Friday, March 29, 2024

మాండుక్యోపనిషత్‌ : జీవా గురుకులం వారి సౌజన్యంతో… (ఆడియోతో…)

ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా |
స్థిరైరంగైస్తుష్టువాగ్‌ం సస్తనూభి:| వ్యశేమ దేవహితం యుదాయు: |
స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవా:| స్వస్తి న: పూషా విశ్వావేదా:|
స్వస్తి నస్తార్‌క్ష్యో అరిష్టనేమి:| స్వస్తి నో బృహస్పతిర్ద ధాతు ||

తృతీయఖండము

1వ మంత్రము:
సోయమాత్మా అధ్యక్షరం ఓంకారో అధిమాత్రం పాదా
మాత్రా: మాత్రాశ్చ పాదా: అకార ఉకారో మకార ఇది||

ఇంతవరకు సమస్త ప్రణవముచేత ప్రతిపాదించబడునట్టి పరమాత్మత్త్వాన్ని వైశ్వానర, తైజస, ప్రాజ్ఞ, తురీయ(అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ) స్వరూపములుగా వివరించడం జరిగింది. ఈ ఖండములో పరమాత్మ యొక్క ఆ నాలుగు స్వరూపములు, వ్యస్త్రప్రణవములోని ఒక్కొక్క మాత్రచేత ప్రతిపాదించబడునని తెలిపి, ఆ స్వరూపజ్ఞానంతో ఉపాసన చేసినవారిని, ఆయా స్వరూప పరమాత్మ ఎట్లనుగ్రహించునో వివరిస్తోందీ ఉపనిషత్‌.

”ఓమ్‌ ఇత్యేకాక్షరం”, ఓమిత్యేతదక్షరం” మొదలైన శ్రుతులలో ఒకే అక్షరంగా చెప్పబడుతున్న ఓంకారము, సమస్త ప్రణవము. దానినే ”అధ్యక్షరం”అక్షరములలో శ్రేష్ఠమైనది అంటూ ఈ మన్త్రంలో చెప్పారు. ఇక ”అధిమాత్రం” – అకార, ఉకార, మకార నాదములనే మాత్రల రూపంలో ఉన్న వ్యస్త ప్రణవమును చెప్పారు. ఈ సమస్త ప్రణవముగాని, నాలుగు మాత్రలుగా విభజించబడిన వ్యస్తప్రణవ ముగాని, పరబ్రహ్మ స్వరూపుడగు శ్రీమన్నారాయణునినే పరమాత్మగా ప్రతిపాదించుచున్నవి.

- Advertisement -

ఓంకారములో అకార, ఉకార, మకారములనే అక్షరములు మూడేకాక, దానిని ఉచ్చరించినపుడు మనము వినగలిగే నాదము మరొకటి ఉన్నది. ఇదియే నాల్గవమాత్ర. కనుక ప్రణవమును మొత్తము నాలుగు మాత్రలుగా విభజించవచ్చు. ఈ ఓంకారమే పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడని ముందు 1వ ఖండములోనే తెలుసుకున్నాంకదా! ఆ పరమాత్మకున్న అంశములు లేదా స్వరూపములు కూడా నాలుగేనని అని ఏమిటో 2వ ఖండములో తెలుసుకున్నాం. ఆ పరమాత్మ అంశలైన అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవులని ఓంకారములోని నాలుగుమాత్రలు ప్రతిపాదించునని, ఏతావతా సమస్తప్రణవము, వ్యస్త ప్రణవమూ పరమాత్మనే ప్రతిపాదించునని ఈ ఉపనిషత్‌ వ్యాఖ్యానిస్తున్నది. ఈ ఖండములో పరమాత్మ యొక్క ఏ స్వరూపము, ఓంకారములోని ఏమాత్రచేత, ఎట్లు ప్రతిపాదించబడునో ముందు మంత్రాలలో వివరిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement