Thursday, April 18, 2024

మనస్సంకల్ప మహాతత్వమే శివతత్త్వం

విభూతి తత్త్వమే సంక్షిప్తంగా శివతత్త్వం. ఇంకో రూపానికి మార్పు చెందలేని, మార్పు లేని ఆఖరి అమరత్వ స్థితే విభూతి. అటువంటి స్థితికి జీవుణ్ణి చేరువ చేసేది, చేరవేసేది శివ తత్త్వం. నిజానికి మనస్సంకల్ప మహా తత్త్వమే అసలైన శివతత్త్వం. అందుకోసం మనం మన మనస్సును ”లయం” చేసుకోవాలి. చేసుకో గలగాలి. శివుని తత్త్వానికి మనల్ని దగ్గర చేసే మహోత్కృష్టమైన హిందూ పర్వదినమే మహా శివరాత్రి. చాంద్రమానం ప్రకా రం మహాశివరాత్రి మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు అవుతుంది. మనసుకి కూడా చంద్రునికి ఉన్న 16 కళలు ఉంటాయి. మహా శివరాత్రి చతుర్దశి కాబట్టి 15 కళలు లీనమై పోయి ఒక్కకళ మాత్రమే మిగిలి ఉంటుంది. భగవత్‌ చింత న చేత మిగిలి ఉన్న ఆ ఒక్క కళను కూడా, సాధన ఎక్కువగా చేసి మనోని గ్రహం ఫలించి దైవాన్ని మనం చేరుకోగలం. మనసులోని కల్మషం తొలగించుకోవ టం ద్వారా ”శవాన్ని” ”శివం”గా మార్చుకోవా లనేదే మహా శివరాత్రి సందేశం. మార్చుకోవటానికి చేసే ప్రయత్నానికి సార్థకత చేకూర్చేది మహా శివరాత్రి మహత్యం. దైవత్వంలో లీనం అవడం కోసం దైవ చింత న చేయటమే మహా శివరాత్రి పర్వదినాన మనందరి కర్తవ్యం. మహా శివరాత్రి నాడు శివుడు లింగాకారంగా ఆవిర్భ వించాడని శివ పురాణం చెబుతోంది. లింగం సృష్టికి సంకే తం. బ్రహ్మము యొక్క చైతన్య ఫలిత సంకేత రూపమే లింగం. లింగం ఏదీ తనలో దాచుకోదు. ఏదీ తనతో ఉంచుకో దు. అన్నింటినీ వదిలించు కుంటుంది. అందుకే—లింగం జీవిత లక్ష్యాన్ని సూచిస్తుంది.
మహా శివరాత్రి మంగళకరమైన రాత్రి. చీకటిలో ”మంగళకరం” ఏమిటి? ఎలా ఉండ గలుగుతుంది? గాఢమైన అజ్ఞానంలో జ్ఞానాన్ని మేల్కొలుపు చేసుకోవడమే మంగళకరం. మేల్కొపటమే మంగళకరం. త్రిమూర్తి తత్త్వాన్ని ఏకత్వం కావించుకున్నప్పుడే మానవత్వం మంగళత్వం అవుతుంది. మహా శివరాత్రి రోజున ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చేస్తాం. జాగరణం అంటే ఏదో రకంగా రాత్రంతా తెలిసి ఉండటం ఉండటంకాదు. ప్రకృతిలో నిద్రాణంగా ఉన్న శివశక్తిని శివపూజ, అభిషేకాలు, అర్చనలు, శివలీలా కథాపారాయణాలతో, భజన లీలా శ్రవణాదులతో రాత్రంతా మేల్కొలిపి, సర్వాన్ని శివ స్వరూపంగా భావించి దర్శించుటయే నిజమైన జాగ రణం. శివపూజలో సాయుజ్యం, శివ భజనలో సామీప్యం, శివుని విషయాలు ప్రసంగించ డంలో సాలోక్యాన్ని, శివ ధ్యానంలో సారూప్యం సిద్ధిస్తాయని ఆదిశంకరాచార్యులు చెబు తారు. ఈ నాలుగింటిని సాధించుకోవటానికి మనంచేసే ప్రత్యక్ష సాధనే శివరాత్రి జాగరణం. శివ స్తోత్రాలన్నింటిలో ”ఓం నమశ్శివాయ” పంచాక్ష రీ మంత్రం అత్యున్నతమైనది. ఈ మంత్రాన్ని మహా శివ రాత్రి నాడు పఠిస్తే శివ సాయుజ్యం ప్రాప్తిస్తుందని శాస్త్రాలు చెబు తున్నాయి. ఇక రుద్రాభిషేకం. మనసులోని మలినాన్ని తొలగించుకో వటమే ”రుద్రాభిషేకం” పరమార్ధం.
ఒక వేటగాడు జీవనోపాధి కోసం వేటకి వెళ్ళేడు. రోజం తా ఏ జంతువూ దొరకలేదు. రాత్రి కూడా ఓ మారేడు చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు. జంతువు ల కోసం చూస్తున్నాడు. అతడికి తెలియకపోయినా అతడు చెట్టు పైనుంచి రాల్చిన బిల్వపత్రాలన్ని క్రిందన స్వయంభువుగా ఉన్న శివలింగంపై పడ్డాయి. ఆ కారణంగా ఆ వేటగాడు స్వర్గ ప్రాప్తిని ముక్తిని పొందుతాడు. ఇది మహాశివ రా త్రి మహత్యాన్ని చెప్పే మహాశివరాత్రి వ్రతకథ. శివుడుని శంకరుడు అని కూడా అంటాం. ‘శం’ అనగా చిదానందం, ఆత్మానందం వగైరా. ”కర” అనగా అందించే వాడు అని అర్థం. ఆత్మానందాన్ని, చిదానందాన్ని, సచ్చిదా నందాన్ని, అద్వైతానందాన్ని, బ్రహ్మానందాన్ని ఇత్యాది సమస్త ఆనందాలను అందించేవాడు శంకరుడు. సకల ఐశ్వర్య స్వరూపుడు శివుడు. ‘శివుడ్ని’ ఈశ్వరుడు అని కూడా అంటాం. క్షీర సాగర మధనం సమయంలో హాలాహలం ఉద్భ వించింది. ఆ హాలాహలాన్ని తన యోగ శక్తి చేత తన గొంతు లో బందీ చేస్తాడు శివుడు. ఫలితంగా గొంతులో మచ్చ ఏర్పడింది. కంఠం నీలంగా మారిపోయింది. అందుకనే ఆయన్ని నీలకంఠుడు అని కూడా పిలుస్తాం. హాలాహలం మ్రింగిన వేడిని శివుడు తట్టుకోవడానికి, శివునికి నిరంతరంగా అభిషేకం చేయాలి. ఇది పురాణాల ఆధారంగా మహా శివ రాత్రి మరో కథ.

యోగ శివరాత్రి

శివరాత్రులు ఐదు రకాలని స్కంద పురాణం చెబుతోంది. ప్రతి రోజూ రాత్రిపూట చేసే శివారాధ నను నిత్య శివరాత్రి. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి శివార్చన కోసం నిర్దేశించి న రాత్రిని పక్ష శివరాత్రి. ప్రతి మాసంలోనూ శివపూజకు ఉద్దేశించిన రాత్రిని మాస శివరాత్రి అంటారు. నాలుగవది మహా శివ రాత్రి. ఇక ఐదవ శివరాత్రి యోగ శివరాత్రి. యోగి అయిన వాడు తన యోగ బలం చేత యోగ నిద్రలోనికి వెళ్ళే రాత్రిని యోగ శివరాత్రి అంటారు. శివరాత్రి నాటి లింగోద్భవ సమయంలో చేసే అభిషేకాలలో కొన్ని పద్దతులు ఉన్నాయి. రాత్రి జాగరణ చేస్తూ మొదటి జాములో పాలతో అభిషేకించి పద్మాలతో పూజచేసి పెసర పప్పు బియ్యం కలిపి పులగం వండి శివుడికి నైవేద్యం పెడతారు. రుగ్వేద మంత్ర పఠనం జరుపు తారు. రెండో జాములో పెరుగుతో అభిషేకం చేసి తులసీ దళాలతో అర్చన చేసి పాయసం నైవేద్యంగా పెట్టే యజుర్వేద మంత్ర పఠనం చేస్తారు. మూడో జాములో నేతితో అభిషేకించి మారేడు దళాలతో అర్చించి నువ్వుల పొడి కలిపిన తినుబండారాలను నివేదిస్తారు. సామవేద మంత్ర పఠనం చేస్తారు. నాలుగో జాములో తేనెతో అభిషేకం చేసి నలల కలువలతో పూజించి అన్నం నివేదిస్తారు. అధర్వణ వేద పఠనం చేస్తారు. పైన చెప్పినవిధంగా అభిషేకాలు చేసే శక్తి లేని వారు అభిషేకం చేస్తున్నప్పుడు శివ దర్శనం చేసుకున్నా పుణ్యమే అని చెబుతారు. నాలుగో జాము ముగిసేక ఉదయం శివుడిని ఊరేగిస్తారు.
దేవపూజలు పగటి సమయంలో జరగడం ఆనవాయి తీ. అయితే శివారాధన మాత్రం రాత్రిపూట జరగడానికీ ఓ కారణం చెబుతారు. పూర్వం ఒకసారి ప్రళయం వచ్చినప్పు డు అంతా కటిక చీకటిగా మారిపోయింది. లోకకల్యాణం కోసం అప్పుడు పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేసింది. పార్వతీదేవి చేసిన తపస్సును మెచ్చిన శివుడు ఆ చీకటిని పోగొట్టేడు. మళ్ళీ మామూలుగా రాత్రి పగలు ఏర్పడేలా చేశాడు. దాంతో జీవులన్నీ ఎంతో ఆనందించా యి. అప్పుడు పార్వతీదేవి తాను చేసినట్టే రాత్రివేళ శివునికి పూజలు చేసిన వారికి సర్వ సుఖాలు అనుగ్రహించాలని శివుడుని కోరుతుంది. శివుడు అందుకు అంగీకరించాడు. పార్వతీదేవి చేసిన శివారాధనకు గుర్తుగా ఆనాటి నుంచి మహా శివరాత్రి పర్వదినం, రాత్రి శివారాధన ప్రారంభమయ్యాయి అనేది ఓ కథ. సకల ఐశ్వర్యాలను అందించే శివత్వాన్ని అర్ధం చేసుకుం దాం. అమరత్వాన్ని అందించే శివ తత్త్వాన్ని అవగతం చేసుకుందాం. శివత్వాన్ని, శివ తత్త్వాన్ని అనుభవిద్దాం. శివ తత్త్వంలో మన జీవితాలను పండించుకుందాం.

  • రమాప్రసాద్‌ ఆదిభట్ల
    93480 06669

Advertisement

తాజా వార్తలు

Advertisement