Friday, March 29, 2024

నవరాత్రి రహస్యాలు (ఆడియోతో..)

తత్త్వము, వైభవము గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

సత్తువ అనేది ఎన్నటికీ నశించదు కానీ అసత్‌, సత్‌లో చేరినపుడు నశించు(సత్‌)ను అని అంటారు. నాశము అనగా పూర్తిగా లేకుండట కాక కనబడకపోవటం అనగా, సూర్యాస్తమయం అనంతరం సూర్యుడు కనబడకపోవుటయే కాని పూర్తిగా లేకుండుట కాదు. అలాగే నాశము అనగా కనబడకపోవుడాన్ని లయము అని, అనగా ఒకదానిలో చేరుట అని అర్థము. ఎలాగైతే పాలలో నీళ్లు కనిపించవో జగత్తు, జీవుడు పరమాత్మలో చేరిన జగత్తు నశించిందని అంటారు. ఈ విధంగా చేరేది ‘అసత్‌’, చేర్చుకునేది ‘సత్‌’ ఈ సత్‌, అసద్రూపమే అమృత(పరమాత్మ) మృత్యువుల సమిష్టి రూపం. ఇదే పరమాత్మగా, పరమశక్తిగా చెప్పబ డుతుంది.

అమృతం చైవ మృత్యుశ్చ
సత్‌అసచ్ఛాహ మర్జునా ||
అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు సెలవిచ్చాడు. సత్‌ లో చేరినది అసత్‌ అని, అసత్‌ను చేర్చుకున్నది సత్‌ అని అనబడును. పరస్పర విరుద్ధమైన ఈ తత్త్వాలకు వేదపురుషుడు ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు.

నైవవా ఇదమగ్రే అసదాసీత్‌
నైవ సదాసీత్‌ ఆసీదివవా
ఇదమగ్ర నైవాసీత్‌
తస్మాదేతత్‌ ఋషిణా అభ్యనుక్తం
నాసదాసీత్‌ నోసదాసీత్‌ తదానీమ్‌

ఈ మంత్రార్థము సత్తు అలాగే అసత్తు కూడా ఉన్నది. ఈ తత్త్వము మొదలు లేనట్టున్నా అదే ఉన్నట్టు ఉన్నదని కావున సత్‌, అసత్‌ అనునవి లేవని అనికూడా అర్థము. ఈ విలక్షణ తత్త్వమే పరమాత్మ, పరాత్పరుడు అయిన కాలపురుషుడు. పరమాత్మలో ప్రతీ క్షణము విలక్షణమైన ధర్మములు, మాయా బలములు ఆవి ర్భవించుచుండును. దిక్‌దేశకాలములు అనంతము కాని సంఖ్యలో ఒక్కటే. మహాసముద్రము దిక్‌, దేశ కాలదృష్ట్యా సాంతము కాని సంఖ్యలో అనంతము. ఈ సముద్రములో అనంతమైన బుద్‌బుదములు అలాగే తరంగములు సముద్రంలోనే పుట్టి మరల కలిసిపోవును. ఈ విధంగా ప్రకృతిజీవుడు పరమాత్మనుండే ఏర్పడి పరమాత్మలోనే కలుస్తారు.

- Advertisement -

…శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement