Thursday, April 18, 2024

సమయానుకూలతే సగం బలం

మన ఋషులు, మునులు కాలాన్ని అనేక రకాలుగా విభజించారు. వాటిలో ఉత్తరాయనం, దక్షిణాయనంగా చేసిన విభజన తెలిసిందే. దక్షిణాయనం అంతా భగవంతుణ్ణి ఉపాసన చేయవలసిన కాలంగా నిర్ణయించారు.
అప్పుడు చేసే ఆరాధనలు, పూజలు మంచి ఫలితాలి స్తాయన్నారు. ఏ పని ఎప్పుడు చేయాలలో ఆ పని అప్పుడు చేపే వారే ధన్యులుగా భావింపబడతారనేది పెద్దల మాట. సాక్షాత్‌ పరమాత్మ అవతారం ఎత్తి నరుడిగా రామ చంద్రమూర్తిగా వచ్చినా ఆయన నిద్రపోతే సకాలంలో విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తింపుమని విశ్వామిత్రుడు గురువుగా జ్ఞాపకం చేయవలపి వచ్చింది. అదే ”కౌసల్యా సుప్రజా రామా, పూర్వా సంధ్యా ప్రవరత్తే ఉత్తిష్ఠ నర శార్దూలా కర్తవ్యం దైవమాహ్నికమ్‌”.
రామ చరిత మానస్‌ గ్రంధకర్త గోస్వామి తులసీదాస్‌ తన భార్య రత్నావళిపై చూపిన వైవాహిక ప్రేమ ఆ సమయంలో జరిగిన కొన్ని సంఘటనల కారనంగా దివ్య ప్రేమగా మారడంతో తుసీ దాస్‌ మహాభక్తుడుగా రూపాంతరం చెందాడు. అంటే సమయాన్ని బట్టి పనేదైనా గొప్ప ఫలితాన్నిస్తుందనడానికి తులసీదాస్‌ జీవితమే గొప్ప ఉదాహరణ. ఏ పనిని ఎప్పుడు చేయాలో ఆ పనిని అప్పుడే చేయాలని తుసీదాస్‌ తమ రామ చరిత మానస్‌లో ఒక సందర్భంలో ఉటంకించారు.

లాభ్‌ సమయ్‌కో పాలిబో హాని సమయ్‌ కి చూక్‌
సదా విచారహిఁ చారుమతి సుదిన్‌ కుదిన్‌ టూక్‌
”ఏ పనైనా సరైన సమయంలో చేయాలి. అలా చేసే పనే సత్ప éలితాలనిస్తుంది. సమయం గడిచిన తరువాత చేసే పని నష్టాన్ని కలి గిస్తుంది. ఆలోచనాపరులుల మాత్రమే సమయాన్ని బట్టి పనులు చేసి లాభపడతారు” అంటాడు తులసీదాసు. సమయం సందర్భం బట్ట్టి చేసే పనుల వల్ల మనిషి సమాజంలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుందని కవి అభిప్రాయం.

ఇదే విషయాన్ని మహాత్మా కబీర్‌, ”సుఖంగా ఉన్నప్పుడు భగ వంతుణ్ణి తలవకుండా కేవలం దు:ఖ సమయంలో ఆయన్ని ప్రా ర్థించడం వల్ల కలిగే ఫలితం శూన్యం. ఎలాగంటే పంట చేతి కిచ్చే సమయంలో రైతు శ్రద్ధ చూపనపుడు పక్షులన్నీ పంటపై వాలి గిం జల్ని రాలుస్తూ పెద్ద నష్టానకని కలుగజేస్తాయికదా!” అంటాడు.
ప్రసిద్ధ పురుషులు ఎప్పుడూ తమ సమయాన్ని వ్యర్థంగా గడపకుండా ఏదో మహత్కార్యాన్ని తలపెట్టి కొనసాగిస్తారు. ఆ మహత్కార్యం, పూర్తయిన తర్వాత ఎంతో గొప్ప ఫలితాన్నిస్తుంది. భారత జాతీయోద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించిన లోకమాన్య బాల గంగాధర తిలక్‌ను ప్రభుత్వం ఏదో నేరం మోపి మాండలే జైలుకు పంపింది. ఆయన తన జైలు జీవితాన్ని వృధాగా గడపకుండా భగవద్గీతపై గొప్ప వ్యాఖ్యానాన్ని రాశారు. అదే గీతా రహస్యం. కర్మ చేయడమే మనిషిి కర్తవ్యం అని చెప్పే గీతా రహస్యం ప్రపంచ విజ్ఞుల మన్ననలు పొందింది.
సమయం సందర్భాలను ఆకళింపు చేసుకున్న మహాత్ముల సంబోధనలు, ప్రసంగాలు ఆకర్షణీయంగా ఉండడమే గాక శ్రోతలను ఆకట్టుకుని మంత్రము గ్ధుల్ని చేస్తాయనడానికి స్వామి వివేకా నంద పాల్గొన్న మొదటి ప్రపంచ మత సమ్మేళనాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు.
వివేకానందుడు చికాగోలో జరిగిన సర్వ మత సమ్మేళనంలో ”ప్రియమైన అమెరికన్‌ సోదర సోదరీమణులారా” అని సంబోధించిన తీరు ఆ సభలోని వారి కందరికీ కొత్తగా, ఆత్మీయంగా తోచి చాలా సేపు సభా ప్రాంగణం చప్పట్లతో మారు మోగింది. ఇది ఆయన సందర్భ శైలికి అద్ద్దం పడుతుంది.
మానవ జీవన వ్యవహార శైలి గురించి భగవద్గీతలో చెప్పినట్లు ప్రపంచ సాహిత్యంలోని ఏ గ్రంథంలోనూ చెప్పబడలే దంటారు వి జ్ఞులు. అందుకే భగవద్గీతను జీవన గీత అంటారు.
అర్జునడు యుద్ధ భూమిలో ఉండి, తన కర్తవ్యాన్ని మరచిన తీరు కృష్ణ పరమాత్మను ఆశ్చర్యపరచింది. వెంటనే పరమాత్మ గురువై పాండవ మధ్యముణ్ణి శిష్యునిగ చేసుకుని కర్తవ్య బోధ చేశాడు. ఆ బోధలో ఏ సమయ సందర్బాల్లో ఏ పనులు ఎలా చేయాలి? అలా చేయడం వల్ల సంప్రాప్తించే ఫలితాలు ఎలా ఉంటాయో వివరించాడు వసుదేవ సుతుడు. అందుకే భగవద్గీత ఆలోచింపజేసి, ఆచరింపజేస్తుంది అంటారు.
మహాత్మాగాంధీ స్వాతంత్య్ర ఉద్యమ నేతగా పరిస్థితులను బట్టి వ్యవహరించే తీరు తెన్నులు భగవద్గీత అధ్యయనం వల్లనే తనకు అబ్బినట్లు అనేక సందర్భాల్లో పేర్కొన్నారు.
”పరిస్థితులను బట్టి తనను తాను తాను సర్దుబాటు చేసుకోగలిగిన వ్యక్తి మాత్రమే సమాజంలో ప్రశాంత జీవనం గడపగలడు. కానీ అందుకు వ్యతిరేకంగా వ్యవహరించే వారెప్పుడూ సుఖ సంతోషాలు పొందలేదు” అంటాడు భర్తృహరి. నేడు ప్రజలు సమాయానుకూలంగా ప్రవర్తించని కారణంగానే వ్యక్తిగతంగా అనేక కష్టాలు ఎదుర్కోవలసి వస్త్తోంది. పరిస్థితులను ఆకళింపు చేసుకుని అందుకు అనుగుణమైన జీవన శైలిని అనుసరించపోవడం వల్లనే మహమ్మారి రోగాలు మనుషుల్ని బలిగొంటున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు కాలానుగుణంగా నడుచుకునే పద్ధతుల్ని ఆచరించడానికి అలవాటు పడితే, సమయాన్ని బట్టి పనులు చేసే వ్యక్తిత్వం తయారవుతుందనేది ముమ్మాటికీ నిజం.


పరికిపండ్ల సారంగపాణి
9849630290

Advertisement

తాజా వార్తలు

Advertisement