Thursday, April 25, 2024

ఆహార సంక్షోభం అనివార్యం…

ఉక్రెయిన్‌ యుద్దాన్ని ఆపకపోతే ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోభం సంభవిస్తుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ తాను తగిన గణాంకాలతోనే ఈ హెచ్చరిక చేస్తున్నాని ప్రకటించారు.ఆయన మాటలు అక్షరాలా నిజం. నల్లసముద్రం మీదుగా రవాణాకు వీలు లేకపోవడం వల్ల గోధుమలు,చమురు గ్యాస్‌ వంటి నిత్యా వసరాల నిలల నౌకల రవాణా నిలిచిపోయింది. ఉక్రె యిన్‌లో గతంలో సేకరించిన 20 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలు చిక్కుబడిపోయాయి. ఇది గుటెరెస్‌ కు అందిన సమాచారం. అసలు ఉక్రెయిన్‌లో నగరాలకు నగరాలే నేలమట్టం అవుతుంటే ఆహార ధాన్యాలు. ఎరువుల నిలలు భద్రంగా ఉన్నాయని ఎవరైనా ఎలా అనుకోగలరు. ఉక్రెయిన్‌ రేవులనుంచి గ్యాస్‌ ట్యాంకర్లు, గోధుమ, జొన్న నిలలు పేరుకుని పోతున్నాయి.అసలు ఇవి భద్రంగా ఉన్నాయో లేదో అనుమానమే. రష్యా అగ్ని వర్షం కురిపిస్తుంటే, వేలాది మంది ఇప్పటికే మర ణించారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆహార ధాన్యాలు, నిత్యావసరాల ధరలు 30 శాతం పైగా పెరిగాయి. కోవిడ్‌ సంక్షోభం నుంచి ఇప్పటికీ అనేక దేశాలు బయటపడలేదు.మన దేశంలో పరిస్థితీ అదే. అయితే,ప్రభుత్వం ముందు జాగ్రత్తతో ఆహార ధాన్యాల నిలలను ఏర్పాటు చేయడం వల్ల గోధుమ,వరి వంటి ఆహార ధాన్యాలకు పూర్తిగా ఇబ్బంది లేకపోయినా, చమురు గ్యాస్‌ ధరలు,వంటనూనెల ధరలు నానాటికీ పెరిగి పోతున్నాయి. సామాన్య మానవునికి అందనంత ఎత్తులో పెరిగిపోయాయి. ముఖ్యంగా, వంటగ్యాస్‌ ధరలను ప్రభుత్వం దారుణంగా పెంచేస్తోంది. వారంలోపే మళ్ళీ గురువారం నాడు గృహ అవసరాలకు వినియోగించే వంటగ్యాస్‌ ధరను సిలిండర్‌కి మూడున్నర రూపాయిలు పెంచింది. గృహేతర అవసరాలకు ఎల్‌పీజీ ధరను కూడా కేంద్రం పెంచింది.కట్టుదిట్టమైన ,పకడ్బందీ వ్యవస్థ కలిగిన భారత్‌లోనే పరిస్థితి ఇలా ఉంటేఇతర దేశాల్లో ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. శ్రీలంక మనకు పొరుగు దేశం కనుక అక్కడి ప్రజల ఆకలి కేకలు మనకు వినిపిస్తున్నాయి. సుదూర ప్రాంతా ల్లోని దేశాల్లో ఆకలి, దప్పులతో ప్రజలు అలమటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో కూడా రష్యా తన పంతం నెగ్గించుకునేందుకు ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మన దేశం గోధుమల ఎగుమతిని నిషేధించినప్పటికీ, మానవీయ కోణంతో కొన్ని సడలింపులు ప్రకటించింది.

ఇందుకు గుటెరెస్‌ భారత్‌ని అభినందించారు.జర్మనీ వంటి వికసిత దేశాల్లోనే ఆహార భద్రతకు ప్రమాదం ఏర్పడిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగాఉందో ఊహించవచ్చు. జర్మన్‌ నవిదేశాంగ మంత్రి అన్నాలేనాబాయర్‌ బాక్‌ ఈ సంక్షొభానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రధాన కారకుడని ఆరోపించారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎదుర్కొంటున్నంత తీవ్రంగా ఆహార సంక్షోభాన్ని ఎన్నడూ ఎదుర్కోలేదనీ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకిన్‌ వ్యాఖ్యానించారు. ఇది మానవజాతికే ఎదురవుతున్న మహా ముప్పు అని ఆయన అన్నారు. పుతిన్‌తో తాను దాదాపు రోజూ మాట్లాడుతూనే ఉన్నాననీ,అయినా సానుకూల స్పందన రావడం లేదని గుటెరెస్‌ అన్నారు. ప్రజల్లో నానాటికీ నిరాశా నిస్పృహలు పెరిగిపోతున్నాయి. దాదాపుగా అన్ని దేశాలూ శ్రీలంకలా తయారైనా ఆశ్చర్యం లేదు. యుద్దోన్మాదులకూ, అణస్త్రాలపై మోజు పెంచుకుంటున్న వారికి ప్రపంచంలో కోట్లాది మంది ఆకలి బాధతో అలమటిస్తున్నారన్న ఇంగితం లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి దాపురిం చింది. ఉత్తరకొరియాలో కరోనా విజృంభిస్తున్నా, జనాన్ని గడగడలాడిస్తున్నా, ఆ దేశ సరోన్నత నాయకుడు కిమ్‌ అణ్వస్త్ర ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్టు దక్షిణ కొరియా పార్లమెంటు సభ్యుడు ఒకరుఆరోపించారు. పైగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ దక్షిణ కొరియాలో ఈ వారంలో పర్యటిస్తారని తెలిసి కూడా ఆయన తన యత్నాలను విరమించుకోకపోవడాన్ని బట్టి మాన వతం ఏ కోశానా లేని నాయకుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోందనిపిస్తోంది. వర్దమాన దేశాల్లొనే కాకుండా అభివృద్ధి దేశాల్లో కూడా ఆహార సంక్షోభం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే,సీయ రక్షణ విధానాలను అవలంబిస్తున్న దేశాలు మాత్రం సంక్షోభానికి దూరంగా ఉన్నాయి. మన దేశం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయరక్షణ విధానాలను అనుసరించాల్సిందేనని వివిధ వర్గాలకుచెందిన ప్రముఖులు, మేధావులూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement