Tuesday, April 23, 2024

నేటి సంపాదకీయం – కరోనా వేళ మహాకుంభ

కుంభమేళ పన్నెండేళ్ళకోసారి నాలుగు పవిత్ర క్షేత్రాల్లో నిర్వహిస్తారు. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యస్నానాల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచేకాకుండా, ఇతర దేశాల్లో స్థిరపడిన వారు వస్తుంటారు. కుంభమేళా పవిత్రమైన గంగానదిలో స్నానానికి నిర్వహించే ఇక్కడ మన పుష్కరాల మాదిరి పవిత్రమైన సంగమం. కులాలు, వర్గాలకు అతీతంగా పవిత్ర స్నానాలు ఆచరించే ఈ కార్యక్రమం సమైక్యతా స్ఫూర్తికి నిదర్శనం. మామూలు రోజుల్లో అయితే, ఇటువంటి వాటిని ప్రోత్సహించవల్సిందే. కరోనా కోరలు చాచి జాతి జనులను పీల్చి పిప్పి చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి కార్యక్రమాలను అనుమతించడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న ఆస్తికుల్లో హేతుబద్ధంగా ఆలోచించే వారిని వేధిస్తోంది. గంగా స్నానం గొప్పతనాన్ని పవిత్రతను మన పురాణాలు, వేదాల్లో ఎన్నో రీతుల్లో వివరించారు పెద్దలు. ఇలాంటి అవకాశాన్ని జారవిడవకూడదని బోధించిన మాటనిజమే. అయితే,
మంచిపనికైనా, పవిత్రమైన కార్యానికైనా సమయం, సందర్భం చూసుకోవాలని మనపెద్దలే చెబుతున్నారు. ఇటీవల తెలుగునాట జరిగిన తుంగభద్ర పుష్కరాలను పరిమిత సంఖ్యలో జనాన్ని అనుమతించారు. హరిద్వార్ లో జరుగుతున్న మహాకుంభకు లక్షలాది మందిని స్నానాలకు ఎలా అనుమతించారన్నప్రశ్నసహేతుకమైనదే. కోవిడ్-19 వ్యాప్తితో ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రభుత్వం ప్రకటించడానికి ముందే మహాకుంభ తేదీలను ప్రభుత్వం ప్రకటించిన మాట నిజమే. ఈ మహాకుంభలో సోమావతి అమావాస్య అయిన సోమవారంనాడు లక్షలాది మంది హరద్వార్ లో పుణ్య స్నానాలు ఆచరించారు. ఇందు కోసం వారు ఎన్నో రోజులు కాదు, నెలల ముందే టికెట్లను బుక్ చేసుకుని ఉంటారు. అందువల్ల చివరిక్షణంలో తమ ప్రయాణాన్ని మానుకోవడం వారికి సాధ్యం కాని మాటనిజమే కావచ్చు. అయితే, గత ఏడాది తొలి విడత కరోనా పంజా విసిరిన తర్వాత నైనా ఈ మహా కుంభకువచ్చేవారికి హెచ్చరికలు జారీ చేసి ఉంటే ఇంతమంది వచ్చేవారుకారేమో! పండుగలు, పర్వ దినాలకు కృష్ణ గోదావరి స్నానాలు చేసేందుకు వేలాదిమంది రావడం సహజం.

కొత్త సంవత్సరం ఆరంభంలో సూర్యభగవానునికి అర్హ్యన్ని విడిచి పెట్టడం, పెద్దలకు తర్పణాలు వదలడం తరతరాలుగా సంప్రదాయం. అలావచ్చేవారికి కోవిడ్ వ్యాప్తి కారణం గా తెలుగు రాష్ట్రాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. తుంగభద్రపుష్కరాలను కర్నూలు, అలంప వరం తదితర ప్రాంతాల్లో ఆంక్షల వల్ల చాలామంది ఈసారి సందర్శించలేకపోయారు. కానీ, ఉత్తరాదిన ఈ మహాకుంభకు హాజరైన యాత్రికులను దృశ్యమాధ్యమాల్లో చూస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా ఇంతమంది రాగాలరా అనే అనుమానం కలగ కమానదు. పుష్కరాలు ఎంత పవిత్రమైనవో, కుంభమేళా, మహాకుంభ కూడా అంత పవిత్రమైనవి. ఎవరి నమ్మకాలు వారివి. కానీ, దేశంలో పరిస్థితిని బట్టి పూజలూ, పునస్కారాల నూ, ఆచార వ్యవహారాలను కుదించుకుంటున్న వారు కొందరైతే, ఆకాశం విరిగి పడినా తమ ఆచారాలను వదిలిపెట్టబోమని స్పష్టంచేస్తున్న మరికొందరిని మన దేశంలో చూస్తున్నాం. స్నానం ఎక్కడ చేసినా పవిత్రమైనదనడం ఇలాంటి సందర్భాల్లో వితండం ఎంతమాత్రం కాదు. పదిమంది ఒకచోట చేరితేనే కరోనావ్యాపిస్తుందన్న హెచ్చరికలనే పధ్యంలో లక్షలాది మందిని ఎలా అనుమతించారో అర్ధం కావడం లేదు. అయితే, పవిత్రమైన ఉత్సవాలు, కార్యక్రమాలకు ఆంక్షలు విధిస్తే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్న భయంతోనే అనుమతించి ఉండవచ్చు. కానీ, ఇందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించి ఉండాల్సింది. గంగానది పరీవాహక ప్రాంతమంతా పవిత్రమైనదే.హరిద్వార్, అలహా బాద్, ఉజ్జయిన్, నాసిక్ లో జరిగే కుంభ, మహాకుంభ ఉత్సవాల్లో పవిత్ర స్నానాలు ఆచరించాలన్నది తరతరాలుగా హిందువుల నమ్మకమే వారిని అక్కడికి రప్పించి ఉండవచ్చు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారినిఅనుమతిస్తున్నామని అధికారులు వివరణ ఇస్తున్నారు. దేశ జనాభాలో ఆరు శాతం మందికే ఇంతవరకూ వ్యాక్సినేషన్ జరిగిందని ప్రభుత్వమే ఒకవంక పేర్కొంటోంది. మహాకుంభమహా పవిత్రమైనదే కానీ, పవిత్ర స్నానాలకు ఇది తగినసమయం కాదన్నదే విజ్ఞుల అభిప్రాయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement