Wednesday, April 24, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు – క్షమ (ఆడియోతో..)

మహాభారతం, శాంతిపర్వంలోని సుభాషితం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

క్షమ
శ్రమోనవాచాం శిరసోనలూనం నచిత్తతాప: తనోర్విమర్ద:
నచాపి హింసాది: అనర్ధయోగ: శ్లాఘ్యాపరం క్రోధ జయేక్షమైకా

క్రోధమును జయించుటకు వాక్కులకు శ్రమ ఇవ్వవలసిన అవసరం లేదు. తలను పట్టుకొని అటుఇటు ఊపుతూ తొలగించే ప్రయత్నం చేయాల్సిన పని లేదు. చిత్తమును తపింప చేయవలసిన పని లేదు. శరీరమును మదించాల్సిన పని లేదు. అలాగే అనర్ధాన్ని కలిగించు హింసాదులు కోపాన్ని జయించలేవు. నిజానికి కోపాన్ని జయించగలిగేది ఓర్పు ఒక్కటే.

తమకు ఇష్టమైన దానిని ఇతరులు తీసుకున్నా, తమ ఇష్టానికి ఇతరులు అడ్డుపడ్డా, తమకి కానీ తమ వారికి కానీ అపకారము చేసినా ప్ర తి ప్రాణికీ క్రోధము కలుగుతుంది. ఆ క్రోధాన్ని తొలగించుకోవడానికి కొందరు దూషణ, నింద, తిట్లు, శాపనార్ధాలు చేస్తూ నోటికి శ్రమ కలిగిస్తారు. మరికొందరు తమ తలను నేలకో, గోడకో వేసి కొట్టుకోవడం వంటివి చేసి తలకు శ్రమనిస్తారు. ఇంకొందరు ఆ విషయమునే నిరంతరం తలచుకుంటూ మనస్సును క్షోభ పెడతారు. మరికొందరు ఎదుటివారు గొంతు నులుముట లేదా తమ గొంతును నులుముకొనుట, గి ల్లుట, కొరుకుట, చేతితో లేదా కర్రలతో కొట్టి శరీరాన్ని హింసిస్తారు. ఈవిధంగా వాక్కుకి, శిర స్సుకు, మనస్సుకు, శరీరానికి మరియు వారికి కావాల్సిన వారికి హింసను, అనర్థమును కలిగించే ప్రయత్నము
కోపమును జయించజాలవు. ఎదుటివారు కూడా అటువంటి ప్రయత్నమే చేయడం ద్వారా ద్వేషం మరియు వైరం పెరగడానికి అవన్నీ కారణాలవుతాయి. నిజానికి కోపాన్ని జయించుటకు కావాల్సింది క్షమ.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement