Saturday, April 20, 2024

బాలాపూర్‌ లడ్డూ 18.90 లక్షలు

– హోరాహోరీగా సాగిన వేలంపాట
– సొంతంచేసుకున్న మర్రి శశాంక్‌రెడ్డి, కడప ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌
– ఏపీ సీఎం జగన్‌కు బహుమానంగా అందిస్తామని వెల్లడి
బాలాపూర్‌ : దేశవిదేశాల్లో బాలాపూర్‌ లడ్డూకు ప్రత్యేక విశిష్టత నెలకొంది. నవరాత్రులు పూజలందుకున్న బాలాపూర్‌ వినాయకుడు గంగమ్మఒడిలో నిమజ్జనానికి అంగరంగ వైభవంగా తరలివెళ్లాడు. ఆదివారం ఉదయం 5 గంటలకు గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో మొదటిపూజ చేశారు. పూజలందుకున్న గణనాధుడు గ్రామంలోని పురవీధులగుండా ఊరేగింపుగా శోభాయాత్ర కొనసాగింది. గ్రామంలో డప్పువాయిద్యాలు ఆటపాటలతో, కళాకారుల బృందంతో యాత్ర కొనసాగించారు. 10.45 నిమిషాలకు బాలాపూర్‌ వినాయకుడి లడ్డువేలం గ్రామంలోని బొడ్రాయివద్ద నిర్వహించారు. లడ్డూ వేలంకు దాదాపు 25 మంది వేలంపాటకు పేర్లు నమోదుచేసుకున్నారు. లడ్డు వేలంపాటకు కడప, మీర్‌పేట్‌, నాదర్‌గుల్‌, ఇతరప్రాంతాలనుండి లడ్డు వేలంపాటకు ముదుకొచ్చారు. ఈలడ్డువేలంలో ప్రతిఒక్కరూ దక్కించుకోవాలన్న ఆకాంక్షతో తీవ్రంగాపోటీపడ్డారు. బాలాపూర్‌ భక్తసమాజం అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి, నిర్వాహకులు రూ.1116 లతో బాలాపూర్‌ లడ్డువేలంపాట ప్రారంభించారు. చివరగా శ్రీకాంత్‌రెడ్డి 14 లక్షల 50 వేలు, నరేందర్‌ 15 లక్షలు, శశాంక్‌రెడ్డి 15.50 లక్షలు, రఘునందనాచారి 16 లక్షలు, శ్రీకాంత్‌రెడ్డి 16.50 లక్షలు, నరేందర్‌ 17 లక్షలు, శ్రీకాంత్‌రెడ్డి 17.50 లక్షలు, మర్రిశశాంక్‌ రెడ్డి 18 లక్షలు, శ్రీకాంత్‌రెడ్డి 18.20 లక్షలు, నరేందర్‌ 18.30 లక్షలు, శశాంక్‌రెడ్డి 18.50 లక్షలు, నరేందర్‌ 18.70 లక్షలు, శ్రీకాంత్‌రెడ్డి 18.80 లక్షలు, చివరిగా నాదర్‌గుల్‌ గ్రామానికి చెందిన మర్రిశశాంక్‌రెడ్డి అతని పార్టనర్‌ కడప ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌ లు సంయుక్తంగా 18.90 లక్షలకు బాలాపూర్‌ లడ్డును కైవశంచేసుకున్నారు. బాలాపూర్‌ లడ్డును కైవసంచేసుకున్న 28వ వ్యక్తిగా నిలిచారు. గత సంవత్సరంకంటే లక్ష ముప్పైవేలు అధికంగా పలికింది.
బాలాపూర్‌ లడ్డూను ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి బహుకరిస్తాం : కడప ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌, మర్రి శశాంక్‌రెడ్డి
బాలాపూర్‌ లడ్డూను వేలంపాటలో 18లక్షల 90వేలకు సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని, ఈ లడ్డూను ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి బహుమతిగా అందిస్తామని వేలంపాటలో లడ్డూను సొంతంచేసుకున్న కడప ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌, మర్రి శశాంక్‌రెడ్డి తెలిపారు. 2018లో లడ్డూను దక్కించుకోవాలన్న ఉద్దేశంతో వేలంలో పాల్గొనడం జరిగిందని, గతంలో అనివార్యకారణాలవల్ల లడ్డూ వేలంపాటలో రాలేదని పేర్కొన్నారు. ఈసారి లడ్డూను దక్కించుకోవాలనే కృతనిశ్చయంతో ముం దుకురావడం జరిగిందన్నారు. గణనాథుని కృపాకటాక్షాలతో లడ్డూను దక్కించుకోవడం సంతోషంగావుందని పేర్కొన్నారు. కడప నుండి బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలన్న గొప్ప మనస్సుతో యాదవసంఘానికి చెందిన తనకు ఎమ్మెల్సీ ఇచ్చి చట్టసభలో కూర్చొబెట్టిన ఘనత జగన్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. లడ్డూ దక్కితే సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి ఇవ్వాలని అనుకోవడం జరిగిందన్నారు. రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్లతో కలసి లడ్డూను బహుకరిస్తామని పేర్కొన్నారు. ఈ బాలాపూర్‌ గణనాథుని నిమజ్జనోత్సవం, లడ్డూవేలం పాటలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగలకృష్ణారెడ్డి, కమిటి అధ్యక్షులు కళ్లెం నిరంజన్‌ రెడ్డి, కార్పొరేటర్లు బండారి మనోహర్‌, ఎర్ర మహేశ్వరి జైహింద్‌, బాలునాయక్‌, కోఆప్షన్‌ మెంబర్‌ రఘునందనాచారి, నిర్వాహకులు పన్నాల రాజేందర్‌రెడ్డి, మర్రి శశిధర్‌ రెడ్డి, కొలను తిరుపతిరెడ్డి తదితరులు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement