Thursday, April 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 10, శ్లోకం 2

న మే విదు: సురగణా:
ప్రభవం న మహర్షయ: |
అహమాదిర్హి దేవానాం
మహర్షీణాం చ సర్వశ: ||

తాత్పర్యము : సర్వవిధముల నేనే దేవతలకు మరియు మహర్షులకు మూలమై యున్నందున దేవతా సమూహముగాని, మహర్షులుగాని నా ఉనికిని లేదా విభూతులను తెలిసికొనజాలరు.

భాష్యము : శ్రీ బ్రహ్మ సంహితములో చెప్పబడినట్లు, శ్రీకృష్ణుడే దేవాదిదేవుడు మరియు అతని కంటే అధికులు ఎవరూ ఉండరు. ఆయనే సర్వకారణ కారణుడు. దేవతలను మహర్షులను సృష్టించినది కూడా ఆయనే. వారి కంటే ముందు ఉండుటచే వారు కూడా శ్రీకృష్ణున్ని అర్థం చేసుకొనలేరు. ఇక ఈ ప్రపంచానికి సంబంధించిన పండితుల గురించి చెప్పనేల? కాబట్టి భగవంతున్ని అర్థము చేసుకొనుటకు కేవలము పాండిత్యము సరిపోదు. ఎవరూ కూడా వారి సృష్టి కారకుణ్ణి గురించి తమంతట తాము తెలుసుకొనలేరు. అతడే కరుణతో తన గురించి తాను తెలియజేస్తే తప్ప ఇది సాధ్యము కాదు. భగవద్గీత, శ్రీమద్భాగవతము వంటి గ్రంథాలను వినుట ద్వారా మనము సచ్చిదానందుడైన భగవంతుణ్ణి తెలిసికొనవచ్చును. కాబట్టి భగవంతుణ్ణి శరణు జొచ్చిన భక్తులు మాత్రమే దేవాదిదేవుడు శ్రీకృష్ణుడని గుర్తించగలుగుతారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో

Advertisement

తాజా వార్తలు

Advertisement