారు అత్యాశకు పోయి భారీ మొత్తంలో చీటీలు కడుతుంటారు. పాటపాడిన డబ్బు తిరిగి చెల్లించడం కోసం అప్పులు చేస్తారు. లేదా పేకాట, ఇతర జూదాలకు అలవాటు పడిన వారు సైతం అప్పుల విష చక్రంలో చిక్కుకున్న వారెంతో మంది మన చుట్టు పక్క లనే ఉంటారు. ఇలాంటి వారు మంచి సలహాలు స్వీకరించరు. ఆన్‌ లైన్‌ రుణ యాప్‌లు, ఇతర డిజిటల్‌ ఫ్లాట్‌ ఫారమ్‌ల కార్యకలాపాలను అదుపు చేయడానికి రిజర్వు బ్యాంకు కఠిన చర్యలు తీసుకోవాలని చాలా రోజుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికి రిజర్వు బ్యాంకులో కదలిక వచ్చింది. వీటిని అదుపు చేయడానికి కొన్ని మార్గ దర్శకాలను విడుదల చేసింది. వీటిని పాటిస్తే లోన్‌ యాప్‌ల కారణంగా ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడవచ్చు. అయితే, లోన్‌ యాప్‌ నిర్వాహకులే ఇందుకు కారణం కాదు. రుణాలు తీసుకునే వారూ ఇందుకు బాధ్యులే. తమ అవ సరాల కోసం రుణదాతలపై ఒత్తిడి చేస్తుంటారు. అయితే, ఇకపైన రుణ యాప్‌ నిర్వాహకులు మూడో పక్షం జోక్యం లేకుండా నేరుగా రుణ గ్రహీతల బ్యాంకు ఖాతాల్లో ఆ రుణం మొత్తాన్ని జమ చేయాలనే షరతు రిజర్వు బ్యాంకు పెట్టింది. అంతేకాదు, రుణాలు మంజూరు చేసే క్రమంలో ఫీజులు, చార్జీలను వినియోగ దారుల నుంచి వసూలు చేయవద్దని రిజర్వు బ్యాంకు షరతుపెట్టింది. లోన్‌ యాప్‌ల కార్యకలాపాలన్నీ రెగ్యులేటరీ పరిధిలోనే జరగాలనీ, రుణాలు ఇవ్వడం, వసూలు చేయడం అంతా నిబంధనలప్రకారమే జరగాలనీ, ఎన్ని ఒత్తిడులు వచ్చినా వీటిని అతిక్రమించరాదని కూడా రిజర్వు బ్యాం కు హెచ్చరించింది. సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల వద్ద తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుని అవసరార్ధుల కు ఎక్కువ వడ్డీపై అప్పులిచ్చే ప్రైవేటు వ్యక్తులను కూడా కట్టడి చేయడానికి రిజర్వు బ్యాంకు తగిన చర్యలు తీసు కోవాలని వినియోగదారులు కోరుతున్నారు. బ్యాంకు రుణాలు సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందడం లేదనీ, సంపన్న వర్గాలకు మాత్రమే లభిస్తున్నాయన్న ఫిర్యాదులపై రిజర్వు బ్యాంకు స్పందించాలి. ఇది విధాన పరమైన అంశమైనప్పటికీ ప్రభుత్వం దీనిపై దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరంఉంది.ఉద్యోగులే కాకుండా రోజువారీ వ్యాపారాలు చేసే వారు, చిన్న వ్యాపారులు పెట్టుబడుల కోసం ఈ రుణాల యాప్‌లపైనా, ప్రైవేటు వడ్డీ వ్యాపారులపైనా ఎక్కువగా ఆధారపడుతుంటారు. వారి అవసరాన్ని రుణదాతలు క్యాష్‌ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి ప్రైవేటు లెండింగ్‌ వ్యాపారులపై తగి న నియంత్రణ లేకపోవడం వల్ల కూడా యాప్‌ల వైపు బలహీనవర్గాలు చూస్తున్నారు.రుణాలు ఇచ్చిన వారికీ, తీసుకున్న వారికీ మధ్య వివాదం తలెత్తితే బ్యాంకు అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయాలనీ, 30 రోజుల్లోగా దీనిని పరిష్కరించాల్సి ఉంటుందని కూడా రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. లోన్‌ యాప్‌లకు సంబంధించి న అంశాలను లోతుగా అధ్యయనం చేసేందుకు గత సంవత్సరం మొదట్లో రిజర్వు బ్యాంకు ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకే ఈ మార్గ దర్శకాలను రూపొందించింది.రుణాలు తీసుకునే వారికి రుణదాతల వేధింపుల నుంచి ర క్షణ కల్పించేందుకే ఈ మార్గదర్శకాలను ఆర్బీఐ ప్రవేశపెట్టింది. అయితే, మార్గ దర్శకాలు ఇంతకు ముందూ ఉన్నాయి.వాటిని పాటించ క పోవడం వల్లనే రుణాల యాప్‌ల నుంచి రుణాలు తీసు కున్న వారి ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.వీటిని చట్ట బద్దం చేయడం కోసమే ఈ మార్గదర్శకాలను జారీ చేశా రు. ప్రైవేటు ఫైనాన్స్‌ వ్యాపారంపై అదుపు కోసం బ్యాంకు లు మరిన్ని చర్యలు తీసుకోవాలని రుణ గ్రహీతలు కోరు తున్నారు. వీటిపై ఆదాయంపన్ను శాఖ మరింత చురుకు గా చర్యలు తీసుకుంటే ప్రైవేటు ఫైనాన్స్‌ వ్యాపారం రుణ గ్రహీతలకు యమపాశాల్లా మారకుండా ఉంటాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement