Wednesday, March 27, 2024

సద్గ్రంథ పఠనం… దివ్యనామ జపం.. ఆధ్యాత్మికోన్నతికి మార్గాలు..

శ్రీసాయినాథుని అవతారం మహోత్కృష్టమైనది, ఆయన మార్గదర్శకత్వం విభిన్నమైనది. సాయి భక్త సులభుడు, భక్తుల పాలిటి ఆశ్రిత కల్పవృక్షం, కామధేనువు అయిన శ్రీ సాయి వంటి అవతారం ఇంత వరకు రాలేదు, ‘నభూతో: నభవిష్యతి’ అన్నట్లుగా ఇక మీదట రావడం అత్యంత దుర్లభం. సాయి అందరు కలి యుగ గురువుల వలె యోగ సాధనలు చేయించడం, మంత్రోప దేశం చేయడం, గ్రంథ రచనలు గావించడం, జీవాత్మ, పరమాత్మ గురించి, ఆత్మ సాక్షాత్కారం గూర్చి ప్రవచనాలు చేయడం ఏనాడూ చేయలేదు. సకల వేద సారాన్ని, ఉపనిషత్తుల సారాంశాన్ని చిన్నచిన్న లీలల ద్వారా కథల ద్వారా భక్త జనావళికి సుళువుగా అర్థమ య్యేటట్లు బోధించిన అసామాన్య సద్గురుమూర్తి శ్రీ సాయినాథుడు. కుశాభావు అనే టీచర్‌ ఒక సాధువును ఆశ్రయించి శుశ్రూషలు చేసాడు. అందుకు సంతోషించిన ఆ సాధువు కుశాభావుకు ఒక మంత్రం నేర్పాడు. ఆ మంత్ర ప్రభావం వలన పండ్లు, మిఠాయిలు వంటి పదార్ధాలను అతను సృష్టించగలిగేవాడు. ఆ సంగతి తెలుసుకున్న ప్రజలు కుశాభావు చుట్టూ చేరి విసిగించసాగారు. అంతేకాక అతనొక మంత్రగాడని విమర్శిస్తూ, తమ సమాజం నుండి వెలివేసారు.
ఇందుకు ఖిన్నుడైన కుశాభావు తిరిగి ఆ సాధువును ఆశ్రయిస్తే ”నీకు సంప్రాప్తించిన విద్యను తిరిగి వెనక్కి తీసుకునే శక్తి నాకు లేదు. నువ్వు తక్షణం శిరిడీ వెళ్ళి సాయిబాబాను శరణు పొందు, నీకు మేలు కలుగు తుంది” అని సలహా ఇచ్చాడు. ఆ ప్రకారమే 1909వ సంవత్సరంలో కుశాభావు శిరిడీ చేరాడు కాని శ్రీ సాయి అతనిని మశీదులోనికి రానివ్వ లేదు. ”ఆత్మజ్ఞానం ద్వారా సంక్రమించిన శక్తులు లోకహితం చేస్తాయి. మంత్ర తంత్రాల ద్వారా వచ్చిన శక్తులు మనకేకాక ఇతరులకు కూడా హాని చేస్తాయి. కనుక ఇటువంటి శక్తులను పొందడం మంచిదికాదు. ఇటు వంటి వారు వేశ్యలతో సమానం. వారికిక్కడ ప్రవేశంలేదు. గోదావరీ నది లో స్నానం చేసి, ఆ శక్తులను అక్కడే విడిచిరా!” అని శ్రీ సాయి ఖచ్చితంగా చెప్పేసారు.
కుశాభావు ఆ ప్రకారమే చేసాక, శ్రీ సాయి అతని చేత దాసబోధ అనే ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదివించారు. ఆ తర్వాత శ్రీ గురుచరిత్ర అనే గ్రంథాన్ని 108 సార్లు పారాయణ చేయించారు. ఒకరోజు ఏకాదశీ పర్వ దినాన కుశాభావు ఉపవాసం చేస్తున్నాడు. ప్రసంగవశాత్తూ బాబాతో పూ ర్వం ఋషులు కందమూలాలు తిని బ్రతికేవారని అన్నాడు. వెంటనే శ్రీ సాయి తన వద్ద వున్న కొన్ని ఉల్లిగడ్డలను ఇచ్చి తినమన్నారు. కుశాభావుకు ఏంచెయ్యాలో తోచలేదు. చివరకు శ్రీ సాయి తింటే తానూ తింటానన్నా డు. వెంటనే శ్రీ సాయి కొన్ని ఉల్లిగడ్దలను తిని, చుట్టూ వున్న భక్తులతో ”ఈ బ్రాహ్మణుడిని చూడండి! ఏకాదశి పూట ఉల్లిపాయలను తింటున్నాడు” అని గేలి చేశారు.
కుశాభావు వారితో ”శ్రీ సాయి ఆదేశిస్తేనే నేను తిన్నాను అంతే తప్ప నేను ఆచారం తప్పలేదు” అని అన్నాడు. శ్రీ సాయి అందుకు అంగీకరించక తాను తిన్నది కక్కి చూపారు. ఆశ్చర్యం! అందులో కందమూలాల ముక్క లు వున్నాయి గాని ఉల్లిగడ్దలు మచ్చుకైనా లేవు. కుశాభావు వెంటనే శ్రీ సాయి కక్కిన దానిని మహాప్రసాదంగా భావించి గబగబా తినేసాడు.
శ్రీ సాయి అతనిని తిట్టి, తన సటకాతో కొట్టి వారించారు. కానీ కుశాభా వు వినలేదు. గురూచ్చిష్టం (గురువు ఎంగిలి) అత్యంత పవిత్రమైనదని సకల వేదాలు ఘోషిస్తున్నాయి. ఇటువంటి అవకాశం మరిక రాదని కుశా భావుకు తెలుసు. ఆతని భక్తిశ్రద్ధలకు బాబాకు ఆనంద బాష్పాలు కారాయి. వెంటనే అతనిని కౌగలించుకొని ఆశీర్వదించారు. అంతేకాక ”ఎప్పుడు నువ్వు నన్ను స్మరించినా ఈ ద్వారకామయిలోని ఊదీ నీ చేతిలోనికి వస్తుం ది. కష్టాల కడలిలో వున్నవారికి, రోగగ్రస్తులకు, ఈ ఊదీని ప్రసాదంగా ఇచ్చి వారికి ఉపశమనం కలుగజేయుము” అన్న ఒక గొప్ప వరం ఇచ్చా రు. నాటి నుండి కుశాభావు జీవితంలో ఒక నూతన అధ్యాయం మొదల య్యింది. గురువు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలిగిన అత ను శ్రీ సాయి భక్తులలో శ్రేష్టుడయ్యాడు. అధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థానాలకు ఎదిగాడు. దేశమంతటా పర్యటిస్తూ, శ్రీ సాయి దివ్య లీలా వైభ వం పై ఉపన్యాసాలను ఇస్తూ, దీనజనులకు, అభాగ్యులకు శ్రీ సాయి ఊదీని ఇస్తూ వారివారి పాపాలను కష్టాలను దూరం చేస్తూ చివరలో శ్రీ సాయిలో ఐక్యం అయ్యాడు.
ఒక సామాన్య టీచర్‌ కొన్ని క్షుద్ర విద్యలు అభ్యసించి, చెడు మార్గం పట్టినప్పుడు, వానిని పిచ్చుక కాలికి దారం కట్టి లాగిన విధంగా తన వద్ద కు రప్పించుకొని, సద్గ్రంథ పఠనంతో, దివ్య నామ జపంతో పవిత్ర మొన రించి, అతనికి ఎవ్వరికీ దక్కని విధంగా తన గురూచ్చిష్టాన్ని ప్రసాదించి, ఆధ్యాత్మికోన్నతి ప్రసాదించి, సంస్కరించిన వైనం అద్భుతం, అపూర్వం, అద్వితీయం. అందుకే గురువులలో కెల్లా కోహినూర్‌ వజ్రం వంటి వారు మన సాయినాథులు అంటే అతిశయోక్తికాదు. ఈ లీల ద్వారా శ్రీ సాయి గురుచరిత్ర గ్రంథం యొక్క విశిష్టతను కూడా అత్యద్భుతమైన రీతిలో భక్తలోకానికి తెలియజేసారు. ఆ గ్రంథాన్ని 108 సార్లు పారాయణ చేయం చాకనే శ్రీ సాయి కుశాభావుని అనుగ్రహించారు. అట్లే అనేక సందర్భాలలో ఈ గ్రంథం యొక్క వైశిష్ట్యాన్ని చెబుతూ దానిని నిత్య పారాయణ చేయ మని భక్తులకు సలహా ఇస్తుండేవారు. అనేకమంది సాధకులకు ఉన్నత ఆధ్యాత్మిక అనుభూతులు కూడా ఈ గ్రంథం వలన లభించాయని ఎన్నో ప్రమాణాలు వున్నాయి. కాబట్టి గురుభక్తులు శ్రీ సాయి సచ్చరిత్రతోపాటు శ్రీ గురు చరిత్ర పారాయణ కూడా చేయడం మంచిది.

  • సిహెచ్‌.ప్రతాప్‌ 9136827102
Advertisement

తాజా వార్తలు

Advertisement