Wednesday, March 27, 2024

ఐశ్వర్యానికి కారకుడు శివుడు

ఈశ్వరానుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరు డికి ఒకసారి అందరికంటే తానే ధనవంతుడి ననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలం దరికి మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్ప తనాన్ని చాటు కోవాలని తలచాడు కుబేరుడు. దేవత లందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడా నికి కైలాసానికి వెళ్తాడు. శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు, నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కుబేరుడు కైలాసానికి చేరుకుంటాడు. శివుడు సర్వాంతర్యామి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్నీ తెలుసుకోగలడు. కుబేరుడు అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి పథ కాన్ని అర్థం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వ తులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి శివునికి నమస్కరించి ”మహా దేవా.. మీరు, పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి” అన్నాడు. శివుడు తనకు కుదరదన్నాడు, భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీదేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు.
వస్తూనే… ‘అమ్మా! ఆకలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు’ అన్నాడు గణపతి.
పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి.. ‘కుబేరా! మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు’ అంది.
వెంటనే మహాశివుడు ‘ఔనౌను, గణపతికి విందు భోజనం అంటే మహాఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకెళ్ళు’ అన్నాడు పరమశివుడు.
”ఆహా! ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా, నా ఇంటికి విందుకొచ్చేది. ఎంత తింటాడులే” అనుకుంటూ గణపతిని తీసుకుని బయలుదేరాడు. తన భవనంలోకి తీసుకెళ్ళి, తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపించసాగాడు.
”ఇవన్నీ వ్యర్ధం, నాకు అవసరంలేదు. మీరు నాకు త్వరగా ఆహారం పెట్టండి” అన్నాడు గణపతి. దాంతో కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ జారీ చేశాడు. వెంటనే బంగారు కంచం పెట్టి, రకరకాల తీపి పదా ర్థాలు, పానీయాలు, కూరలు, పండ్లు.. వడ్డించారు. కుబేరుడు చూస్తుండగానే ఒక్క పెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహా రాన్ని తినేసి, ”ఇంకా తీసుకురండి” అంటూ ఆజ్ఞ చేశాడు.
సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు.
‘ఇంకా కావాలి’ అంటూ గణపతి అడిగాడు.
వంటవారికి ఆహారం వండటం గణపతికి వడ్డించ డమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం చూస్తూండగానే ఖాళీ అయిపోయింది.
విషయం కుబేరుని తెలిసింది. తన సంపద మొత్తం తరిగిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడంలేదు, ఏమి చేయాలో అర్ధంకాలేదు.
ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరు ని పిలిచి, ”నీ ఇంటికి విందుకు రమ్మని, నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావ్‌” అంటూ పలికాడు.
కుబేరుడికి విషయం అర్ధమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏమాత్రం సంతృప్తి పరచలేదని, అన్ని ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహంకారం అణచడానికే పరమ శివుడు ఈవిధంగా చేశాడని గ్రహించి పరుగు పరుగున కైలాసానికి వెళ్ళాడు.
”శివా.. శంకరా.. నేవే దిక్కు.. ధనానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అ#హంకారంతో ప్రవర్తించా ను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి, అన్నీ ఇచ్చిన భగవంతుడే, అ#హంకరించినవారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను. ఏదైనా మార్గం చూపించండి” అన్నాడు.
అప్పుడు శివుడు ”కుబేరా! నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావల్సినది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం, నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మత్రామే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకుని అహకారం విడిచి, చేసిన తప్పుని ఒప్పుకుని పరమ భక్తితో గణపతికి సమర్పించు” అన్నాడు.
కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణ పతికి భక్తితో సమర్పించాడు.
ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేనుపులు వచ్చాయి.
గణపతి సంతృప్తి చెందాడు.
మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం.
కుబేరుడి అహంకారాన్ని అణిచివేసిన గణపతి, మనలోని అహంకారాన్ని కూడా పటాపంచలు చేయు గాక.
నీతి: పెట్టేది కొంచెమైనా అహంతో కాకుండా ప్రేమ తో భక్తితో పెట్టడం వల్ల అంతా మంచి జరుగుతుంది.
సర్వేజనా సుకినోభవంతు..
ఓం నమ: శివాయ..
హర హర మహదేవ శంభో శంకరా…

– డా. చదలవాడ హరిబాబు 9849500354

Advertisement

తాజా వార్తలు

Advertisement