Tuesday, March 19, 2024

నేటి సంపాద‌కీయం – లాక్ డౌన్ కోసం వ‌త్తిడి..

రెండో దశలో కరోనా కోరలు సాచి దేశంలో అపారంగా ప్రాణనష్టాన్ని కలిగిస్తుండ టంతో లాక్‌డౌన్‌ విధించడమే ఏకైక మార్గమని సామాన్యులే కాకుండా, నిపుణు లు కూడాప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు. అయితే, గత ఏడాది అనుభవాల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్రమోడీ తొందర పడటం లేదు. రెండువారాల క్రితమే ఆయన ఈ విషయమై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాష్ట్రాల్లో పరిస్థి తి తీవ్రతను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అయి తే, ఈ మధ్య కాలంలో కేసుల సంఖ్య బాగా పెరిగింది. ఇంకా పెరుగుతోంది. ప్రతి రాష్ట్రంలోనూ రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. భారత్‌లో పరిస్థితి పట్ల అంతర్జాతీయంగా వివిధ దేశాల నాయకులు, ఆరోగ్య రంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో అంటువ్యాధుల చికిత్సా నిపుణుడు ఆంటోనీ ఫౌచీ భారత్‌లో కొద్ది వారాల పాటు లాక్‌డౌన్‌ను విధించాలని సూచించారు. ఇప్పుడు సహా య, వైద్యసంరక్షణ కార్యకలాపాల్లో లోపాలు బహిర్గతం అవుతుండటంతో సైన్యాన్ని రంగంలోకి దింపాలని సూచించారు. దేశ విదేశాల నుంచి వస్తున్న ఆక్సిజన్‌ నిల్వలను అవసరమైన ప్రాంతాలకు సరఫరా చేయడంలో యంత్రాంగం విఫలంకావడం ఇందుకు నిదర్శనం. ఈ విషయంలో ఢిల్లిలో ఆక్సిజన్‌ సరఫరాపై సుప్రీంకోర్టు తాజాగా తీవ్ర వ్యాఖ్య లు చేసింది. ఢిల్లిd హైకోర్టు హెచ్చరించినా తగిన చర్యలు తీసుకోలేదేమని ఆగ్రహించింది. అలాగే, ఆక్సిజన్‌ అందక కొన్ని ఆస్పత్రుల్లో రోగుల ప్రాణాలు పోతుంటే, ఆక్సిజన్‌ సిలిండర్లు లీకై అగ్నిప్రమాదాలు సంభవించి మరికొన్ని ఆస్పత్రుల్లో రోగులు మరణిస్తున్నారు. నిర్వహ ణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుండటంతో ఆంటోనీ ఫౌచీ వంటి నిపుణులు ఇలాంటి సూచనలు చేస్తున్నారు. కనీవినీ ఎరుగని ఉపద్రవం ముంచుకుని వచ్చినప్పుడు వైద్య పరికరాలు, సాధనాలు, మందులనే కాకుండా, సిబ్బంది, వైద్యనిపుణుల సాయాన్ని విదేశా ల నుంచి పొందడంలో తప్పులేదని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చొరవ తీసుకుని తగిన ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు. ఇది యావత్‌ మానవ జాతికి ముంచుకొచ్చిన ముప్పు. ఇలాంటి సమయాల్లో ప్రజల ప్రాణాలను కాపాడ టమే ప్రధానంగా ఎవరైనా భావించాలి. రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ సైతం కరోనా చికిత్సకు సంబంధించి నిర్వహణ లోపాన్ని తప్పు పట్టారు. దీనిపై ఉన్నత స్థాయిలో ప్రభుత్వం స్పందించాలని ఆయన సూచించారు. ఆస్పత్రుల్లో షార్ట్‌ సర్క్యూట్‌ల వల్ల అగ్నిప్రమాదాలు తరచూ సంభవిస్తున్నాయి. గుజరాత్‌, కర్నాటక, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో ఇలాంటి ప్రమాదాలు సంభవించి కనీసం పాతికేసి మంది చొప్పున రోగులు సజీవ దహనమైన ఘటనలు యావత్‌ దేశాన్నీ కలచి వేశాయి. ఈ ప్రమాదాలు జరిగినవన్నీ ప్రైవే టు ఆస్పత్రులే కావడం గమనార్హం. అలాగే, ఆస్పత్రుల్లో పడకలు లేక ఆవరణలో చెట్ల కింద రోగులను స్ట్రెచర్లపై పడుకోబెట్టిన దృశ్యాలను దృశ్య మాధ్యమాల్లో చూస్తున్నాం. అంతేకాక, కర్ఫ్యూ నిబంధనలను ఎంత కఠినంగా అమలు జేస్తున్నప్పటికీ, ప్రమాదాలను కళ్ళారా చూస్తున్నప్పటికీ జనంలో మార్పు రావడం లేదు. జీవనోపాధికి వెరే మార్గం లేక బయటికి రావల్సి వస్తోందని వారు బహిరంగంగానే చెబుతున్నారు. లాక్‌డౌన్‌ విధిస్తే, రోజువారీ కూలీ లు, కార్మికులకు ఆర్థిక, వస్తు సాయాలను అందించే బాధ్యత ప్రభుత్వంపై పడుతుంది. అంతేకాక, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసకార్మికుల పోషణ బాధ్యత కూడా ప్రభుత్వం మీదపడుతుంది. కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న సమయంలో లాక్‌డౌన్‌ విధించడం ఎంత వరకూ వాంఛనీయమనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. వ్యాక్సినేషన్‌ అందరికీ జరిగేట్టు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న కరోనా నియంత్రణలో ప్రభుత్వానికి ప్రజలు సహకరిం చాలి. లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులేమిటోవారికీ అనుభవమే కనుక, అవి మళ్ళీ రాకుండా చూసుకోవాలంటే స్వీయ నియంత్రణకు వారు కట్టుబడి ఉండాలి. ఇప్పటికే అప్రకటిత లాక్‌ డౌన్‌ చాలా రాష్ట్రాల్లో అమలులో ఉంది. అందుకే, లాక్‌డౌన్‌ గురించి ఎంత ఒత్తిడి వచ్చినా ప్రధాని స్పందించడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement