Saturday, April 20, 2024

ఉత్తర ద్వార దర్శనం.. (ఆడియోతో)

ఉత్తర ద్వార దర్శనం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

శ్రీవైకుంఠ మహా నగరం నిత్య విభూతి, పరమ పదము, పరమ ధామము, పరమ వ్యోమ అనే పేర్లతో కీర్తించబడుతుంది. వైకుంఠము అనగా ఎటువంటి దివ్య శక్తులకు కూడా లొంగనిది, తన ప్రాభవాన్ని తగ్గించగల తప్పించగల ఏ శక్తి దాని ముందర లేవు. ఈ పరమపదం శక్తి అన్ని లోకాల్లో, విభూతులలో, వైభవాలలో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఎటువంటి వారైనా చివరకు కోరుకొనేది పరమపదాన్నే. పరమపదమునకు మించిన ఉత్తమ స్థానము మరొకటి లేదు. పరమాత్మ తన పరిపూర్ణ పరివారంతో అక్కడ వేంచేసి ఉంటాడు. వైకుంఠ నగరంలో అనంతమైన మణిస్థంభములతో నిర్మించబడిన మహా మణిమండపమున మధ్యలో అన్నిటి కంటే కింద కూర్మనాథుడు ఉంటాడు. అతన్ని ఆధారం చేసుకొని మహా దిగ్గజములు ఈ బ్రహ్మాండాన్ని మోస్తుంటాయి. ఆ దిగ్గజముల మీద అద్భుతమైన మహా పద్మం ఉంటుంది. ఆ మహాపద్మం మీద అనంతమైన పాదములు గల మహా సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద వేయి పడగలతో ఆది శేషుడు విరాజిల్లుతూ ఉంటాడు. అతని పైన పరమాత్మ శయనించి ఉంటాడు.

వైకుంఠానికి వెళ్లినవారందరూ పరమాత్మ సేవ చేయగల అదృష్టాన్ని పొందలేరు. కొందరు మహా కూర్మాన్ని చూస్తారు, మరి కొందరు అష్ట దిగ్గజాలను చూస్తారు, ఆ పైన మరి కొందరు మహా పద్మాన్ని, మరి కొందరు పరమాత్మ సింహాసనాన్ని చూస్తారు. ఆపైన చేరుకున్నవారు పరమాత్మను సేవించినా వారిలో కూడా నూటిలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే పరమాత్మ కైంకర్యాన్ని నోచుకుంటారు. వైకుంఠాన్ని చేరిన ప్రతి వారు పరమాత్మను దర్శించలేరు. దర్శించిన ప్రతి వారు ఆయన కైంకర్యాన్ని చేయలేరు. పరమాత్మను సేవించడానికి కావాల్సిన అనన్యమైన భక్తితో కూడుకున్న జ్ఞానము కలవారు మాత్రమే భగవంతుడిని దర్శించుకోగలరు, సేవించుకోగలరు. ఇటువంటి అనన్యమైన భక్తితో కూడుకున్న జ్ఞానమే ఉత్తర ద్వారం. ద్వారము అనగా మనము లక్ష్యాన్ని చేరడానికి సాధనము. మన లక్ష్యము భగవంతుడు ఉన్న లోకానికి వెళ్లడమా, భగవంతుడిని చూడడమా, భగవంతుడిని స్తోత్రం చేయడమా, భగవంతునికి సేవలు చేయడమా. భగవంతుడు ఉన్న లోకానికి వెళ్లడం దక్షిణ ద్వారం, భగవంతుడిని చూడడం తూర్పు ద్వారం, భగవంతుడిని కీర్తించడం పశ్చిమ ద్వారం, భగవంతుడిని సేవించడం అనగా కైంకర్యం చేయడం ఉత్తర ద్వారం. ఈ విషయాన్ని బ్రహ్మ పురాణం, పద్మ పురాణం, బ్రహ్మవైవర్త పురాణాలలో చాలా వివరంగా అందించారు.

వైకుంఠం చేరుకోగలగాలి అని చాలా మంది కలలు కంటూ ఉంటారు, వారి లక్ష్యం వైకుంఠాన్ని చేరడం మాత్రమే. మరి కొందరు వైకుంఠం వెళ్లాలి పరమాత్మను సేవించాలి అని కోరుకుంటారు, వీరి లక్ష్యం పరమాత్మ దర్శనం. వైకుంఠంలో స్వామి ముందర నిలబడి ఆయనను స్తుతించాలి అని మరి కొందరు కోరతారు, వారి లక్ష్యం పరమాత్మ స్తుతి మాత్రమే. ఇలాంటి వారు కాక తాము అన్ని కైంకర్యాలు పరమాత్మకే
చేయాలి అది కూడా పరమాత్మ చెప్పి చేయించుకోవాలి అని కోరుకొనే వారు వేల కోట్లలో ఒక్కరు మాత్రమే ఉంటారు. అటువంటి వారి గురించే ఆండాళ్ల మ్మ అంటే గోదాదేవి తిరుప్పావులో

ఉనక్కే నామ్‌ ఆట్‌ చెయ్‌ వోమ్‌
అని పలికింది. అనగా నీకే మేము అంతరంగ కైంకర్యములు చేయాలి అని అలాగే

- Advertisement -

మత్తనమ్‌ కామంగళ్‌ మాత్తు
అని పలికింది అనగా ఇంతకంటే వేరే కోరికలు మాకు వద్దు అని ఆండళ్లమ్మ కోరింది.

ఆండళ్లమ్మ వైకుంఠాన్ని కోరలేదు, స్వామి దర్శనాన్ని కోరలేదు, స్వామి స్తుతిని కోరలేదు, స్వామి కైంకర్యాన్ని కోరింది. నీవేమీ
వద్దయ్యా నీ కైంకర్యం చాలు అనగలగాలి. అందుకే పరమాత్మ వైకుంఠం ఇస్తానంటే హనుమంతుడు తనకు వైకుంఠం వద్దు నీ సేవ కావాలని కోరుకున్నాడు. భగవంతుని లోకంలో ఉండడం, భగవంతుని దగ్గర ఉండడం, భగవంతుని చూడడం, భగవంతుని స్తుతించడం ఇవేమి కోరవలసినవి కావు. పరమాత్మకు ఏకాంత సేవ చేయాలి అని గాఢంగా తపించగలగడమే ఉత్తర ద్వారం. మరి తూర్పు ద్వారం, పశ్చిమ ద్వారం, దక్షిణ ద్వారం వాటిలోనూ భక్తి ఉండి అంతో ఇంతో జ్ఞానం ఉంది.

వైకుంఠం చేరితే చాలని, స్వామిని చూస్తే చాలని, స్వామిని స్తుతిస్తే చాలని అనుకుంటారు. ఇవన్నీ శాశ్వతం కాదు. వైకుంఠ లోకం వెళితే ఎప్పుడూ అక్కడే ఉండాలని నియమం లేదు. స్వామిని చూస్తే చాలు అనుకుంటే ఒక సారే చూస్తే సరిపోతుంది. స్వామిని స్తుతిస్తే చాలు అనుకుంటే ఒకసారి మనసారా స్తోత్రం చేస్తే సరిపోతుంది కానీ స్వామికి అంతరంగ కైంకర్యం అన్ని వేళలా చేయాలి అన్న కోరికలో స్వామి లోకం, స్వామి దర్శనం, స్వామి స్తుతి, స్వామి కైంకర్యం అన్నీ ఇమిడి ఉన్నాయి. వైకుంఠం చేరడం, స్వామి దర్శనం, స్వామి స్తుతి ఏ ఒక్కసారికి ఇచ్చినా సరిపోతుంది కానీ అంతరంగ కైంకర్యం అన్ని వేళలా ఉండేది. కానీ అంతరంగ కైంకర్యం అంటే స్వామి నిద్రపోతుంటే పాద సంవాహనం చేయడం, స్వామికి చలివేస్తే దుప్పటి కప్పడం, స్వామి కూర్చుంటానంటే సింహాసనం ఏర్పాటు చేయడం అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. స్వామికి చలివేస్తే దుప్పటి కప్పడం కాక తానే దుప్పటై ఆయనని అతుక్కుని ఉండటం సేవ. దుప్పటి కప్పిన వారు కప్పి వెళ్లిపోతారు కానీ కప్పుకున్న దుప్పటి ఎప్పుడూ ఒంటిమీదనే ఉంటుంది. చందనం పూసినవారు వెళ్లిపోతారు కానీ చందనం ఒంటికే ఉంటుంది. పరుపు ఇచ్చిన వారు వెళ్లిపోతారు కానీ పరుపు స్వామికి శయ్యగా ఉండిపోతుంది. అలాగే పాదుకలు ఇచ్చినవారు వెళ్లిపోతారు కానీ పాదుకలు పాదాలను అంటిపెట్టుకుని ఉంటాయి. మరి పాదుకలను సమకూర్చాలనా లేక పాదుకలు కావాలని కోరుకుంటామా?, చందనం పూయాలనా లేక చందనం అవ్వాలని కోరుకుంటామా? ఏ పేరో ఏ సేవో ఏ సంబంధమో అవసరం లేదు ఎప్పుడు నీతోనే ఉండాలి, నీకు అవసరమైన ప్రతి కైంకర్యం నేనే కావాలి అని కోరుకోవాలి. అందుకే యామున మిశ్రులు స్తోత్ర రత్నంలో

నివాస శయ్యా ఆసన పాదుక అంశుక ఉపధాన శీతాతప
వారణాదిభి: శరీర భేదై: తవ శేషతాం గత:

అని చెప్పారు అనగా ఆదిశేషుడు నీవు ఉంటానంటే తాను ఇల్లు అయ్యాడు, పడుకుంటానంటే తాను పరుపు అయ్యాడు, కూర్చుంటానంటే తాను సింహాసనం అయ్యాడు, నడుస్తానంటే తాను పాదుకలయ్యాడు, తలగడ కావాలంటే తాను తలగడ అయ్యాడు, కట్టుకుంటానంటే తానే వస్త్రం అయ్యాడు, చలికి దుప్పటి అయ్యాడు, ఎండకి గొడుగు అయ్యాడు. అందుకే అతనని ఆది శేషుడు అంటారు. అంటే మొదటి సేవకుడు. చలి వేస్తే దుప్పటి ఇచ్చినవాడు సేవకుడు కాదు తానే దుప్పటి కావాలి. ఇది వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారా దర్శనం.

ఏకాదశి అంటే పదకొండు సమూహం. ఈ పదకొండు వైకుంఠం కావాలి, మరి దేని తోటి కొట్టబడకూడదు. ఈ పదకొండు పరమాత్మయందే ఉండడం వైకుంఠ ఏకాదశి. పదకొండు స్వామి సేవకు ఉపయోగించడం ఉత్తర ద్వార దర్శనం. స్వామిని చూడాలని అనుకున్న వారు ఒక్క కనులు పరమాత్మ వైపు ప్రసరింప చేస్తే చాలు, వినాలి అనుకున్న వారు చెవులు అప్పగిస్తే చాలు, అనాలి అనుకున్న వారు నాలుకతో కీర్తిస్తే చాలు, ఉండాలి అనుకున్న వారి శరీరం ఉంటే సరిపోతుంది తక్కినవి ఎక్కడ ఉన్నా కోరిక నెరవేరుతుంది. కానీ అన్ని వేళలా అన్ని విధములా కైంకర్యములు నీకే చేయాలి అంటే ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, మనసు పదకొండూ పరమాత్మ యందు పరిపూర్ణంగా అర్పించాలంటే ప్రేమతో నిండిన జ్ఞానం కావాలి అదే ఉత్తర ద్వారం. దాని నుంచి దర్శనం పరమాత్మ ఆంతరంగిక కైంకర్యం. అంతేకాని ఒక్క ముక్కోటి ఏకాదశి నాడు దేవాలయంలోకి వెళ్లి ఉత్తర ద్వారంతో ప్రవేశించి స్వామిని దర్శించుకుని రావడం సాంప్రదాయం అవుతుంది కానీ పరమభక్తితో కూడుకున్న పరమజ్ఞానం కాదు. ఇలా కొన్ని సంవత్సరాలు ఉత్తర ద్వార దర్శనం చేసిన వారికైనా, ఇలా ఎందుకు చేయాలి ఇందులో అంతరార్ధం ఏమిటన్న జిజ్ఞాస కలుగుతుందనే పెద్దలు ఈ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఆంతర్యం తెలుసుకుని శరీరంలో అణువణువూ, మనసు, అంత:కరణం ఇలా అన్ని పరమాత్మకు సరమర్పించడమే నిజమైన ఉత్తర ద్వార దర్శనం.

– శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement