Thursday, April 25, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

92. ఊరురంజనులెల్లభిక్షమిడరో? యుండన్గుహల్గల్గవో?
చీరానీకమువీధులందొరుకదో? శీతామృతస్వచ్ఛవాః
పూరంబేఱుల( బాఱదో? తపసులంబ్రోవంగనీవోపవో?
చేరం బోవుదు రేల రాజుల జనుల్శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, ఊరు- ఊరన్- ప్రతి ఉరిలోనూ, జనులు-ఎల్లన్- ప్రజాలందరు, భిక్షము- బిచ్చం, ఇడరు- ఓ- ఇవ్వరా? ఉండన్- ఉండటానికి / నివసించటానికి, గుహల్- ప్రకృతిలో సహజంగా ఏర్పడిన కొండగుహలు మొదలైనవి, కల్గవు- ఓ- లేకున్నవా? (ఉన్నాయి కదా), చీర- అనీకము- వస్త్ర సముదాయము, వీధులన్- వీధి అంగళ్లలో, దొరుకదు- ఓ- లభించదా? శీత- అమృత- చల్లని, అమృతం లాగా తియ్యని, స్వచ్ఛ- తేట అయిన, వాఃపూరంబు- నీరు, ఏఱులన్- సెలఏళ్లలో, పాఱదు- ఓ-ప్రవహించటం లేదా? తపసులన్- తపశ్శాలురని, ప్రోవంగన్- రక్షించటానికి, నీవు- నువ్వు, ఓపవు- ఓ- సమర్థుడివి కాదా? జనుల్- ప్రజలు, రాజులన్- రాజులని, ఏల- ఎందుకు, చేరన్- పోవుదురు-ఆశ్రయించటానికి పోతారు?
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా!ప్రతిగ్రామంలోనూ ప్రజలు భిక్షం వేస్తారు. ఉండటానికి ప్రకృతి ప్రసాదించిన గుహలు ఉండనే ఉన్నాయి. కట్టుబట్టలుఅంగళ్ళలో లభిస్తాయి. చల్లని,తియ్యని నీరు సెలయేళ్లలో ప్రవహిస్తూ ఉంటుంది. తపస్వులను రక్షించే సమర్థుడవైన నువ్వు ఉన్నావు. అయినా, మానవులు రాజాశ్రయం కోసం ఎందుకు ప్రాకులాడతారో తెలియదు.
విశేషం: ఇదే భావం 46 వ పద్యంలో కూడా వెలిబుచ్చాడు ధూర్జటి. అందరినీ రక్షించటానికి పరమేశ్వరుడు ఉండగా మానవులు రాజులని ఎందుకు ఆశ్రయిస్తారోనని బాధ పడతాడు ధూర్జటి.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement