Thursday, April 25, 2024

ఐశ్వర్యాన్నిచ్చే కుబేర పచ్చ కుంకుమ

మన భారతదేశంలో ”పసుపు-కుంకుమ”లను మంగళకరమైనవిగా, ‘సౌభాగ్య’ చిహ్నాలుగా భావించి, పవిత్రంగా చూసుకుంటారు. ఏ శుభకార్యానికైనా, పూజలకైనా ముందుగా సిద్ధం చేసుకునేవి ‘పసుపు- కుంకుమ’లే! పసుపులో పచ్చి పసుపు, కస్తూరి పసుపు, ఛాయ పసుపు, కొమ్ములు, దుంప పసుపు అని పలు రకాలు ఉన్నాయి. అలాగే… కుంకుమలో కూడా పలు రకాలు ఉన్నాయి. ఎరుపు, ముదురు ఎరుపు, సింధూరపు రం గు, మీనాక్షీ కుంకుమ, (ఈ కుంకుమ మొగలి పూవుల సువాసనతో వుంటుంది.) మొదలైనవి ఎక్కువగా వాడు కలో వున్నాయి. కానీ ‘కుంకుమ’లో ‘ఆకుపచ్చ’రంగు కుంకుమ గురించి చాలామందికి తెలియదు. దీనినే ”కుబేర పచ్చకుంకుమ” అంటారు. ఈ కుబేర పచ్చ కుంకుమకు ఓ ప్రత్యేకత ఉంది. పురాణాలలో కూడా ఈ కుంకుమ వర్ణించబడింది. ఇది కుబేరునికి చాలా ప్రీతికరమైనది. ‘పార్వతీదేవి’కి కూడా ప్రీతికరమైనది పచ్చ కుంకుమే. ఈ ‘కుంకుమ’ గురించి శివపురాణం యిలా వివ రించింది. పరమశివుని భక్తుడైన కుబేరుడు ఒకసారి కైలాసానికి వెళ్ళాడట. అక్కడ ఏకాంతంగావున్న శివ పార్వతులను చూశాడట. ప్రతిరోజూ దేవిని పవిత్రంగా ఆరాధించే కుబేరునికి ఆరోజు ‘అంబిక’ను దర్శించగానే ‘కామ వికారానికి, లోనయ్యాడట. ఒక్క క్షణం ‘పార్వతీదేవి’ని, తన భార్య గా ఊహించుకున్నాడట. ‘సర్వజ్ఞాని’ ఆ సర్వేశ్వరునికి ఇది తెలియకుండా ఉంటుందా? సర్వేశ్వరునికి కోపం వచ్చింది. శివుని అర్ధభాగమైన సతీదేవి ఉగ్రురాలైంది. శివ పార్వతులిద్దరూ కుబేరుని వైపు ఉగ్రంగా చూశారు.
ఆ చూపుల తీక్షణతకు, కుబేరుని దేహం కాలి కమిలిపోయిందట. కుబేరుడు గడగడా వణికిపోయా డు. పరమశివుని కాళ్ళ మీదపడి మన్నించమని వేడు కున్నాడు. అప్పుడు శివుడు ”మా ఇద్దరి కోపం వలన ఏర్పడిన యీ ఉగ్రత, మా ఇరువురి శాంత స్వరూపా లు ఒకటైనప్పుడు చల్లదనంగా మారుతుంది. ఆ చల్లదనమే నీ దేహాన్ని తాకి, నీ చర్మం కమిలిపోవడం తగ్గి మామూలు రూపం లభిస్తుంది” అని కుబేరుని దీవించాడు. అంత కుబేరుడు పరమేశ్వరుడే గతి అని అనేక స్తో త్రాలతో స్తుతించాడట. త్వరగానే పార్వతీ పరమేశ్వరు లు కుబేరుని కరుణించారట. వారి అనుగ్రహంతో కుబే రునికి స్వస్ధత చేకూరిందట. అయినా శరీరం కాలిన ప్రదేశాలలో, తప్పుకి శిక్ష గా, మచ్చలు శాశ్వతంగా వుండిపోయాయట.
పరమేశ్వరుని కంఠం చుట్టూగల నీలం వర్ణం, పార్వతీదేవి పసిమి ఛాయ.. అంబిక మంగళరూపిణిగా దర్శనమిచ్చినప్పుడు, పసుపు వర్ణంగానే దర్శనమిస్తుం ది. ఆ పసుపు వర్ణాన్ని, తన దేహానికి పసుపు నలుగు పెట్టి తీసిన పసుపుతో వినాయకమూర్తిని చేయడం మనకు తెలుసు. ఈ నీలవర్ణం, ఆ పసుపు వర్ణం రెం డూ కలసినప్పుడు, అక్కడ ఒక అద్భుతం జరిగిందట. ఆ రెండింటి కరుణా కిరణాలు పడిన ప్రదేశంలోని మట్టి అంతా ‘ఆకుపచ్చ’గా మారిపోయిందట.
నీలం… పసుపు రంగులను మిశ్రం చేస్తే, ఆకుపచ్చ రంగు ఏర్పడుతుంది. కుబేరుడు ఆ ‘ఆకుపచ్చ మట్టి’ని తన శరీరానికి, పూసుకోగానే మాడి కమిలిన దేహమంతా, మామూలు స్థితిని పొంది, శివపార్వతుల ఆగ్రహం నుండి విముక్తి పొందాడట. అంతేకాకుండా ఆ పచ్చమట్టిని తన పట్టణానికి తీసుకొని వెళ్ళి, నిత్యం శరీ రానికి ధరించేవాడట. ఆనాటినుండి ‘పచ్చరంగు’ కుబే రునికి ప్రీతిపాత్రమయిందట. ‘పచ్చరంగు కుంకుమ’ కుబేర చిహ్నంగా అయి, పురాణాలలో ఎంతో పవిత్రత ను సంతరించుకుంది. దీన్ని పూజగదిలో పెట్టుకున్నా, నుదుట ధరించినా ఐశ్వర్యాన్ని ఇస్తుంది.

– దైతా నాగ పద్మలత

Advertisement

తాజా వార్తలు

Advertisement