Wednesday, April 24, 2024

మానవ జీవనానికి అమృత గుళికలు

మహాభారతం ఓ పాఠ్యగ్రంథం. ఆగ్రంథంలో అందరు నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో వున్నాయి. అవి నేటికాలంలో అత్యంత అవసరం. వాటిలో కొన్ని ముఖ్యమైనవి తెలుసుకుందాం
– జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు.
కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన, ధర్మాలకి పెట్టింది పేరు, కాని సమయాన్ని బట్టి నడుచుకోక పోవడంవలన చెడు (కౌరవుల) వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు, కావున జీవితంలో గెల వాలంటే మంచితనంతోపాటు చుట్టూఉండే సమాజపరిస్థితులని, సమయాన్ని బట్టి నడుచుకోవాలి.
– చెడు స్నేహం ఊహకి అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు. కౌరవ సామ్రా జ్యం మొత్తాన్ని నాశనం చేసి, వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహంచని పరాజయాన్ని మిగిల్చాడు. జీవితంలో శకుని లాంటి వారి సలహాలని దూరం పెట్టాలి.
– ఎటువంటి బేధాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. పాండవులు శ్రీకృష్ణుడుని, కౌరవులు కర్ణుడుని పొందటం అది వారికి యుద్ధ సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే, కర్ణుడి లేని రారాజు బలం ఏపాటిదో, కౌరవ సేనకు కర్ణు డు ఏస్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా!
– అధికం అనేది అత్యంత ప్రమాదకరం. కౌరవుల తల్లి గాంధారికి వందమంది కుమారులు ఉండటంవల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది, రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచ టమూ వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటము చాలా కష్టం, అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్య కాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు.
– ఎవరి పనులు వారే చేసుకోవడం. అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో పాండవులకి వాళ్ళు నేర్చు కున్న ఇంటి, వంట పనులు చాలాఉపయోగపడ్డాయి, అలాగే అందరు పనులు నేర్చుకోవాలి.
– మనకి సంబంధించిన దానికోసం ఎంత కష్టమైనా పోరాడాలి. కౌరవులతో పోల్చుకుంటే పాం డవుల సైన్యం చాలా తక్కువగా ఉన్నా పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్త శుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు.
– అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది. ధృతరాష్ట్రుడు అటు బిడ్డలమీద ప్రేమ ఇటు తను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో, కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు, అదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల క్రమ శిక్షణలో పెట్టి ఉంటే వేరేలావుండేది.
– విద్య జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి. అర్జునుడు తన జీవితం ఆసాం తం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుల వారి నుండీ యుద్ధ శాస్త్రం, దైవ సంబం ధమైన ఆయుధాల వాడకం ఇంద్రుడు ద్వారా, మహదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు, కృష్ణుడినుండి రాజనీతులు ఇలా ప్రతిదశలోనూ అభ్యసన వల్ల అర్జునుడికి ప్రత్యేకస్థానం దక్కింది,
– కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు. కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలామంది పాండవులకి సహాయపడిన వారే. భీష్మ, విదుర, ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేసారో తెలిసినదే!
– స్త్రీలని ఆపదల నుండి కాపాడటం. ద్రౌపది ఐదుగురు భర్తలు సంపన్నులూ, అత్యంత బల వంతులు. కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు కదా.
– నీకు ఆసక్తి ఉంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు. చాలామందికి తెలిసినంత వరకూ అర్జునుడే ప్రపంచం మొత్తంలో అతిపెద్ద విలుకాడు, కానీ రాజకీయాల వలన తన వేలుని కోల్పోయిన ఏకల వ్యుడు, అర్జునుడిని మించిన వీరుడు. నేరుగా గురు శిక్షణ లేకున్నా, అతనికి ఉన్న ఆసక్తే అర్జునుడి కన్నా గొప్ప వీరుణ్ణి చేసింది. కావున ఏదైనా సాధించాలంటే దానిపైన అమితమైన ఆసక్తి ఉండాలి.
– మంచి వ్యూహం విజయానికి తప్పనిసరి. కృష్ణుడి అతిచక్కని వ్యూహం లేకపోయి ఉంటే పాం డవులు విజయాన్ని సాధించగలిగేవారు కాదు ఏమో, ఏ పని చెయ్యాలన్నా ఒక మంచి ప్లాన్‌ (వ్యూహం) ఉండాలి! అలా అయితేనే ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలుగుతాం.
– డా. చదలవాడ హరిబాబు, 9849500354

Advertisement

తాజా వార్తలు

Advertisement