Saturday, April 20, 2024

సింహికా సంహారం!

జాంబవంతుడి ప్రేరణతో వానరులతో కలిసి హనుమంతుడు, లంకకు వెళ్లా లన్న సంకల్పంతో మహంద్ర పర్వతా న్ని ఎక్కుతాడు. సీతాదేవిని లంకలో వెతికేందుకు ఆకాశ మార్గాన అక్కడకు ప్రయాణమవుతాడు. హనుమంతుడు తాను పయనించాల్సిన మార్గా న్ని ఒకసారి తేరిపార చూస్తున్న హనుమంతుడు అత్యంత సుందరాకారుడిలాగా కనిపించాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ ముందుకూ, వెనుకకూ తిరు గుతాడు. పక్షులను బెదిరించాడు. జంతువులను అదిలించాడు. రొమ్ము, నుదురుతో తాకుతూ చెట్ల ను పడేశాడు. కొండను వూగేట్లు చేశాడు. విజృం భించిన సింహంలా సంచరించాడు.
సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మకు, ఇతర దేవతలకు అణకువతో నమస్క రించి ప్రయాణానికి సన్నాహమవుతాడు హను మంతుడు. సూర్యుడు ఆయనకు విద్యా గురువై నందున తొలుత నమస్కరిస్తాడు. రాక్షసులతో యుద్ధానికి పోతున్నాడు కాబట్టి రాక్షస విరోధి ఇం ద్రుడికి ఆ తర్వాత నమస్కరిస్తాడు. బలం, వేగం కలగాలని తండ్రి వాయుదేవుడికి నమస్కరిస్తాడు. బ్రహ్మాస్త్రాల బాధ కలగకుండా వుండాలని బ్రహ్మ దేవుడికి ప్రార్థనా పూర్వకంగా నమస్కరిస్తాడు. గురుదేవతలతో పాటు ప్రత్యక్ష దేవతైన తండ్రికి నమస్కరించాలని భావించి దక్షిణ ముఖంగా వున్న హనుమంతుడు తూర్పు తిరిగి ఆ పని చేస్తా డు. వానరులందరూ చూస్తుండగా అంతులేనంత గా తన దేహాన్ని పెంచాడు.
సముద్రాన్ని దాటుతున్నానన్న గర్వంతో, హనుమంతుడు రెండు చేతులతో, కాళ్లతో పర్వ తాన్ని ఊగించాడు. కదలని ఆ పర్వతం హనుమం తుడి బలానికి చెదిరింది. ఆ ఊగిసలాటకు పర్వ తం మీదున్న చెట్ల పూలు కొండ మీద రాలడంతో పర్వతం పూలకొండ మాదిరిగా అందంగా కనిపిం చింది. గడగడ వణు కుతున్న ఆ కొండ గుహల్లోని అడవి మృగాలు కలవరపడి చేసిన ధ్వనులు భూ మ్యాకాశాలను దద్ధరిల్ల చేసాయి. పర్వతచరియ ల్లోనూ, చుట్టు పక్కల తిరుగాడే పాములు పడగ లు విప్పి, కాటేస్తే అగ్నితో సమానమైన ఆ విష ప్రభావానికి రాతిగుండ్లు వేయి తునకలై ఎగిరాయి.
ఆంజనేయుడు రామకార్యార్థమై పర్వతాకా రంలో అసాధ్యమైన సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకుపోయే ప్రయత్నంలో ఉన్నాడని సిద్ధులు, చారణులు, విద్యాధరాలకు చెప్పారు. సీతకై సము ద్రాన్ని దాటడం కేవలం రాముడికొరకే కాదు, వానరుల ప్రాణ రక్షణ చేయడం కూడా వుంది. దేహాన్ని అమితంగా పెంచిన హనుమంతుడు ఒక్కసారిగా వళ్ళు విదిలించి, వెంట్రుకలు రాల్చి, వర్షాకాల మేఘం లాగా దిక్కులు పిక్కటిల్లేట్లు గర్జి స్తాడు. గరుత్మంతుడు పామును విదిలించినట్లు తోక విదిలించి సముద్రాన్ని దాటేందుకు ఉద్యుక్తు డయ్యాడు. ఆక్కడున్న వానర ముఖ్యులతో తన పౌరుషాన్ని, బలాన్ని సంతోషంగా తెలియచేస్తూ, వాయువేగ సమానమైన శ్రీరామబాణంలాగా లంకలోకి ప్రవేశిస్తానంటాడు. అక్కడ సీత కని పించకపోతే, రావణుడిని బంధించి తెస్తాననీ, సీత ను తోడ్కొని వస్తాననీ, వెళ్లేది తానొక్కడే కనుక, సీతా దేవిని వెతకడం ఆలస్యమైతే, లంకనే తెస్తాన ని అంటాడు.
కపుల వద్ద సెలవు తీసుకుని హనుమంతు డు, చివాలున ఎగిరిపోతాడు. చేతులు చాచి ఆకాశం లో దూసుకెళ్తున్న పంచముఖ ఆంజనేయుడు పర్వత గుహలోంచి తలబయటకు చాచి ప్రాకు తున్న ‘ఐదు తలల పామా!’ అన్నట్లున్నాడు. అల లతో నిండిన సముద్రాన్ని రివ్వున దాటి ఆకాశాన పోతున్న హనుమంతుడు, ఆకాశ, సాగరాలను తాగుతూ పోతున్నాడా అనిపించింది. హనుమ పయనిస్తున్న సాగర మార్గమంతా ఆయన తొడల వేగంతో తలక్రిందులై, తారుమారై, కనిపించింది. సముద్రం కలవరపడింది. హనుమంతుడి ఉల్లం ఘన వేగానికి సముద్రపు నీళ్లన్నీ ఆకాశంలోకి ఎగిరిపోవడంతో, అందులో వుండే తాబేళ్లు, మొస ళ్లు, చేపలు, ఇతర జలచరాలు, బయటకు కనిపిం చ ాగాయి. #హనుమంతుడికి శ్రమ కలుగకుండా వాయువు చల్లగా వీచింది.
ఇదిలా వుండగా, సముద్రుడు, రామకార్యా ర్ధమై వెళ్తున్న హనుమంతుడికి ఏవిధంగా సాయ పడగలనా అని ఆలోచిస్తాడు. ఆంజనేయుడికి కష్టం కలుగకుండా బడలిక తీర్చే ఉద్దేశ్యంతో, తన లో దాగివున్న మైనాక పర్వతాన్ని ఆ పనికొరకు పురమాయిస్తాడు సముద్రుడు. ”హనుమంతు డు మనకు అతిథి, నీవు ఆయనకు ఎదురేగి నీ నెత్తిన ధరించు. నీవిట్లా చేస్తే, ఆయనకు కొంత బడ లిక తీరుతుంది” అంటాడు మైనాకుడితో.
వెంటనే మైనాకుడు. నీటిని రెండు భాగాలు చేసి పైకొచ్చాడు. తన దారికి అడ్డంగా నిల్చిన మైనా కుడిని గమనించి, హుంకరించి, ఆకాశ మార్గం లోనే ఢీకొన్నాడు. హనుమ దెబ్బకు శోషిల్లి పడిపో యాడు మైనాకుడు. అయినా, ప్రీతిగా హనుమం తుడితో ”నా బంగారు శిఖరం మీద నీ శ్రమ తగ్గేం త వరకు నిలిచి, ఆతర్వాత నీ ఇష్టమొచ్చినట్లు వెళ్లు. సముద్రుడు నీ మేలుకోరినన్నెంచుకున్నా డు. శ్రీరామచంద్రుడు కార్యార్ధివై వెళుతున్న నీకు సహాయపడాలని భావించాడు. ఫలాలు, కంద మూలాలు తిని, అలసట తీరే వరకు విశ్రాంతి తీసు కో” మైనాకుడు హనుమంతుడితో విన్నవిస్తాడు.
మైనాకుడికి తనదైన శైలిలో జ వాబిచ్చాడు హనుమంతుడు. ”పర్వతోత్తమా, నీవు చేసే సత్కా రాలు అంగీకరించినట్లే. నీ మంచిమాటల చేతనే సపర్యలు అంగీకరించినట్లయింది. ఆ ఫలం నీకు దక్కింది. నేను సంతోషించాను. నేనిక్కడ ఆగకూ డదు. చేయాల్సిన పని చాలావుంది. ఎక్కడా ఆగ ననీ, రామబాణంలా వెళ్లి పని చక్క బెట్టుకొ స్తాననీ వానరులతో ప్రతిజ్ఞ కూడా చేసాను. నన్నాప వద్దు. కోప్పడవద్దు మిత్రమా!” అన్నాడు. పోయి వస్తా నని సెలవు తీసుకొని, వేగంగా, మరింత పైకెగిరి, సముద్ర మైనాకుల ఆశీర్వాదం పొందాడు.
ఒంటరిగా సాహసించి పోతున్న హనుమ రావణుడిని ఎలా గెల్చి రాగలడని, దేవతలు, ఋ షులు, సిద్ధులు అనుకుంటారు. ఎలా సముద్రాన్ని దాటగలడన్న సందేహంతో, ఆయన బలాన్ని తెలుసుకోదల్చారు వారు. ఆ ఆలోచనతో, సూర్య కాంతి గల నాగమాత ”సురస”ను సందేహ నివృ త్తి కొరకు ఉపయోగించదల్చారు. దైత్యస్త్రీగా పోయి వేగంగా సముద్రాన్ని దాటుతున్న హను మంతుడికి అడ్డుపడి, ముహూర్త కాలం పాటు ఆల స్యం చేయమని సురసను కోరతారు. సరేనని అంగీ కరించిన సురస, భయంకరమైన పెద్ద వికార రూ పాన్ని ధరించి ఆకాశంలో తిరుగుతూ, ఆంజనే యుడి ఎదురుగా నిల్చి, ‘ఎటుబోతున్నావు’ అని ప్రశ్నిస్తుంది. ”దేవతలు నిన్ను నాకు ఆహారంగా పంపించా రు. నన్ను దాటి నీవెక్కడకు పోలేవు. నా నోట్లో చొరపడు. నిన్ను మింగుతా. నువ్వేం మాట్లా డినా నేను వినను” అంటుంది సురస. ఆమెతో విరోధానికి పోకుండా, రెండు చేతులెత్తి జోడించి, నమస్కరించి, తాను వెళ్తున్న పనిని వివరిస్తాడు.
తనకు చిక్కి ఆతడు ప్రా ణాలతో తప్పించుకుని పోలే డనీ, అది తనకీయబడ్డ వర మనీ అంటూ సురస హనుమ ను అడ్డుకుని నోరు తెర్చుకొని నిలబడుతుంది. తన్ను మింగగల నోరు ఆమెకు లేదని తన దేహాన్ని పది ఆమడల నిడివిగా పెంచు తాడు హనుమంతుడు. సురస ఇరవై ఆమడల నిడివిగా చేస్తుంది. హనుమంతుడు ముప్పై ఆమ డలకు పెంచుతాడు. ఇలా ఇరువురూ పెంచుకుం టూ పోతుంటారు. ఎప్పుడైతే సురస తన నోటిని నూరు ఆమడలకు పెంచుతుందో, హనుమంతు డు తక్షణమే తన దేహాన్ని చిన్నదిగా చేసాడు. బొటన వేలంత రూపంలో, చటుక్కు న సురస నోట్లో చొరబడి, అంతే వేగంతో, ఆమె నోరు మూసే లోపల, బయటపడి, ఆకాశం లో నిల్చి ఆమె కోరిక తీర్చానంటాడు. సురస పోయిన తర్వాత అలక్ష్యం చేయరాని సముద్రాన్ని వదిలి, గరుడ వేగంతో, ఆకాశానికి లంఘించి #హనుమ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. స్వర్గానికి వెళ్తు న్న పుణ్యాత్ములు, దేవతలు భుజించే అన్నాన్ని తీసుకెళ్తున్న అగ్ని హోత్రుడు, చంద్ర సూర్యాదిగ్రహాలు, అశ్వినీ మొదలైన నక్షత్రాలు, దేవ ఋషులు, దేవతలు, ఆకాశ మార్గాన సంచరించే ఇతరులు, నాగులు, యక్షులు, దేవ గంధర్వులు, కిన్నరుల కలయికతో కూడిన బ్ర#హ్మ నిర్మిత ఆకాశ మార్గాన, సూర్యచంద్రులు పయనించే దారిని కూ డా దాటుకుంటూ దూసుకుపోతాడు.
వేగంతో పోతున్న హనుమంతుడిని చూసి, ”సింహక”అనే రాక్షసి హనుమంతుడి నీడను తన ఆకారంతో పట్టుకుంటుంది. ఎదురు గాలి తగిలిన పడవలాగా అయిందప్పుడు హనుమంతుడికి. వేగం తగ్గింది. ఓ భూతం సముద్రం నుండి లేవ డం గమనించాడు. సముద్రంలో సరిగ్గా ఇదే చోట్లో, తన నీడను పట్టుకోబోయే అంగారక గ్రహం వున్నదని సుగ్రీవుడు తనకు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటాడు హనుమంతుడు. వెంటనే భయంకరమైన కొండలాగా, శరీరాన్ని ఎత్తుగా, వెడల్పుగా పెంచుతాడు. అది చూసిన రాక్షసి పాతాళ గుహవంటి భయంకరమైన తన నోరు తెర్చి, మేఘంలాగా గర్జించి, సునాయాసంగా ఆంజనేయుడిని తినేద్దామని ముందుకొచ్చింది. అప్పుడు హనుమ దాని శరీరాన్ని పరిశీలించాడు.
ఇలా పరిశీలించిన వెంటనే అదను చూసి, వజ్రంలాంటి దేహమున్న హనుమంతుడు, శరీ రాన్ని చిన్నదిగా చేసి, దాని నోట్లో దూరాడు. దేవత లది చూసి ఆందోళన చెందారు. దాని పేగులను మొలకల్లాంటి తన గోళ్లతో అతివేగంగా, అతి తొందరగా, ఆ రాక్షసి భరించలేని రీతిలో, నోరు మూసేలోపల, చీల్చి బయటకు దూకాడు మహావీ రుడు ఆంజనేయుడు. (ఈ సింహక అనే హంసిక జలాంతర్గామి లాంటిది. సముద్రంలో వుండి కాప లా కాస్తున్నది కాబట్టే, చుట్టూ సముద్రం ఆవరిం చి వున్న తన లంకా నగరానికి ఎవ్వరూ ప్రవేశించ జాలరనే విశ్వాసం రావణుడికుంది) దేవతలు హనుమంతుడిని పొగడసాగారు.
తనువచ్చిన పని పూర్తిచేసే ఉపాయాన్ని ఆలో చిస్తూ, ఆకాశాన్నుండి కిందకు దిగే ప్రయత్నం చేసాడు హనుమంతుడు. తను దిగాల్సిన తీరాన్ని దగ్గరనుండి చూస్తాడు. అప్పుడే తన శరీరాన్ని, చూసుకుంటూ, ఇంత పెద్ద శరీరంతో కనిపిస్తున్న తనను ఒక వింత జంతువుగా రాక్షసులు భావించి వేడుకగా తన చుట్టూ తిరుగుతారేమోనని అను కుంటాడు. కొండంత శరీరాన్ని తక్షణమే చిన్న దిగా చేస్తాడు. త్రికూట పర్వతం మీదినుంచి దేవేం ద్రుడి పట్టణంతో సరితూగే వనసమూహాలతో ప్రకాశిస్తున్న లంకానగరాన్ని తేరిపార చూసాడు.

(వాసుదాసు ఆంధ్రవాల్మీకి
రామాయణం ఆధారంగా)

– వనం జ్వాలా నరసింహారావు
8008137012

Advertisement

తాజా వార్తలు

Advertisement