Thursday, April 25, 2024

జీవునికి చైతన్యాన్నిచ్చేది గురుతత్త్వమే!

ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనేగానీ మానవజన్మ లభించదు. అంత పుణ్య ఫలంగా లభించిన ఈ మానవజీవితం ఒకరి దగ్గర ఒకలా, మరొకరి దగ్గర మరోలా?! ఒకే మానవజీవితం- వేర్వేరు రూపాలు!
ఒకే మానవజీవితం- వేర్వేరు దారులు! ఒకే మానవజీవితం- వేర్వేరు అభి రుచులు!
ఒకే మానవ జీవితం- విభిన్న పోరాటాలు!
ఒకరు చెత్తకుప్పలో జననం… మరొకరు పూరిపాకలో పుట్టుక… ఇంకొకరు బం గ్లాలో… ఒకే మానవ జీవితం ఒకరు ఆకలికి అడుక్కోవటం… మరొకరు ఆకలే ఎరు గక ఆడుకోవడం!
ఒకే మానవ జీవితం- ఒకరు పొట్టకూటి కోసం చదువుకోవటం… మరొకరు రోజు గడిపేందుకు (కాలక్షేపం) కోసం చదువుకోవటం. ఒకే మానవ జీవితం- ఒకరు కష్టాలు కన్నీళ్ళే తోడుగా జీవితం… మరొకరు కష్టాలకు కన్నీళ్ళకు దూరం! ఇంతేకాదు… ఒకరి జీవితం సుఖంగా సాగుతుంటే, మరొకరు ఎదుటివాళ్ళను కష్టపెట్టడమే ప్రవృత్తిగా ఆనందిస్తుండే జీవితం సాగిస్తుంటారు. ఒకరు ఎదుటి వారి పై ప్రేమ చూపిస్తుంటే, మరొకరు అణువణువునా ద్వేషం నింపుకొని ప్రవర్తిస్తుం టారు. ఒకరు సమాజానికి మంచి చేయాలని పాకులాడుతుంటే, మరొకరు సమాజాన్ని ఎలా భ్రష్టుపట్టించాలా అని అన్వేషిస్తుంటారు. ఒకడు ఎదుటివానిలో మంచినే చూస్తూం టే, మరొకనికి అందరిలోనూ లోపాలే కనిపిస్తుంటాయి.
ఇదంతా భగవంతుని లీలావిలాసమే అయినప్పటికీ ఈ విషయం ఎరుకలోకి లేకపోవడం వల్ల ఏ మనిషిలో తొంగిచూచినా ఎక్కడో అట్టడుగున అయినా సరే, దు: ఖఛాయలు ఉంటూనే ఉంటుంటాయి. మరి ఈ దు:ఖం తొలగాలంటే ఖచ్చితంగా సద్గురుదేవుని కృప ఉండి తీరాల్సిందే!
అయితే సద్గురు కృప అంత సునాయాసంగా అందుకోలేము. సద్గురు కృప మధ్యాహ్నపు సూర్యుని కాంతిలా అంతటా వ్యాపించియున్నప్పటికీ అందుకోవటం అంత సులభమేమీ కాదు. సద్గురు కృప పొందాలంటే ముందుగా సద్గురువును ఆశ్రయించి శరణాగతి చెందాలి. అలా శరణాగతి చెందాలంటే- భగవంతుడే లక్ష్యం గా ఉండి, మన ప్రవర్తన ఋజువర్తనంగా ఉండాలి.
మన పుణ్యంకొద్దీ మానవజన్మ లభించినా కూడా మన ప్రారబ్దం కొద్దీ ఎక్కడ ఎలా జన్మించాలో అక్కడ అలా జన్మించడం జరుగుతుంది. అయితే గత జన్మలలోని వాసనల ప్రభావం వల్ల మనం ఆయా గుణాలను వెంటబెట్టుకొని వస్తాము.
అయితే మరింత పుణ్యం ఉంటేనే సత్పురుషులు గురించి, సద్గురువుల గురించి ఎలానో ఒకలా తెలుస్తుంది. ఇంకా పుణ్యం ఉంటేనే సద్గురు సన్నిధి ప్రాప్తమవుతుంది. అప్పుడు కూడా ఇంకా మరెంతో పుణ్యం ఉంటేనే శరణాగతి సాధ్యమవుతుంది. అయి తే అన్నింటితోపాటు భగవంతుని పొందాలన్న తపన ప్రతి దశలోనూ ఆవ#హస్తుంది. అప్పుడే సద్గురు కృప ప్రతి నిమిషమూ ఉండితీరాలి. ఆరని అగ్నివలే ఆ తపన వివేక ముతో కూడి రగులుకుంటూ ఉండాలి. భగవంతుడే లక్ష్యమైనప్పుడు ఈ సమస్త దృ శ్యమాన జగత్తు పట్ల వైరాగ్యము మనకు తోడై నిలిచి భగవత్‌ ప్రాప్తి జరు గుతుంది!
సద్గురు కృప మనకు ప్రాప్తమయిందనడానికి గుర్తేమిటి?
సద్గురు కృపను చవిచూడటం ఆరంభం కాగానే ఇష్టాయిష్టాలు లేకుండా పోతాయి. దే#హభ్రాంతి తొలగుతుంది. రాగద్వేషాల మాటయే ఉండదు. తద్వారా ఋణానుబంధాలు సమసిపోతాయి. ఇదంతా మనకు సాధ్యమయ్యేనా?!
మనందరి జీవన పరిస్థితులు వేర్వేరు…మనందరి భావజాలం వేర్వేరు… మనందరం అనుభవిస్తున్న ప్రారబ్ధం వేర్వేరు…మనందరి ఇష్టాయిష్టాలు వేర్వేరు… మనందరి భూత, వర్తమాన, భవిష్యత్తులు వేర్వేరు… మనందరి చుట్టూ పొంచియు న్న కర్మబంధాలు వేర్వేరు… ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఎవరిలో ఎలాంటి రజస్తమో గుణాలు దాడి చేస్తున్నప్పటికీ భగవంతుడిని పొందాలన్న ఒక్క ఆలోచన తపనగా రూపొంది, సత్యమును గానీ లేదా దైవీగుణాలలో ఏ ఒక్కదానిని పట్టుకొని ఆచరిస్తున్నా చాలు; ఆ వ్యక్తి ముందుకు అడుగులు వేయగలుగుతూ సద్గురు కృపకు ప్రాప్తమయ్యే అవకాశాలను అందిపుచ్చుకోగలడు. మనం ప్రయత్నంతో ఒక్క అడు గు వేస్తే, గురువు పదడుగులు మన వైపు వేసి తన కృపావర్షం కురిపించగలడు!
గిరీష్‌ ఘోష్‌ అనే ఆయన నాటక సమాజాన్ని నడుపుతూ, పెద్ద హాలు కలిగి, నాట కాలు వేయిస్తూ డబ్బు గడిస్తుంటాడు. గర్విష్టి, కోపిష్టి, జూదరి, వేశ్యాలోలుడు. అయి తే అతనిలో ఎన్ని లోపాలున్నా తనకు సంబంధించిన విషయాలను నిర్భయంగా ఒప్పుకుంటాడు. అసత్యమాడడు. నిర్భయంగా ఉంటాడు. శ్రీరామకృష్ణ పరమ#హం స అంతటివారి సాంగత్యం లభించినా తన అలవాట్లు మానుకోలేదు. తన అలవాట్ల గురించి గురుదేవులకు అబద్ధం చెప్పలేదు. పైగా తాను ఈ అలవాట్లను వదులుకో లేనని, వదులుకోనని నిష్కర్షగా చెప్పాడు. అయితే గురుదేవుల సాంగత్య ప్రభావం పల్ల తాను అనుభవిస్తున్నది అసలైన ఆనందం కాదనే విషయాన్ని గ్ర#హంచినవాడైన గిరీష్‌ తనను ఉద్ధరించమని, అయితే తన అలవాట్లను మాత్రం మానుకోవద్దని సల హా ఇవ్వవద్దని కోరతాడు గురుదేవులను, శ్రీరామకృష్ణులు అనుగ్రహస్తారు అట్లేనని. కాలక్రమంలో తన దురలవాట్ల నుండి గిరీశ్‌ చాలా సునాయాసంగా బయటపడిపో తాడు. ఇంతటికీ కారణం అతనిలోని సత్యనిష్ట, గురుదేవుల సాంగత్య ప్రభావం! ఒక్క సత్యమనే గుణాన్ని పట్టుకోవడం వల్లనే అతనికి గురువు అనుగ్రహం సులభతరమైం ది. ఇలాంటి సంఘటనలు పలువురు మహాత్ముల జీవిత చరిత్రలలో చూడగలం. కానీ మనమెలా ఉంటున్నాము? మన లోపలి గుణాలు మనలను ఎటు నడిపిస్తున్నా యో మనకు తెలుసు. కానీ నలుగురు ముందు మనలను గొప్ప చేసుకునే ప్రయత్నమే చేస్తూ మనలోని దుష్టగుణాలను కప్పిపుచ్చుతుంటాము. వాటిని పోగొట్టుకోవడం మాట దేవుడెరుగు, కనీసం తాము ఆశ్రయించిన గురువు పట్ల తగిన శ్రద్ధ, విశ్వాసాలు చూపుతున్నామా అంటే, అదీ లేదు. ఇతరుల మెప్పుకోరుతూ పరమ భక్తునిలా నటి స్తుంటారు. సత్యం, ధర్మం, ప్రేమ, దయ, కరుణ వంటి సత్వగుణాల్లో కనీసం ఏదో ఒక్క సద్గు ణాన్ని అయినా స్థిరంగా పట్టుకోవాలి. సద్గురు కృప ఉండి కూడా మన ప్రయత్నం లేకుండా ఉంటే లాభం లేదు. ఒక్క సద్గుణం మన పరమైతే చాలు, మన ప్రమేయం లేకుండానే మిగతా సద్గుణాలన్నీ మనలను వరిస్తాయి.
అన్నింటికీ మించి, మనం ఏ గురువును ఆశ్రయించినా, ఆయన ఆ దేహానికే పరి మితం కాదనీ, విశ్వంలోని అణువణువూ వ్యాపించియున్నాడని, తనతోపాటు ప్రతి జీవిలోనూ ఆ గురుతత్త్వమే చైతన్యంగా భాసిల్లుతున్నదన్న వివేకాన్ని వీడకూడదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement