Friday, April 19, 2024

కొండల్లో…కోనల్లో శివక్షేత్రం

దేవాలయం అంటే నిత్య పూజలు, నైవేద్యాలు సర్వసాధారణం. కానీ తెలంగాణాలోని ఓ దేవాలయం సంవత్సరానికి కేవలం 5 రోజులు మాత్రమే తెరచివుంటుంది. ఈ గుడికి వెళ్ళాలంటే ప్రాణాలపై ఆశ వదులు కోవాల్సిందే. ఆ రోజులూ దేవుడికి పూజలు చేసి గుడిని మూసేస్తారు. మళ్ళీ తెరిచేది సంవత్సరం తర్వాతే. ఎందుకంటే ఈ గుడికి వెళ్ళాలంటే గుండెలు అరచేత్తో పట్టుకుని అడుగులు వేయాల్సిందే. అడుగడుగునా పొంచివున్న ప్రమాదాలతో ఓ సాహసయాత్రను తలపించే ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే భక్తి ఒక్కటే చాలదు. గుండె ధైర్యం కూడా పుష్కలంగా వుండాలి.

భక్తుల కొంగుబంగారంగా, ఆదివాసీల చేత ప్రత్యేక పూజలు అందుకుంటూ… తెలంగాణ అమరనాథ్‌ యాత్రగా పిల వబడుతున్న శివ క్షేత్రం సలేశ్వరం. ఈ క్షేత్రంలో ఏప్రిల్‌ 3వ తేదీ నుండి ప్రారంభమవుతున్న జాతరకు తరలివచ్చే లక్షలాదిమంది భక్తులకు కావలసిన ఏర్పాట్ల పనులు చేపట్టారు. ఈ జాతరకు వచ్చే భక్తులు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే సలేశ్వరం చేరుకోవాలని అటవీశాఖ అధికారులు ఆంక్షలు విధించారు

ఆ గుడి ఎక్కడ వుంది?

ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశంలో శివయ్య కొలువుదీరిన శివక్షేత్రం సలేశ్వరం. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో లోయలో వున్న గుహలో దర్శనమిస్తాడు. శ్రీశైలానికి 40 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం అడవులలోని ఒక ఆదిమవాసి యాత్రా స్థలం. ఆధ్యాత్మిక ప్రదేశం. ఎంతో చారిత్రిక ప్రాముఖ్యతగల దివ్య క్షేత్రం. స్థానిక చెంచులే ఇక్కడ పూజారులు.
ఇక్కడ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుం ది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత వచ్చే చైత్ర పౌర్ణమికి రెండు రోజు ల ముందు మొదలగుతుంది. రెండు రోజులు తరువాత మొత్తం అయి దు రోజులు జరుగుతుంది. శ్రీశైలం అడవిలో నుండి 25 కిలోమీటర్ల ప్రయాణించాలి. ఇందులో 20 కిలోమిటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది. అక్కడి నుండి 5 కిలోమీటర్ల కాలినడక తప్పదు. ఇక్కడకు వెళ్ళడానికి సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలో నికి అనుమతి వుంటుంది. ఇరుకైన లోయల్లో కేవలం కాలు మాత్రమే పట్టే దారి మాత్రమే వుంటుంది. పొరపాటున అక్కడ కాలు జారితే అంతే సంగతులు. కనీసం శవం కూడా దొరికే పరిస్థితి వుండదు. అయి నా కూడా సలేశ్వర సందర్శనానికి ఎప్పుడు అనుమతి లభిస్తుందా అని భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే మండు వేసవిలో తెరు చుకునే ఆ శివక్షేత్ర యాత్రంతా ప్రకృతి అందాల నడుమే సాగుతుం ది. దారి పొడవునా వుండే జలపాతాలు, పచ్చని అందమైన చెట్లు,, కొండ లు… లోయలు… గుహలు, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
క్రింద గుహలో కూడా లింగమే ఉంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలున్నాయి. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుతున్నది కనుక కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు ‘వత్తన్నం వత్తన్నం లింగమయ్యో’ అంటూ వస్తారు. తిరిగి వెళ్ళేటప్పుడు ‘పోతున్నం పోతున్నం లింగమయ్యొ’ అని అరుస్తూ నడుస్తుంటారు.
ఈ ప్రాంతంలో పులులు ఎక్కువగా సంచరిస్తుండడంతో 1973 లో కేంద్ర ప్రభుత్వం టైగర్‌ ప్రాజెక్టును ఇక్కడ ఏర్పాటుచేసింది. అక్కడ నుంచి సలేశ్వరానికి 3 నడక దారులున్నాయి. దట్టమైన అడవిలో వున్న సలేశ్వర ఆలయంలో చెంచులే పూజాకార్యక్రమాలు నిర్వహస్తూ వుంటారు.

ఆలయ చరిత్ర

- Advertisement -

సలేశ్వర ఆలయాన్ని 6వ శతాబ్దిలో నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతారు. 13వ శతాబ్దంలోని మల్లికార్జున పండితారాజ్య చరిత్ర, శ్రీ పర్వత క్షేత్రంలో సలేశ్వర క్షేత్ర విశేషాలను పాల్పురి సోమనాధుడు వర్ణించాడు. ఆలయం నిర్మించిన నాటి నుంచి ఏడాదిలో 5 రోజులు మాత్రమే తెరచివుంచటం ఆనవాయితీగా వస్తోంది.
17వ శతాబ్దం చివరిలో ఛత్రపతి శివాజీ సలేశ్వరం క్షేత్రంలో ఆశ్రయం పొందినట్లు చరిత్ర చెబుతుంది. అక్కడి ప్రకృతి అందాలకు ముగ్దుడైన నిజాం. వంద సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విడి దిని నిర్మించాడు. అదిప్పుడు శిథిలావస్థలో వుంది. ఆ ప్రదేశానికి ఫరాహబాద్‌ అనిపేరు. అనగా అందమైన ప్రదేశం అని ఆర్థం.

ఎలా చేరుకోవాలి?

హదరాబాద్‌- శ్రీశైలం వెళ్ళేదారిలో మన్ననూర్‌ అనే ఊరు వస్తుంది. అక్కడి నుండి 10- 12 కి.మీ. దూరం శ్రీశైలం వెళ్ళే మార్గం లో వెళ్తే… సలేశ్వరం అనే బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు చూపించే గుర్తు వైపు 10 కిలోమీటర్లు వెళ్తే… సలేశ్వరం లోయ కనిపిస్తుంది. లోయలో ఐదు కిలోమీటర్లు నడిస్తే… ఆకాశ గంగను తలపించే జలపాతం, గుహలు కనిపిస్తాయి. అదే సలేశ్వర క్షేత్రం.

నిజాం విడిది నుండి ఎడమ వైపున 22 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్‌ క్యాంపు వస్తుంది. అక్కడే వాహనాలను ఆపుకో వచ్చు. అక్కడినుండి సలేశ్వరం అనే జలపాతం చేరుకోడానికి రెండు కిలోమీటర్ల దూరం నడవాలి. సలేశ్వరంలోని తూర్పు గుడ్డ పొడవునా స్పష్టమైన దారులున్నాయి. అవి జంతువులు నీటికోసం వెళ్లే మార్గాలని చెబుతారు. పడమటి గుట్టలో ఎన్నో గుహలుంటాయి. అవన్నీ కాలా నుగుణంగా ఒకప్పుడు ఆది మానవులు, ఆ తరువాత బౌద్ధ బిక్షకు లు, ఆపైన మునులకు, ఋషులకు స్థావరాలుగా వుండేవని చారిత్రిక ఆధారాలు చెబుతున్నాయి. ప్రకృతి ప్రియులకు, పర్యాటకులకు, చరిత్ర పరిశోధకులకు ఎంతో ఆహ్లాదాన్ని… ఉత్సాహాన్ని కలిగించే దివ్య ఆధ్యాత్మిక క్షేత్రం ఇది.

Advertisement

తాజా వార్తలు

Advertisement