Friday, April 19, 2024

ధర్మం – మర్మం : గోదా కళ్యాణం (ఆడియోతో…)

గోదా కళ్యాణంలోని అంతరార్థం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
శ్రీమన్నారాయణుడు సంసారంలోని జీవులను తరింప చేసే విధానాన్ని ఆలోచిస్తుండగా అమ్మ అతని అనుమతితో విష్ణుచిత్త పుత్రికగా పుట్టి యుక్త వయస్సు రాగానే పరమాత్మను మాత్రమే భర్తగా పొందగోరింది. ద్వాపర యుగంలో గోపికలు చేసిన మాస వ్రతాన్ని తాను ఆచరించి, పరమాత్మను ప్రసన్నుడిని చేసుకుని వివాహమాడింది. గోదా అంటే వాక్కును, వస్త్రములను, అద్దమును, విసనకర్రను, ధనమును, జ్ఞానమును, సేవను ఇచ్చునది అని సంగ్రహంగా ఏడు అర్థాలు. మన వాక్కును, మనస్సును, శరీరాన్ని, బుద్ధిని, చిత్తాన్ని, ఒక్క మాటలో మన మొత్తాన్ని పరమాత్మకిచ్చు జీవాత్మే గోదా. దొరికిన రెండు పువ్వులు వేసి వచ్చిన నామాలు చెప్పి పరమాత్మకు మనల్ని మనం అర్పించుకోవాలి అనే మూడు ముక్కలను ముప్పై పాశురాలలో చెప్పి మూడు లోకాలను ముక్తి మార్గంలో నడిపించి మురిపించిన తల్లి గోదా. జీవాత్మ పరమాత్మను చేరుటయే గోదా కళ్యాణం.

తాను ఆచరించిన వ్రతం, తాను పొందిన ఫలితం తనలోనే దాచుకొనక పది మందికి వ్రత విధానాన్ని బోధించడానికి తిరుప్పావై అను ముప్పై పాశురాల ప్రబంధాన్ని మృదుమధురంగా లోకానికి అందించింది గోదాదేవి. ఆర్తి ఉన్నవారు అందరూ భగవంతుని పొందడానికి అర్హులే. కులం,మతం,జాతి వంటి భేదాలు భగవంతుని పొందే విషయంలో లేవని విశ్వమానవ కళ్యాణాన్ని వేనోళ్లచాటిన దయామయురాలు గోదమ్మ. తాను ఒక్కతే కాక పది మంది గోపికలను లేపి వారితో కలిసి పరమాత్మ దగ్గరకు వెళ్లడం ద్వారా రుచికరమైన పదార్థాన్ని ఒక్కరే భుజించక పదిమందికి పంచాలనే ఉపదేశాన్ని తెలియజేస్తుంది. భగవంతుని చేరాలంటే ఆహార నియమం, వ్యవహార నియమం తప్పక పాటించాలని, మనం చేసుకునే అన్ని అలంకారాలు భగవంతుని కోసమే అని చెప్పడమే ఈ వ్రతోద్దేశ్యం. ఏ వ్రతమైనా నియమాలను ఆచరించడం తప్పనిసరి. శరీరాన్ని శోషింప చేస్తే మనసు పోషింప బడుతుంది, మనసు పోషించ బడితే స్వార్థం సమూలంగా నశిస్తుంది, పరార్థం, పరమార్థం వికసిస్తాయి అనే ఉపదేశం గోదా కళ్యాణంలో ఇమిడి ఉంది.

శ్రీమాన్‌ డాక్ట ర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement