Thursday, March 28, 2024

వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం

తిరుప‌తి : భ‌జ‌న మండ‌ళ్ల స‌భ్యులు మ‌హ‌ర్షులు సూచించిన మార్గంలో న‌డిచి శ్రీ‌వారి వైభ‌వాన్ని, ధ‌ర్మ‌ప్ర‌చారాన్ని మ‌రింత విస్తృతం చేయాల‌ని ఉడిపికి చెందిన పుత్తిగె మ‌ఠాధిప‌తి సుగుణేంద్ర‌తీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. ముందుగా సుగుణేంద్ర‌తీర్థ స్వామీజీ, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుగుణేంద్ర‌తీర్థ‌స్వామీజీ మాట్లాడుతూ.. బ్రహ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. పూర్వం శ్రీపురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టిటిడి మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్టు చెప్పారు. భజన మండళ్ల సభ్యులకు టిటిడి మూడో సత్రం ప్రాంగణంలో ధార్మిక శిక్షణ, హరిదాస కీర్తనల్లో అంత్యాక్షరి, దాస సాహిత్యంలో రసప్రశ్నల స్పర్థ, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్టు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement