Thursday, April 25, 2024

అనిలుడును ఆజ్ఞాపించిన సీతమ్మ!

రావణాసురుడి అజ్ఞానుసారం, రాక్షసులు హనుమంతుడి తోకకు నిప్పంటిస్తుంటే, ఆయన తోకతో వాళ్లను కొట్టాడు. తోక కాలుతుంటే, హనుమంతుడు పరిపరివిధాలుగా ఆలో చించసాగాడు. ”తాను ఏమి చేయాలిప్పుడు? విడిపించుకోదల్చు కుంటే వీళ్లు తన కడ్డమా? త్రాళ్లు తెంచుకుని వీళ్ళందరినీ చంపాల్నా? ఇది కోపగించుకునే సమయం కాదు. ఏది మేలో అదే ఆలోచించాలి. వీళ్లనెందుకు కొట్టాలి? రావణుడి ఆజ్ఞ ప్రకారమే వీళ్లు తనను బాధిస్తు న్నారే తప్ప, వాళ్ల తప్పేమీలేదే! వాళ్లు తనకోవిధంగా మేలే చేస్తున్నారు. రాత్రివేళ మొత్తం లంకను చూడడం సాధ్యపడలేదు. వీళ్లిప్పుడు తిప్పితే చూడొచ్చు. వీళ్లు దేహాన్ని కాల్చినా కాల్చవచ్చు. అటూ-ఇటూ ఈడ్వవచ్చు. వీళ్లు చేసేపనిని వడ్డీతో సహా తీరుస్తా” అనుకుంటాడు.
ఇలా హనుమంతుడు ఆలోచిస్తున్నప్పుడే, అతడిని వాడావాడా తిప్పారు రాక్షసులు. శంఖాలు పూరిస్తూ, చప్పట్లు కొడుతూ, తిట్టు కుంటూ, కొట్టుకుంటూ వూరంతా తిప్పారు. రాక్షసులు తిప్పుతుంటే, హనుమంతుడు కష్టపడకుండానే, సందు-సందు, వీధి- వీధి, రహస్య ప్రదేశాలు, ఇళ్ళకున్న దొడ్డి దోవలు, చిన్నచిన్న ఇళ్లు, పెద్దపెద్ద మేడలు తిరిగి చూశాడు. కొందరు రాక్షస స్త్రీలు పరిగెత్తుకుంటూ సీతాదేవి దగ్గరకు వెళ్లి ఆమెతో గుసగుసలాడిన కోతిని, రాక్షసులు పట్టుకుని, తోక కాల్చి వూళ్లో తిప్పుతున్నారని చెప్పారు. హనుమంతుడి మేలుకోరు కునే పతివ్రత సీతాదేవి, రాక్షసులను ఆయన చంపిన సంగతి గురించి విని సంతోషించింది. ఆంజనేయుడి మేలుకోరి అగ్నిహోత్రుడిని ప్రార్ధి స్తుందిలా: ”నేను పతిసేవ చేసే స్త్రీనైతే, నిష్టతో తపస్సు చేసిన దాననైతే, నేను నిజమైన పతివ్రతనే అయితే, ఓ అగ్నిదేవుడా! నీవు హనుమంతుడి పట్ల చల్లబడాలి. సూర్యవంశ రాజుల్లో శ్రేష్టుడైన శ్రీరామచంద్రమూర్తికి నామీద దయవుంటే హనుమంతుడికి చల్లగా అయిపో! మనసున్న రామచంద్రమూర్తితో సాంగత్యం నేనెప్పుడూ కోరేదాన్నైతే, మంచి నడవడిగల దాన్నని హనుమంతుడు నన్ను నమ్మితే, ఆయనకు శీతలు డవైపో. సుగ్రీవుడు త్వరగా రావడం, నన్నీ శోకసముద్రం నుండి దాటిం చడం నిజమైతే, హనుమకి బాధలేకుండా చల్లగా అయిపో”.
ఇదొక అగ్ని పరీక్ష. సీతమ్మకేకాదు, రాముడికి కూడా! నేనే పతి వ్రతనైతే, నాకు తపశ్శక్తి వుంటే, అదృష్టవంతురాలిని అయితే, తార వుత్తమురాలైతే, సుగ్రీవుడు సత్యవంతుడైతే, ఇవన్నీ నిజమైతే, అగ్ని తన సహజ స్వభావాన్ని ఉపసంహరించుకోవాలి. అంతేకాదు, చల్ల బడిపోవాలి. అందరిపట్ల, అన్ని విషయాలలో కాదు. కేవలం హనుమంతుడి పట్ల మాత్రమే చల్లబడమంది ఆ తల్లి. అంటే, చక్కగా చల్ల బడ్డాడు. ఆమె మాటలన్నీ సత్యమని నిరూపించేసాడు అగ్నిదేవుడు. రామాయణంలో ఇదొక అత్యంత ఆశ్చర్యకరమైన సన్నివేశం. మరొక రహస్యం కూడా వుందిక్కడ. ‘శీతోభవ’ అని సీతమ్మ ఆజ్ఞాపిస్తే అగ్ని విధే యుడై చల్లబడ్డాడు హనుమంతుడి విషయంలో. మరి సీతమ్మ ‘దగ్ధో భవ దశానన’ అని అగ్నిని ఆజ్ఞాపిస్తే రావణుడు బూడిద అయ్యేవాడు కద! అందువల్లనే ఆ తల్లి అన్నది, నాకు శ్రీరాముడి ఆజ్ఞ లేదు కను క అలా శపించడం లేదని. అంతేకాదు. ముందు కాలంలో సీతమ్మ అగ్నిప్రవే శం చేయవలసిన సమయంలో అగ్ని సీతమ్మను దహించజాలడన్న విషయం కూడా రుజువయింది.
హనుమంతుడి విషయంలో అగ్నిహోత్రుడు చల్లబడితే, ఆమె చెప్పినవన్నీ సత్యమేనన్న భావం పైమాటల్లో కలుగుతుంది. రాముడు బ్రహ్మాస్త్రం సంధించి, నిన్ను రూపుమాపుతానని సముద్రుడిని బెదిరిం చినా, తన స్వభావాన్ని విడువలేనని చెప్పగలిగాడు. కాని, హనుమకి చల్లదనం కలిగించమని సీతాదేవి అడిగితే, అగ్ని చల్ల బడింది. ఎంతటి మహాత్ములైన పురుషులకు కూడా సాధ్యపడనిది, పతివ్రతలైన స్త్రీలకు సాధ్యపడుతుందని దీనివలన తెలుస్తున్నది. సీత అగ్నిహోత్రుడిని ప్రా ర్థించిందే కాని, తన తపోబలంతో నువ్విట్లా కమ్మని శాసించ లేదు. బిడ్డ లను రక్షించడానికి, భర్తకున్న స్వాతంత్య్రం భార్యకూ వుంది. ఇలా ప్రార్ధిస్తున్న సీతాదేవికి, హనుమంతుడికి అపాయం లేదన్న సూచనలు రాసాగాయి. కాలుతున్న తోకనుండి మండే గాలి రాకుండా, మంచులాంటి చల్లటి గాలి వీచింది ఆమె వైపు. తనను కాల్చకుండా అక స్మాత్తుగా అనిలుడు శీతలుడైనాడేమిటా! అని కారణం తెలియక హను మ ఆశ్చర్యపోయాడు. సముద్రం దాటి వచ్చేటప్పుడు, ఎలాగైతే సము ద్రుడు, మైనాకుడు శ్రీరాముడి పట్ల చూపిన ప్రీతిని, అగ్నిహోత్రుడూ చూపాడని ఇదంతా రామచంద్రమూర్తి మహిమేననీ, ఆయన పని చేస్తు న్న తనకు ఆయనెందుకు అపాయం కలుగనిస్తాడనీ భావిస్తాడు. సీతా దేవి దయవలన, శ్రీరామానుగ్రహం వల్ల, వాయుదేవుడికి అగ్నిహోత్రు డు మిత్రుడైనందువల్ల తనపైన ప్రేమతో చల్లబడ్డాడనుకుంటాడు.
తోకమండుతుంటే హనుమంతుడు ఏంచేయాలన్న ఆలోచనలో పడ్డాడు. లంకలోని పౌరులకు బాధ కలిగిస్తే, ఈ బాధ రావణుడి మూ లాన్నే జరిగిందని, ప్రజలందరూ విరోధం పెంచుకుంటారు. దాని మూలంగా వారిలో వారికి పడక, సీతాదేవిని రాముడికప్పగించమని చెప్పేవారు కొందరుండవచ్చని హనుమంతుడు భావిస్తాడు. అందుకే ఈ రాక్షసులకు కొంచెం బాధ కలిగించాలని నిశ్చయించుకుంటాడు. ”ఈ నగరాన్ని నాశనం చేస్తే, నేననుకున్న పనులన్నీ అయినట్లే. నాకుప కారం చేస్తున్న, అగ్నిహోత్రుడికి ప్రత్యుపకారంగా ఇక్కడున్న ఇళ్లన్నీ ఇవ్వడం న్యాయం” అనుకుంటూ ఇళ్లమీద తిరగడం ప్రారంభించాడు. మెరుపులతో కూడిన మేఘంలా చలించక హనుమంతుడు లంకలోని, ఇల్లిల్లూ, తోటతోటా, మేడమేడా తిరిగి, సర్వం కాల్చేసే కార్యక్రమంలో మునిగిపోయి, ఆనందించసాగాడు.
రావణుడి, విభీషణుడి ఇల్లు తప్ప మిగిలిన వా ఇళ్ళన్నీ కాల్చాడు. బలంగా గాలి వీస్తుంటే, విజృంభించిన హనుమంతుడు, ఇల్లిల్లూ తగులబెట్టడంలో నిమగ్నమైపోయాడు. లంకా నగరమంతా కాలి బూడిదైపోయి, నేలకూలుతున్న పెద్దపెద్ద మేడలతో నిండిపోయింది. రాక్షసుల ధ్వనితో ఆకాశం నిండిపోయింది. ఎన్నిళ్లు కాలినా, భూమి మీద పీనుగులెన్ని పడ్డా ఆయనకు తృప్తి కలగలేదు. హనుమంతుడు లంకా దహనం చేస్తుంటే, ఆ మంటలు పెరిగి త్రికూట పర్వతం వరకూ వ్యాపించాయి. రాక్షసులు లంకానగరాన్ని చూసి దు:ఖపడ్తూ ఎవరీ వానరుడు? ఇది సామాన్య కోతి అనటానికి వీల్లేదని అనుకున్నారు. వనాన్ని పాడుచేసి, రాక్షసులను చంపి, మేడలు, మిద్దెలు నేలమట్టం చేసి, ఇంకా మండుతున్న తోకను సముద్రంలో ముంచి చల్లారుస్తాడు.
పట్టణమంతా కాలి వుండడం గమనించి, ఎంత పాడు పనిచేసా ను! అని విచారించసాగాడు. ఆలోచనలేక సీతాదేవిని కూడా కాల్చి స్వామిద్రోహం చేసినవాడినైనాననీ బాధపడ్తాడు. లంకంతా కాలి బూడి దయితే, ఆ మంటల్లో సీత కూడా నశించిందేమో, తెలివిలేక జానకి వున్నదన్న ఆలోచనలేక క్రూరమైన పనిచేసి రామకార్యం పాడుచేసా ననీ కుమిలిపోతాడు హనుమంతుడు. ఇలా ఆలోచిస్తున్న హనుమకి, దేహంలో శుభశకునాలు కనిపించసాగాయి. కుడికన్ను, కుడిభుజం అదరడం, హృదయం ప్రసన్నం కావడంతో, ”సీతాదేవిని అగ్నిదహం చడమా? నా తెలివి తెల్లారే ఆలోచనకదా ఇది! సీత రాక్షసస్త్రీలాంటిది కాదు కదా! అగ్నిని అగ్ని ఎలా దహిస్తుంది? నా దేహాన్నే కాల్చని అగ్ని హోత్రుడు సీతాదేవిని కాలుస్తాడా? రామచంద్రమూర్తి దాసుడనైన నేను, ఆయన కార్యం పైన లంకాదహనం చేస్తుంటే, నా తోక కొనవెంట్రు కలనైనా కాల్చని వాడు, అలాంటి మహానుభావురాలిని తాకగలడా?” సీతా మహాత్మ్యం గురించి ఆలోచించసాగాడు. సరిగ్గా అదే సమయం లో, ఆకాశంలో తిరుగుతున్న ఋషులు, చారణులు, మునులనుకుం టున్న మాటలు హనుమంతుడి చెవుల్లో అమృతం పోసినట్లు వినిపిం చాయి. ”ఆశ్చర్యం- ఆశ్చర్యం! హనుమంతుడివల్ల అగ్నిదేవుడు, తోర ణాలతో, ప్రాకారాలతో, బురుజులతోసహా లంకానగరాన్నంతా దహం చి వేసాడు. మంటల్లో యావత్తూ మసి అయిపోయినా అశోకవనంలో సీత చెక్కు చెదరలేదే! ఎంత ఆశ్చర్యం? ఆమెను అగ్ని సమీపించనే లేదు” అన్న మాటలను వింటాడు హనుమంతుడు.
ఋషుల మాటలవల్ల సీతాదేవి క్షేమంగా వున్నదని తెలుసుకున్న హనుమంతుడు సంతోషిస్తాడు. అయినా ఆ మహాపతివ్రతను మరొక్క సారి కళ్లారా చూసి, దర్శించుకుని, క్షేమసమాచారం తెలుసుకుందా మనుకుంటాడు. ఆ తర్వాత ప్రయాణమైతే, చేయాల్సిన పని సంపూ ర్ణంగా నెరవేర్చినట్లవుతుందని తలచి హనుమంతుడు, సీతాదేవి వుండే ప్రదేశానికి వెళ్ళి, శింశుపావృక్షం కిందున్న ఆమెకు నమస్కరించి, మ ళ్లా దర్శించే భాగ్యం కలిగిందని చెప్తూ, ప్రభుకార్యం ఏదెట్లా చేయాలో, ఎట్లా జరగాలో అవన్నీ అలానే చేయడం జరిగిందని అంటాడు.
ఇక బయల్దేరబోతున్న హనుమంతుడితో, తనభర్తపై తనకున్న ప్రేమను తెలిపే వాక్యాలను మరోసారి చెప్పింది. సీతచెప్పిన ఆ మాటల కు సరైన రీతిలో స్పందిస్తాడు ఆంజనేయుడు. రాముడు వానర సైన్యం తో సముద్రాన్ని దాటి వచ్చి, రాక్షసుల పొగరణచి, ఆమె శోకాన్ని నిర్మూ లిస్తాడనీ, తన మాటలు నమ్మమనీ, దిగులుపడవద్దనీ సీతకు ఓదార్పు వచనాలు చెప్తాడు. అపాయం కలిగే ఎటువంటి పనీ చేయవద్దని సీతకు చెప్పి, తానిప్పుడే రామచంద్రమూర్తిని చూడబోతున్నానని, ఆమె అను జ్ఞ కోరుతూ నమస్కరిస్తాడు. సీత ఆశీర్వాదాన్ని పొందిన హనుమంతు డు, అరిష్టమనే పేరున్న కొండనెక్కాడు సముద్రపు ఉత్తర గట్టు చేరేందు కు, ఆ పర్వతం మీద నుండి సన్నద్ధుడవుతున్న హనుమంతుడి కాళ్ల తొక్కిడికి, అక్కడున్న అడవి జంతువులు తత్తరలాడాయి. కొండగుహల్లో వున్న సింహాలన్నీ బెదిరిపోయి దిక్కులు పిక్కటిల్లేటట్లు ధ్వని చేసా యి. హనుమంతుడు సముద్రాన్ని దాటేందుకు, ఆకాశానికి ఎగరగానే, అక్కడున్న విషసర్పాలు సందుల్లోకి దొర్లిపోయాయి. కిన్నరులు, పన్న గులు, యక్షులు, కింపురుషులు ఆకాశానికి ఎగిరారు. పది యోజనాల వెడల్పు, ముఫ్పై యోజనాల ఎత్తున్న ఆ పర్వతం నిమిషంలో నేల మట్టమైంది. ఆకాశమార్గంలో వెళుతున్న హనుమంతుడు సముద్రం లో వెళుతున్న నావలా వున్నాడు. మబ్బుల్లో దోబూచులాడుతూ మే ఘాలమధ్య చుట్టుకున్నప్పుడు ఆకాశంలోని చంద్రుడిలా, మేఘాలను చీలుస్తున్నప్పుడు ఆకాశంలో వెళ్తున్న గరుత్మంతుడిలా కనిపించాడు.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం
మందరం ఆధారంగా)

  • వనం జ్వాలా నరసింహారావు
    8008137012
Advertisement

తాజా వార్తలు

Advertisement