Friday, March 29, 2024

భక్తులను భద్రంగా కాపాడే భద్రకాళి!

తాంభద్రకాళీం తపసా జ్యలన్తీం
మహేశ్వరీమ్‌ శుద్ధ మహా ప్రతిష్టామ్‌
శుద్దాత్మ కాళాయణ గుణాత్మ భావాం
వన్దే సదా చేతసి భద్రకాళీమ్‌
ఓరుగల్లులో కొలువై ఉన్న భద్రకాళీ అమ్మవారు భక్తుల కోర్కెలు తీరుస్తూ భక్తులపాలిట కొంగు బంగా రంగా విరాజిల్లుతోంది. అమ్మవారికి ఈనెల 10వ తేదీ ఆషాఢ శుక్ల పాడ్యమి నుండి శాకంబరీదేవి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 25వ తేదీ వరకు జరుతున్న సందర్భంగా…
హనుమకొండ- వరంగల్‌ నగరాల మధ్యంతరంగా అంద మైన కొండల నడుమ తటాకం పక్కన ప్రకృతి అందాలతో విశేషం గా అలరింపచేస్తున్న ఆలయ నిర్మాణం గురించి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఇది ప్రాచీన క్షేత్రం. కొందరు దీన్ని ఆదివాసీయుల ఆలయంగా కొలుస్తారు. చాళుక్య చక్రవర్తి రెండవ పులకేశి క్రీ.శ. 625లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా పేర్కొంటుం డగా మరికొందరు ఇది కాకతీయుల కాలంలో బేతరాజు నిర్మాణం చేయిం చినట్లుగా ఆధారాలున్నాయని అంటారు. రుద్రదేవుడు తన రాజధానిని వరంగల్‌ కోటకు మార్చిన అనంతరం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయగా గణపతి దేవుడు ముఖ మండపం కట్టించి చెరు వును త్రవ్వించినట్లుగా తెలుస్తోంది. 1950 ప్రాంతంలో జీర్ణదశ లో ఉన్న ఈ ఆలయం పునరుద్ధరణ జరిగింది. అప్పటి నుంచి ఈనాటి వరకు దశల వారిగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈనాడు ఈ ఆలయం తెలంగాణ ప్రాంతంలోనే ముఖ్యమైన ఆల యంగా నిలిచింది. అమ్మవారికి ప్రతి సంవత్సరం దసరా ఉత్స వాల సందర్భంగా నిర్వ#హంచే శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు వివిధ రకాల పండ్లు, కూరగాయలతో అమ్మవారిని అలంక రించి శాకంబరీ ఉత్సవాలు చేస్తారు. ఈ శాకంబరీ ఉత్సవాలలో భాగంగా 14వ రోజు ఉదయం అమ్మవారిని దశ మహావిద్యలతో అద్యవిద్యయైన కాళీ ఆరాధన పద్ధతిలో ముద్రాక్రమంలో అలంక రించి అనుష్టానం నిర్వహస్తారు. సాయంత్రం షోఢశాక్రమంలో జ్వాలామాలినీ క్రమంలో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వ హిస్తారు. అమ్మవారిని బెండకాయ, నల్ల వంకాయ, దోసకాయ, పూల దండలతో అలంకరిస్తారు. 15వ రోజున అమ్మవారిని కాళీ క్రమంలోని మితాక్రమంలో అలంకరిస్తారు. అమ్మవారు మహా శాకంబరి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. సాయంత్రం చిత్రా నిత్యాక్రమంలో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. మితాక్రమం తో పాటు మహా శాకంబరి దర్శనంతో భక్తులకు పుణ్యప్రాప్తి లభి స్తుంది. ఈ వేడుకల సమయాల్లో లక్షలాది భక్తులు భద్రకాళీ అమ్మ వారిని సేవిస్తూ తరిస్తుంటారు. ఈ పర్వదిన వేడుకల్లో భద్రకాళీ అమ్మవారికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో పూర్ణాభిషేకం, విజయ దశమి వేళ అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిచడం ఆనవాయితీగా వస్తోంది. శ్రావణ మాసం నెల మొత్తంతో పాటు ప్రతీ శుక్ర, ఆదివారాలలో భక్తుల రద్దీ విపరీతంగా కనిపిస్తుంటుంది. వరంగల్‌ నగరానికి ఏ అధికార, అనధికార ప్రముఖులొచ్చినా.. తమ కార్యక్రమంలో భాగంగా భద్రకాళీ ఆలయానికి విచ్చేసి అమ్మవారిని సందర్శించి వెళ్ళడం ఆనవాయితీగా వస్తోంది.
భద్రం శుద్దాత్మ విజ్ఞానం
భద్రలోకాసు రూపం
మంగళ కలయతీ
‘జనయతీయ శ్రీ భద్రకాళీ’ అని దేవీ భాగవతంలో మత్స్య పురాణంలో చెప్పబడిన 108 దేవీ పీఠాలలో ఈ క్షేత్రం భద్రేశ్వర క్షేత్రంగా ప్రతీతి. ఈమె ఆత్మ జ్ఞానమును, శుభములను ప్రసాదించే మహాశక్తి దేవతగా భక్తులు విశేషంగా కొలుస్తుంటారని పేర్కొన బడింది. తనను కొలిచే భక్తులను భద్రంగా కాపాడే తల్లిగా పేరొం దిన అమ్మవారిని కొలువని వారు ఈ ప్రాంతంలో లేరు.
– కొలనుపాక కుమారస్వామి
9963720669

Advertisement

తాజా వార్తలు

Advertisement